ఆ 15 వేల కోట్లు అప్పా .. గ్రాంటా?

తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్‌లో ఏపీ రాజ‌ధానికి రూ.15 వేల కోట్ల రూపాయ‌ల‌ను ప్ర‌క‌టించారు. అయితే.. ఈ ప్ర‌క‌ట‌న వెలువ‌డిన వెంట‌నే రాజ‌ధాని అమ‌రావ‌తిలోనూ.. ఏపీ అసెంబ్లీలోనూ(అప్పుడే గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగానికి ధ‌న్య‌వాదాలు తెలిపే తీర్మానం ప్ర‌వేశ పెట్టారు) సంబ‌రాల వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది. అయితే.. గంట‌లు గ‌డిచిన త‌ర్వాత‌.. ఇదే రూ.15 వేల కోట్ల‌పై తీవ్ర దుమారం రేగింది. వివాదంగా మారింది. అస‌లు కేంద్రం ఇచ్చింది.. గ్రాంటా? లేక అప్పా..? అనే విష‌యంపై తీవ్ర వివాదంగా మారింది.

తొలుత ఈ విష‌యాన్ని వైసీపీ ఎంపీ గురుమూర్తి పార్ల‌మెంటులోనే లేవ‌నెత్తారు. అయితే.. ఈ విష‌యంపై నిర్మ‌లా సీతారామ‌న్ అప్ప‌టిక‌ప్పుడు స్పందించ‌లేదు. త‌ర్వాత‌.. మీడియా స‌మావేశంలో స్పందించారు. ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి కేటాయించిన రూ.15 వేల కోట్లు అప్పు మాత్ర‌మే. దీనిని ఆర్బీఐ నుంచి ఇప్పిస్తాం. ఒక‌వేళ కుద‌ర‌క‌పోతే.. వేరే వ‌న‌రుల నుంచి ఇప్పిస్తాం. అయితే.. దీనిని ఎప్ప‌టిలోపు తీర్చాలి? ఎలా తీర్చాలి? ఎవ‌రు తీర్చాలి? అనే విష‌యాల‌పై ఏపీతో చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకుంటాం అని నిర్మ‌ల‌మ్మ స్ప‌ష్టం చేశారు. దీంతో రూ. 15000 కోట్లు గ్రాంట్లు(తిరిగి ఇవ్వాల్సిన అవ‌స‌రం లేని) కాద‌ని.. అప్పేన‌ని తేలిపోయింది.

చంద్ర‌బాబు రియాక్ష‌న్ ఇదీ..

అసెంబ్లీలో సీఎం చంద్ర‌బాబు గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగానికి ధ‌న్య‌వాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడుతున్న స‌మ‌యంలోనే ఈ విష‌యం ఆయ‌న‌కు కూడా తెలిసింది. రాష్ట్రానికి ఇస్తామ‌ని ప్ర‌క‌టించిన మొత్తం రూ.15 వేల కోట్లు కూడా అప్పేన‌ని తెలియ‌డంతో ఆయ‌న ఆశ్చ‌ర్య‌పోలేదు. ఏదో ఒక రూపంలో త‌మ‌కు అందితే చాల‌ని.. ప్ర‌స్తుతం ఉన్న రాష్ట్ర ప‌రిస్థితుల నేప‌థ్యంలో దీనిని స‌ద్వినియోగం చేసుకుంటామ‌ని చెప్పారు.