తెలంగాణ ఊసేలేని కేంద్ర బ‌డ్జెట్‌!!

మిత్రుల‌కు మాత్ర‌మే ప‌రిమితం అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించిన కేంద్ర బ‌డ్జెట్‌లో తెలంగాణ‌కు చోటు పెట్ట‌క పోవ‌డం గ‌మ‌నార్హం. నిజానికి గ‌త 2019 ఎన్నిక‌ల‌తో పోల్చుకుంటే.. ఇప్పుడు జ‌రిగిన పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో ఇక్క‌డి ప్ర‌జ‌లు 8 స్థానాల‌ను బీజేపీకి అప్ప‌గించారు.

దీంతో రాష్ట్రానికి పెద్ద ఎత్తున నిధులు వ‌స్తాయ‌ని అంద‌రూ ఎదురు చూశారు. కానీ, తాజాగా వెలువ‌రించిన బ‌డ్జెట్‌లో తెలంగాణ ఊసు ఎక్క‌డా వినిపించ లేదు. ప్ర‌ధానంగా బ‌డ్జెట్ స‌మావేశాల‌కు ముందు.. సీఎం రేవంత్ రెడ్డి స్వ‌యంగా వెళ్లి క‌లిసినా.. ప్ర‌యోజ‌నం క‌నిపించ‌లేదు.

విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న అంశాల‌ను ఆయ‌న ఏక‌రువు పెట్టారు. తాజా బ‌డ్జెట్‌లో అయినా.. కోచ్ ఫ్యాక్ట‌రీ ఏర్పాటు చేయాల‌ని.. వెనుక‌బ‌డి ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌.. వంటి 12 జిల్లాల‌కు సాయం చేయాల‌ని అభ్య‌ర్థించారు. అదేవిధంగా ఏపీకి ప్రెట్రోకెమిక‌ల్ ఫ్యాక్ట‌రీ ఇస్తే..(ఇవ్వ‌లేదు) మాకు కూడా ఇవ్వాల‌న్నారు. కానీ, ఎలాంటి ప్ర‌తిపాద‌న‌లు లేకుండానే బ‌డ్జ‌ట్ ముగిసిపోయింది. మొత్తంగా తెలంగాణ ప్ర‌స్తావ‌న లేకుండానే.. ప్ర‌స్తుతం బ‌డ్జెట్ ఉండ‌డం నిజంగా రాష్ట్రానికి పెను అన్యాయం చేసిన‌ట్టేన‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.

గ‌తంలో కేసీఆర్ త‌ర‌ఫున కొంద‌రు ఎంపీలు ఒత్తిడి తెచ్చే ప్ర‌య‌త్నం చేసిన‌ప్పుడు.. గిరిజ‌న యూనివ‌ర్సి టీని ఏర్పాటు చేస్తున్న‌ట్టు గత బ‌డ్జెట్‌లో ప్ర‌తిపాదించారు. సింగ‌రేణికి ఆదుకుంటామ‌ని హామీ ఇచ్చారు. కానీ..ఇప్పుడు అస‌లు రూపాయి కూడా ప్ర‌త్యేకంగా తెలంగాణ‌కు ఎలాంటి కేటాయింపులుచేయ‌లేదు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఉండ‌డ‌మే దీనికి కార‌ణ‌మ‌నే భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఇదే స‌మ‌యంలో కేంద్రంలో త‌మ స‌ర్కారుకు మ‌ద్ద‌తు ఇచ్చిన పార్టీల్లోనూ కొన్నింటికి మాత్ర‌మే న్యాయం చేయ‌గా.. క‌ర్ణాట‌క‌లో జేడీఎస్ మ‌ద్ద‌తిచ్చినా.. అక్క‌డ కూడా ఎలాంటి ప్ర‌తిపాద‌న‌లు చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.