జ‌గ‌న్ ఓపెన్ మైండ్ రాజ‌కీయాలే బెస్ట్‌..!

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జగన్ తీసుకునే నిర్ణయాలు పార్టీకి శ్రీరామరక్ష. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరి మాట వినని నాయకుడిగా జగన్ పేరు తెచ్చుకున్నారు. ఆయన విన్నారా వినలేదా.. నాయకులు సలహాలు ఇచ్చారా లేదా.. లేక‌, ఎవరి పనిలో వారు ఉండిపోయారా? అనే విషయం ఎవరికీ తెలియదు. కానీ పార్టీ ఓడిపోయిన తర్వాత మాత్రం నేను చెప్పింది వినలేదు. నా మాట లెక్కచేయలేదు అంటూ చాలామంది నాయకులు.. మాజీ ఎమ్మెల్యేలు కూడా బహిరంగంగా విమర్శలు చేసిన పరిస్థితి తెర‌మీదికి వ‌చ్చింది.

ఒక‌వేళ‌ అది నిజమే అని అనుకుంటే మార్పు దిశ‌గా జ‌గ‌న్ అడుగులు వేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు పార్టీ అత్యంత సంక్లిష్ట స్థితిలోకి మారిపోయింది. 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే పార్టీకి మిగిలా రు. వీరిని ఒక వైపు కాపాడుకుంటూ.. మరోవైపు ఐదు సంవత్సరాల పాటు పార్టీని బతికించుకోవడం జగన్ కి చాలా ఇబ్బందికరమైన ప‌నేన‌ని చెప్పాలి. జగన్ ముందు ఉన్న ప్రధాన కర్తవ్యం ఓపెన్ మైండ్ రాజకీయాలు చేయుటమే. నాయ‌కుల మాట‌కు, వారి సూచ‌న‌ల‌కు, స‌ల‌హాల‌కు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది.

జ‌గ‌న్ స్వ‌యంగా.. తాను ఏమనుకుంటున్నారు? ఎలాంటి నిర్ణయం తీసుకుందామని భావిస్తున్నారు? ఏ విషయం మీద ముందుకు వెళ్లాలని అనుకుంటున్నారు? అనే విషయాన్ని పార్టీ నాయకులతో కలిసి చర్చించటం చాలా ముఖ్యం.

గ‌త ఐదేళ్లు ఈ ప‌రిస్థితి లేక‌పోవ‌డంతోనే పార్టీ తీవ్రంగా న‌ష్ట‌పోయింద‌ని అంటారు. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు ప్ర‌తిప‌క్షంలో ఉన్న ప‌రిస్థితిని గ‌మ‌నించుకుని.. నాయ‌కుల నిర్ణయాలకు కూడా ప్రాధాన్యం కల్పించడం ఇప్పుడు జగన్ ముందు ఉన్న ప్రధానమైనటువంటి ప‌రిస్థితి.

తాజాగా ఢిల్లీలో చేపట్టిన ధర్నా విషయాలను పరిశీలిస్తే దీనిని వైసీపీ నాయకులు స్వాగ‌తిస్తున్న‌ పరిస్థితి లేదు. ఎందుకంటే చాలామంది జగన్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించినట్టుగా వార్తలు వచ్చాయి. జాతీయస్థాయిలో యాగీ చేయటం ద్వారా పార్టీకి లాభం ఉండదని మెజారిటీ నాయకులు అన్నట్టుగా సమాచారం. ఇదిలావుంటే, ఢిల్లీలో ధర్నా చేస్తున్న విషయాన్ని జగన్ ముందుగానే వారితో చర్చించలేదనే వాద‌న వినిపించింది.

కేవ‌లం ప్రకటన రూపంలో మాత్రమే ఢిల్లీ ధ‌ర్నాపై స‌మాచారం ఇచ్చారని.. అంటున్నారు. అయితే ఇది కరెక్ట్ అవుతుందా..? కాదా? అనేది పక్కన పెడితే పార్టీలో ఇప్పుడు కావలసింది ఉమ్మడి నిర్ణయాలు. సమష్టి కృషి. ఐక్యంగా ముందుకు సాగటం. మూడు సూత్రాలను జగన్ పాటించేలా వ్యవహరించాలి. అప్పుడు మాత్ర‌మే బ‌లంగా పార్టీ నిల‌బ‌డే అవ‌కాశం ఉంటుంది.