మొత్తానికి కేసీఆర్ బయటకి వచ్చారు

రాష్ట్రంలో వంచెన ప్ర‌భుత్వం కొన‌సాగుతోంద‌ని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యానించారు. అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశానికి హాజ‌రైన ఆయ‌న అనంత‌రం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మీడియా తో మాట్లాడారు. ఈ రోజు ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్‌లో ఎవ‌రి ఆకాంక్ష‌లు ప్ర‌తిబింబించ‌డం లేద‌న్నారు. రాష్ట్ర రైతాంగాన్ని పొగుడుతున్న‌ట్టుగా క‌నిపిస్తూ.. వెన్నుపోటు పొడించింద‌ని ఆరోపించారు. గ‌తంలో తాము అమ‌లు చేసిన రైతు బంధు ప‌థ‌కం పేరును మార్చి రైతు భ‌రోసాలో అన్నీ ఇస్తామ‌ని.. గ‌తంలో కోత‌లు కోశార‌ని చెప్పారు.

అయితే.. బ‌డ్జెట్‌లో మాత్రం ఒక్క‌ పైసా కూడా విదిలించ‌లేద‌న్నారు. గ‌త త‌మ ప్ర‌భుత్వం అన్ని వ‌ర్గాల సంక్షేమాన్ని, రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించి అనేక ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ పెట్టింద‌న్నారు. ఉదాహ‌ర‌ణ‌కు యాద‌వుల అభ్యున్న‌తిని ఆకాంక్షించి.. గొర్రెల పెంపకం ప‌థ‌కం తెచ్చామ‌న్నారు. కానీ, ఈ ప్ర‌భుత్వం ఈ ప‌థ‌కాన్ని దాదాపు ఎత్తేసింద‌న్నారు. ద‌ళితుల కోసం ప్ర‌వేశ పెట్టిన ద‌ళిత బంధు ప‌థ‌కం ప్ర‌స్తావ‌న కూడా బ‌డ్జెట్‌లో లేద‌న్నారు. ద‌ళిత స‌మాజం ప‌ట్ల వీళ్ల‌కున్న నిర్ల‌క్ష్యానికి, ఫ్యూడ‌ల్ విధానానికి ఇంత‌క‌న్నా నిద‌ర్శ‌నంమ‌రొక‌టి లేద‌న్నారు.

అదేవిధంగా మ‌త్స్య‌కారుల‌కు కూడా భ‌రోసా లేదేని కేసీఆర్ అన్నారు. ఆర్థిక మంత్రి ఒత్తి ఒత్తి ప‌లికార‌ని.. కానీ, కొత్త‌గా ప్ర‌వేశ పెట్టిన ప‌థ‌కం అంటూ ఒక్క‌టి కూడా లేద‌న్నారు. మ‌హిళ‌ల ప‌ట్ల కూడా.. చాలా స్ప‌ష్టంగా చెప్పాల్సిన అవ‌స‌రం ఉన్నా.. ల‌క్ష కోట్లు ఇస్తామ‌న్నా.. అవ‌న్నీ రుణాలేన‌ని చెప్పారు. బ‌డ్జెట్‌లో ఏ ఒక్క పాల‌సీ ఫార్ములేష‌న్ జ‌ర‌గ‌లేద‌న్నారు. రాష్ట్రంలో వ్య‌వ‌సాయ స్తిరీక‌ర‌ణ జ‌ర‌గాల‌ని కోరుకున్నామ‌న్నారు. అందుకే రెండు పంట‌ల‌కు కూడా రైతు బంధు సొమ్ములు ఇచ్చామ‌న్నారు.

అయితే.. ఈ ప్ర‌భుత్వం ఆ సొమ్ముల‌ను మేం వృథా చేసిన‌ట్టు ప్రచారం చేసింద‌ని కేసీఆర్ విమ‌ర్శించారు. పేద రైతుల‌కు ఇచ్చిన సొమ్మును మేం పాడు చేశామ‌ని.. దుర్వినియోగం చేశామ‌ని చెబుతున్నారు. ఇవి దుర‌దృష్ట‌క‌ర‌మైన వ్యాఖ్య‌లేన‌ని అన్నారు. ఇది పూర్తి గా రైతు శ‌త్రు ప్ర‌భుత్వం. వారి నుంచి ధాన్యం కొన‌డం లేదు. విద్యుత స‌ర‌ఫ‌రా చేయ‌డం లేదు. బియ్యం కొన‌డం లేదు. అని దుయ్య‌బ‌ట్టారు. రైతులు చాలా ఇబ్బంది ప‌డుతున్నారు. క‌నీసం బ‌డ్జెట్‌లో రైతు బంధు గురించి కానీ, భ‌రోసా గురించి కానీ ప్ర‌స్తావ‌న లేద‌న్నారు.

రైతుల‌ను, వృత్తి కార్మికుల‌ను కూడా ఈ ప్ర‌భుత్వం వంచించింద‌ని కేసీఆర్ చెప్పారు. ఇండ‌స్ట్రియ‌ల్ పాల‌సీని ఒక్క‌టి కూడా ప్ర‌క‌టించ‌లేద‌న్నారు. అంతా గ్యాస్‌, ట్రాష్‌! అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో వ్య‌వ‌సాయ పాల‌సీ, ఇండ‌స్ట్రియ‌ల్ పాల‌సీ లేవ‌న్నారు. ఇదంతా గ్యాస్‌, ట్రాష్ బ‌డ్జెట్ అని కేసీఆర్ నిప్పులు చెరిగారు. కాగా, కొత్త ప్ర‌భుత్వం కావ‌డంతో ఆరు మాసాల స‌మ‌యం ఇవ్వాల‌ని తాను భావించాన‌ని.. అందుకే స‌భ‌కు రాలేద‌న్నారు. ప్ర‌స్తుతం బడ్జ‌ట్ స‌మావేశాలు కావ‌డంతో వ‌చ్చాన‌న్నారు. కానీ, అంతా తుస్సేన‌ని వ్యాఖ్యానించారు.