అంత ఖరీదైన టాయిలెట్ నేను కూడా చూడలేదు : బాబు 

రుషికొండ. వైసీపీ ఓటమికి ప్రధానపాత్ర పోషించింది ఇదే అని చెప్పక తప్పదు. అక్కడ ఉన్న పర్యాటక శాఖ వసతి గృహాలను కూల్చివేసి కొత్త నిర్మాణం చేపట్డడం తీవ్ర చర్చ, విమర్శలు, ఉద్రిక్తతలకు దారి తీసింది. అక్కడ నిర్మించిన ఖరీదైన భవనం పర్యాటకులకోసమే అని వైసీపీ చెబుతున్నా, తాము తిరిగి అధికారంలోకిి వస్తే విశాఖ రాజధానిగా పాలన చేస్తామని జగన్ చెప్పిన నేపథ్యంలో రుషికొండ మీద ఉండేందుకే దానిని నిర్మించారన్నది వైసీపీ వ్యతిరేకవర్గాల వాదన.

ఈ పరిస్థితులలో ఎన్నికల్లో ఓటమి తర్వాత మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రుషికొండ ప్యాలెస్ తాళాలు తీయించి మీడియాకు చూయించడంతో అక్కడ అంత ఖరీదుతో నిర్మించిన భవనాలు పర్యాటకుల కోసం కాదు, ఖచ్చితంగా జగన్ తన కోసమే నిర్మించాడన్న వాదనకు బలం చేకూరింది.

ఏపీలో శాసనసభ సమావేశాల నేపథ్యంలో నిర్వహించిన బీఎసీ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుల మధ్య రుషికొండ ప్యాలేస్ మీద నడిచిన సంభాషణ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రుషికొండ ప్యాలేస్ ను ప్రజల సందర్శనకు అవకాశం ఇవ్వాలని విష్ణుకుమార్ రాజు చంద్రబాబును కోరారు. 

అందులో ఉన్న ఖరీదైన రూ.25 లక్షల టాయిలెట్ అందరికీ చూయించాలని, దీని కోసం రూ.30 లేదా రూ.50 ప్రవేశ రుసుముగా నిర్ణయించాలని విష్ణుకుమార్ రాజు సూచించారు. దీనికి స్పందించిన చంద్రబాబు మరీ రూ.50 అంటే ఎక్కువ అవుతుందేమో .. అయినా అంత ఖరీదైన టాయిలెట్ నేను కూడా చూడలేదని అన్నారు. రుషికొండ ప్యాలెస్ అంశాన్ని ఈ శాసనసభ సమావేశాలలో చర్చకు పెట్టాలని, ఆ ప్యాలెస్ లో ఉన్న ప్రతి వస్తువు వద్ద దాని ఖరీదును ప్రదర్శించాలని విష్ణుకుమార్ రాజు కోరినట్లు తెలుస్తుంది.