వైసీపీకి తూ.గో.జి షాక్ ఇవ్వడం ఖాయమేనా ?!

ఏపీ ఎన్నికల్లో 11 శాసనసభ, 4 లోక్ సభ స్థానాలకు పరిమితం అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శాసనమండలిలో 35 మంది ఎమ్మెల్సీలు, అటు రాజ్యసభలో 11 మంది సభ్యులు ఉన్నారు. వీరి ఆధారంగా అటు కేంద్ర ప్రభుత్వాన్ని రాజ్యసభలో, ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని శాసనమండలిలో ఇరుకున పెట్టాలి అన్నది వైసీపీ వ్యూహాంగా తెలుస్తుంది. అయితే వీళ్లు కూడా చేజారే సంకేతాలు కనిపిస్తుండడం వైసీపీలో ఆందోళన రేపుతుంది.

తూర్పు గోదావరి జిల్లాలో బలమైన కాపు నేత తోట త్రిమూర్తులు 2019లో టీడీపీ నుండి వైసీపీలో చేరాడు. 2021లో వైసీపీ గవర్నర్ కోటాలో త్రిమూర్తులును ఎమ్మెల్సీని చేసింది. ఇటీవల ఎన్నికల్లో ఆయన మండపేట నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఐతే శిరోముండనం కేసులో త్రిమూర్తులుకు కోర్టు రెండేళ్లు జైలు శిక్ష విధించగా ఆయన దాని మీద అప్పీలుకు వెళ్లి తాత్కాలిక ఉపశమనం పొందాడు.

ఈ పరిస్థితులలో వైసీపీ అధికారం కోల్పోవడంతో అధికార పార్టీ అండ కోసం ఆయన బీజేపీలో చేరాలన్న ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తుంది. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామక్రిష్ణా రెడ్డి ఈ విషయాన్ని మంత్రి సత్యకుమార్ వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తుంది. అయితే వైసీపీ నుండి ఏ నేత చేరినా టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల మధ్య చర్చ జరగాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

ఇక ఇదే జిల్లాకు చెందిన వైఎస్ జగన్ నమ్మిన నేత పిల్లి సుభాష్ చంద్రబోస్. వైఎస్ కుటుంబానికి విధేయుడుగా ఉన్న ఆయన ఉమ్మడి రాష్ట్రంలో మంత్రి పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరి 2012 ఎన్నికల్లో ఓటమి పాలయ్యాడు. 2014లో రామచంద్రాపురం నుండి, 2019లో మండపేట నుండి పోటీ చేసి ఓడిపోయాడు. శాసనమండలి సభ్యుడుగా ఉన్న ఆయనను మంత్రిని చేసిన జగన్ ఆ తర్వాత మండలి రద్దు చేయాలన్న ఆలోచనతో వైసీపీ 2020లో రాజ్యసభకు పంపింది.

అయితే రామచంద్రాపురంలో వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన చెల్లుబోయిన వేణుగోపాల క్రిష్ణకు జగన్ మంత్రిగా అవకాశం ఇచ్చారు. అయితే తొలి నుండి విధేయుడుగా ఉన్న బోస్ ఈ విషయంలో అసంతృప్తిగా ఉండడంతో వేణును రాజమండ్రి రూరల్ కు పంపిన జగన్ బోస్ కుమారుడు సూర్యప్రకాష్ కు వైసీపీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చింది. అయితే టీడీపీ అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ చేతిలో సూర్యప్రకాష్ పరాజయం పాలయ్యాడు.

ఈ నేపథ్యంలో గోదావరి జిల్లాలలో జనసేన ప్రాభవం పెరుగుతుందని భావిస్తున్న సూర్యప్రకాష్ ఆ పార్టీలో చేరాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కుమారుడి భవిష్యత్తు కోసం బోస్ జనసేన తీర్ధం పుచ్చుకుంటారని ప్రచారం జరుగుతున్నది. తూర్పు గోదావరి జిల్లాలో బలంగా ఉన్న ఇద్దరు నేతలు వైసీపీని వీడతారన్న ప్రచారం ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారింది.