నారా లోకేష్‌లో ఎంత మార్పు.. ఇది క‌దా రాజ‌కీయం అంటే!

రాజ‌కీయాల్లో ప‌రిణితి సాధించ‌డం అంత ఈజీకాదు. ఎన్నో ఏళ్లు రాజ‌కీయాల్లో ఉన్నా.. ఎన్ని ప‌ద‌వులు అనుభ‌వించినా.. రాజ‌కీయంగా ప‌రిణితి సాధించిన వారు కొంద‌రే ఉన్నారు. అలాంటిది అతి త‌క్కువ స‌మ‌యంలోనే రాజ‌కీయంగా అనుభ‌వం సాధించ‌డంతోపాటు.. ప‌రిణితి సాధించ‌డం అంటే.. మాట‌లు కాదు. కానీ, నారా లోకేష్ దీనిని సాధించారు. ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు వైసీపీ నాయ‌కుల‌తో విమ‌ర్శ‌లు ఎదుర్కొన్న ఆయ‌న ఇప్పుడు అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. రాజ‌కీయంగా ఎంత ఎత్తుకు ఎదిగార‌నేది ఆయ‌న మాటల్లోనే కాదు.. చేత‌ల్లోనూ క‌నిపిస్తోంది.

తాజాగా మంగ‌ళ‌గిరిలో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో మాట్లాడిన నారా లోకేష్‌.. వ‌చ్చే 4 సంవ‌త్స‌రాల 9 నెల‌లు పూర్తిగా మంగ‌ళ‌గిరి అభివృద్ధి కోస‌మే ప‌నిచేస్తాన‌ని చెప్పారు. అంతేకాదు.. త‌న పార్టీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు కూడా ఇదే దృష్టిలో పెట్టుకోవాల‌ని సూచించారు. చివ‌రి మూడు మాసాలు మాత్ర‌మే మ‌ళ్లీ రాజ‌కీయాలు చేయాల‌ని అన్నారు. అప్ప‌టి వ‌ర‌కు నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధి పైనే దృష్టి పెట్టాల‌ని.. తానుకూడా అలానే చేస్తాన‌ని చెప్పుకొచ్చారు. ప్ర‌జ‌ల సంక్షేమం, మంగ‌ళ‌గిరిలో పేద‌రికం లేకుండా చూడ‌డం వంటివి త‌న ముందున్న ల‌క్ష్యాలుగా పేర్కొన్నారు.

కేవ‌లం ఎన్నిక‌ల స‌మ‌యంలోనే రాజ‌కీయాల‌పై దృష్టి పెట్టాల‌న్నారు. మంగ‌ళ‌గిరి నియోజ‌కవ‌ర్గాన్ని ద‌క్షిణ భార‌త దేశంలోనే ‘గోల్డ్ హ‌బ్‌’గా తీర్చిదిద్దాల‌నేది త‌న ల‌క్ష్యంగా చెప్పుకొచ్చారు. మంగ‌ళ‌గిరిలోని స్వ‌ర్ణ‌కారులు, చేనేత‌ల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు కృషి చేస్తాన‌ని హామీ ఇచ్చారు. అధునాత‌న నైపుణ్యాలు నేర్చుకునేందుకు, స‌రికొత్త డిజైన్ల‌ను అధ్య‌య‌నం చేసేందుకు 25 ఎక‌రాల్లో అతిపెద్ద ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేసేందుకు ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌న్నారు. అదేవిధంగా మంగ‌ళ‌గిరి ప్ర‌జ‌ల‌కు గ‌తంలో తాను ఇచ్చిన హామీల‌ను త్వ‌ర‌లోనే నెర‌వేరుస్తాన‌ని కూడా ఆయ‌న చెప్పారు.

ఇదే తొలిసారి కాదు..

రాజ‌కీయంగా ప‌రిణితి సాధించ‌డం.. నారా లోకేష్ విష‌యంలో ఇదే తొలిసారి కాదు. పార్టీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఆయ‌న మంత్రి ప‌ద‌విని స్వీక‌రించ‌క‌ముందే.. త‌నేంటో చూపించారు. ఉండ‌వ‌ల్లిలోని త‌న నివాసంలో ప్ర‌జాద‌ర్బార్ పేరుతో నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉన్నారు. తొలిసారిగా వారి నుంచి నేరుగా స‌మ‌స్య‌లు విన‌డంతోపాటు.. వారి నుంచి విన‌తి ప‌త్రాలు కూడా స్వీక‌రించారు. ఎంత‌టి స‌మ‌స్య‌తో వ‌చ్చినా.. స్వ‌ల్ప వ్య‌వ‌ధిలోనే వాటిని ప‌రిష్క‌రించే ఏర్పాటు చేశారు. దీనికి వ‌చ్చిన స్పంద‌న చూసిన సీఎం చంద్ర‌బాబు.. నేరుగా పార్టీ కార్యాల‌యాన్ని ప్ర‌జాద‌ర్బార్‌గా మార్చేశారు.

అదేవిధంగా ప్ర‌తిప‌క్షంపై విమ‌ర్శ‌లు త‌గ్గించ‌డంలోనూ నారా లోకేష్ ముందున్నారు. అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ రెండు మాసాల కాలంలో మాజీ సీఎం జ‌గ‌న్‌ను ఆయ‌న ఎక్క‌డా టార్గెట్ చేయ‌క‌పోవ‌డం , గ‌తంలో మాదిరిగా ‘సైకో’, తుగ్ల‌క్‌, జ‌గ్ల‌క్‌ అని వ్యాఖ్యానించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. మొత్తంగా నారా లోకేష్ స్వ‌ల్ప స‌మ‌యంలోనే ప‌రిణితి చెందిన రాజ‌కీయాలను ఒంట బ‌ట్టించుకోవ‌డం విశేషం.