అబ్బో .. పెద్దరెడ్డిది ‘పెద్ద’ ప్లానే !

అధికారంలో ఉన్నప్పుడు అంటే ఏదో అభద్రతాభావం, రక్షణ సంబంధిత విషయాలు అని భావించవచ్చు. కానీ అధికారం పోయిన తర్వాత కూడా ఆలోచనలు మార్చుకోలేక పోతే దానిని దుర్భుద్ది, దుర్మార్గం అనే అంటారు. వైసీపీ పాలనలో చిత్తూరు జిల్లాలో చక్రం తిప్పిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీరును చూస్తే చింతచచ్చినా పులుపు చావలేదు, కిందపడ్డా మీది చేయి నాదే అన్న సామెతలు గుర్తుకు వస్తున్నాయి.

తిరుపతి పట్టణంలోని రాయల్ నగర్ లో ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నివాసం మీదుగా మారుతి నగర్ – రాయల్ నగర్ ప్రాంతాల ప్రజలు రాకపోకలు సాగించేందుకు వీలుగా 2019 – 2020 సంవత్సరంలో రూ.9.51 లక్షల తిరుపతి కార్పోరేషన్ నిధులను వెచ్చించి సిమెంటు రహదారిని నిర్మించారు. నిర్మాణం పూర్తయిన తర్వాత మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రోడ్డుకు రెండు వైపులా రెండు గేట్లు పెట్టి స్థానికులు, ఇతరులు ఆ రోడ్డు మీద రాకుండా మూసివేశారు.

దీంతో ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ నేతలు ఫిర్యాదు చేయడంతో ఆ గేట్లను తీసివేసేందుకు అధికారులు ప్రయత్నించారు. దీంతో పెద్దిరెడ్డి నేరుగా తన ఇంటి వద్ద ఉన్న గేట్లను అధికారులు తొలగిస్తున్నారంటూ పిటీషన్ వేశారు. దీంతో హైకోర్టు యధాతధస్థితి కొనసాగించాలని ఆదేశాలు జారీచేసింది. అనంతరం పూర్తి విషయం తెలుసుకుని రెండు గేట్లు తెరిచి పెట్టాలని సూచించింది.

అయితే గేట్లు తెరిచిన కొంత సేపటికే ఈ రెండు గేట్లకు పెద్దిరెడ్డి కార్యాలయం ముందు మరో గేటు ఏర్పాటు చేసి స్థానికుల రాకపోకలు జరగకుండా అడ్డుకోవడం గమనార్హం. అయితే కోర్టు వ్యవహారాలు తేలేందుకు బాగా సమయం పడుతుందన్న ఆలోచనతోనే మధ్యలో మరో గేటు పెట్టినట్లు భావిస్తున్నారు. న్యాయస్థానం ఆదేశాలు బేకాతరు చేస్తూ పెద్దిరెడ్డి వ్యవహరిస్తున్నాడని, స్థానిక అధికారులు కూడా ఈ విషయంలో చొరవ తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ప్రభుత్వం, న్యాయస్థానం ఈ విషయంలో కలగజేసుకుని రాకపోకలు జరిగేలా గేట్లను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.