’36’ లెక్క అడిగితే.. జగన్ భోజ‌నం చేసి వెళ్ళమన్నారు

తాజాగా ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్ మీడియా స‌మావేశం పెట్టిన విష‌యం తెలిసిందే. అయితే.. ఇది సింగిల్ కెమెరా మీటింగ్. విలేక‌రులు చాలా మందే వ‌చ్చినా.. కెమెరాలు మాత్రం ఒక్క‌టే వ‌చ్చింది. అది కూడా.. సొంత మీడియా కెమెరా మాత్ర‌మే. ముందుగానే ఇత‌ర మీడియాల కెమెరాల‌ను తీసుకురావ‌ద్ద‌ని వైసీపీ అధిష్టానం ఆదేశించింది. విలేక‌రుల‌కు భోజ‌నాలు ఇక్క‌డే ఏర్పాటు చేస్తున్నామ‌ని కూడా చెప్పింది. అలాగే టీ, స్నాక్స్‌ను కూడా ఇచ్చారు. ఇంత వ‌ర‌కు ఓకే.. సుదీర్ఘంగా 1.20 నిమిషాల పాటు జ‌గ‌న్ ప్ర‌సంగించారు. గ‌త త‌న హ‌యాంలో జ‌రిగిన విష‌యాల‌ను వివ‌రించారు.

అదేవిధంగా చంద్ర‌బాబు గ‌త పాల‌న‌, ఇప్పుడు 45 రోజుల పాల‌న‌ను కూడా ఉటంకిస్తూ.. జ‌గ‌న్ వ్యాఖ్య‌లు చేశారు. బ‌డ్జెట్ను పోల్చారు. కేంద్రం, ఆర్బీఐ, ఆర్థిక శాఖ లెక్క‌లు కూడా తీశారు. ఇదంతా ఓకే ఓకే.. త‌ర్వాత గ‌తానికిభిన్నంగా మీడియా మిత్రులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు కూడా ఆయ‌న కొన్నింటికి స‌మాధానాలు చెప్పారు. అయితే.. ఈ లోగా ఓ మీడియా ప్ర‌తినిధి.. ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న సంధించారు. సార్ గ‌త 45 రోజుల్లో 36 మంది వైసీపీ కార్య‌క‌ర్త‌లు హ‌త్య‌కు గుర‌య్యార‌ని చెబుతున్నారు క‌దా.. ఢిల్లీలో కూడా ధ‌ర్నా చేశారు క‌దా.. మ‌రి ఆ 36 మంది పేర్లు చెబుతారా? అని ప్ర‌శ్నించారు.

అంతే! అప్ప‌టి వ‌ర‌కు అంతో ఇంతో ఉల్లాసంగా క‌నిపించిన జ‌గ‌న్ ఫేస్ ఒక్క‌సారిగా మారిపోయింది. ఈ ప్ర‌శ్న‌కు ఆయ‌న స‌మాధానం చెబుతారేమోన‌ని మీడియా మిత్రులు రెండు క‌ళ్ల‌ను తాటికాయంత చేసుకుని.. పెన్నులు ప‌ట్టుకుని.. పుస్త‌కాలు స‌రిచేసుకుని రెండుచెవులు రెక్కించి చూశారు. అయితే.. జ‌గ‌న్ త‌న త‌ల‌ను ఒక‌సారి త‌న ముందున్న టేబుల్‌పైకి వంచారు. ఆ వెంట‌నే ప్ర‌శ్నించిన విలేక‌రివైపు చూస్తూ.. భోజ‌నానికి టైం అయింది. ఇప్ప‌టికే ఆల‌స్య‌మైంది. మీరంతా ఎదురు చూస్తున్నారు. ప‌దండి వెళ్దాం అంటూ ఒక్క ఉబుకున సీటు లోంచి లేచి నిల‌బ‌డ్డారు!!

కానీ, వాస్త‌వానికి.. నిన్న మొన్న‌టి వ‌ర‌కు కూడా రాష్ట్రంలో 36 మంది చ‌నిపోయార‌ని.. చంద్ర‌బాబు హ‌యాంలో హ‌త్యారాజ‌కీ యాలు కొన‌సాగుతున్నాయ‌ని జ‌గ‌న్ స‌హా వైసీపీ నాయ‌కులు పెద్ద ఎత్తున ఆరోపించారు. ఈ క్ర‌మంలోనే ఢిల్లీలో కూడా ధ‌ర్నా చేశారు. అయితే..ఆ వివ‌రాలు ఇవ్వాల‌ని హోం మంత్రి అనిత నుంచి సీఎం చంద్ర‌బాబు వ‌ర‌కు కూడా అసెంబ్లీలో ప్ర‌శ్నించారు. ఆ వివ‌రాలు ఇప్ప‌టి వ‌ర‌కు ఇవ్వలేదు. తాజాగా మ‌రో మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ కూడా అడిగారు. ఇక‌, విలేక‌రులు కూడా ఇవ్వ‌మ‌న్నారు. కానీ, జ‌గ‌న్ మౌనంగా ఉన్నారు. మ‌రి వారు చెబుతున్న నెంబ‌ర్ త‌ప్పా? రైటా? అనేది చ‌ర్చ‌గా మారింది.