వైసీపీలో శ్వేత‌ప‌త్రాల క‌ల‌క‌లం..

కీలక అంశాల్లో కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న‌ నిర్ణయాలను గమనిస్తే చాలా రాజకీయ ఉద్దేశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. శ్వేతపత్రాల పేరుతో పోలవరం, అమరావతి, సహజ వనరులు, విద్యుత్, గ‌నులు, ఇసుక రంగాలు వంటి అనేక అంశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించారు.

అయితే ఒక్క ఇసుక‌, గ‌నుల‌ రంగం మినహా మిగిలిన వాటిలో వైసీపీ నాయకుల పాత్ర చాలా తక్కువగా ఉంది. పోలవరంలో గాని అమరావతి రాజధాని విషయంలో కానీ వైసీపీ నాయకుల పాత్ర లేదు.

పార్టీ అధిష్టానం… ముఖ్యమంత్రి స్థాయిలో తీసుకున్న నిర్ణయాలు ఆ రెండు చోట్ల ప్ర‌భావం చూపాయి. ఒక ఇసుక‌ విషయంలో మాత్రం క్షేత్రస్థాయి నాయకుల పాత్ర ఉంది. సీఎం చంద్రబాబు విడుదల చేసిన రెండు శ్వేత పత్రాలను గమనిస్తే.. వైసీపీ నాయకులు ఇసుక గనుల కుంభకోణానికి సంబంధించి సహజ వనరుల దోపిడీ పేరుతో చంద్రబాబు విడుదల చేసిన పత్రం… క‌ల‌క‌లం రేపింది. వైసీపీ నాయకులు పైకి చాలా గంభీరంగా కనిపిస్తున్నా క్షేత్రస్థాయిలో వీటిపై జోరుగానే చర్చ జరుగుతోంది.

ఎందుకంటే రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది వైసీపీ నాయకులు క్షేత్రస్థాయిలో ఇసుక వ్యవహారంలో వేలు పెట్టిన మాట వాస్త‌వం. దీంతో ఇప్పుడు ఏదైనా కేసులు నమోదు చేసి, విచారణలు చేపడితే.. త‌మ‌ మెడకు చుట్టుకుంటుంద‌న్న భావనలో వారు ఉన్నారు.

ఇక రెండోది తాజాగా ప్రవేశపెట్టిన లిక్కర్ శ్వేత ప‌త్రం దీనిలో కూడా కీలకమైన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఉన్నారనేది అధికార పార్టీ చెబుతున్న మాట. పేర్లు బయటికి చెప్పకపోయినా వైసీపీలోని కీలకమైన సామాజిక వర్గంలో కొందరు క్షేత్రస్థాయిలో మద్యం కుంభకోణానికి పాల్పడ్డారని, ప్రజల సొమ్మును దోచుకున్నారని ప్రభుత్వం వెల్లడించింది.

అంటే ఇది ఒక రకంగా మద్యం విధానాల్లో క్షేత్రస్థాయిలో ఎవరైతే వేలు పెట్టారో వారిని తీవ్రంగా ప్రభావితం చేశారనేది వాస్త‌వం. ఇది ముందు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరింత బలహీనపరచడంతో పాటు ఒకరకంగా ఈ శ్వేత ప‌త్రాల‌ నుంచి తప్పించుకోవాలి అంటే పార్టీ మారాల్సిన పరిస్థితిని కల్పిస్తోందనేది తెలుస్తుంది. సో ఎలా చూసుకున్నా.. ఈ రెండు శ్వేత పత్రాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను తీవ్రంగా కలిచి వేస్తున్నాయి అనేది మాత్రం వాస్తవం.