ష‌ర్మిల సొమ్ములు కొట్టేశారా? నేత‌ల గుస్సా వెనుక‌!

ఏపీ కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు పెరుగుతున్నాయా? ముఖ్యంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైయస్ షర్మిలకు వ్యతిరేకంగా కీలక నాయకులు పార్టీ కార్యకలాపాలకు కూడా దూరంగా ఉంటున్నారా? అంటే అవుననే అంటున్నారు సీనియర్ నేతలు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని పుంజుకునేలా చేయాలనేది పార్టీ అధిష్టానం నిర్ణ‌యం. ఈ క్రమంలోనే పలు ఆరోపణలు వచ్చినా ఎన్నికలకు ముందు షర్మిల ఒంటెత్తు పోకడలు పోయారని విమర్శలు ఎదురైనా ఆమెను అధ్యక్షురాలుగా కొనసాగించేందుకు పార్టీ అధిష్టానం మొగ్గుచూపింది.

అయితే క్షేత్రస్థాయిలో మాత్రం పార్టీ అంత‌ పటిష్టంగా అయితే కనిపించడం లేదు. ఉన్న నలుగురు నాయకులు కూడా ఎవరికి వారుగా ఉండటం.. ఎవరికి వారు గ్రూపులు కట్టడం వంటివి ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ప్రధానంగా ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తరఫున కర్ణాటక నుంచి అదే విధంగా తెలంగాణ నుంచి కొంత సొమ్ము ఏపీకి అందినట్టు తెలిసింది. సహజంగా ఎన్నికల ఖర్చుల కోసం కాంగ్రెస్ పార్టీ ఈ బాధ్యతలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు అప్పచెప్తుంది.

అదేవిధంగా ఏపీకి సంబంధించి కూడా నిధులు ఇచ్చే అంశాన్ని తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాలు తీసుకున్నాయి. అయితే షర్మిల ఆ సొమ్ములు సరిగ్గా పంచలేదని కొందరి ఆరోపణ. నిజానికి ఎన్నికల సమయంలో ఇచ్చిన సొమ్ముకు లెక్కలు ఉండవు. ఇది అన్ని పార్టీలు అనుసరించే విధానమే. ఇది నిబంధనలకు విరుద్ధం కాబట్టి దీనికి లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదు. అయితే షర్మిలకు వ్యతిరేకంగా ఉన్న కొన్ని వర్గాలు ఈ విషయాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ షర్మిల మున్ముందు కూడా ఇలానే వ్యవహరించే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నాయి.

మరోవైపు ఆమె పార్టీ లైనుకు కొంత దూరంగా కూడా వ్యవహరిస్తున్నారనేది సీనియర్ నాయకులు సాకే శైలజనాథ్, రఘువీరారెడ్డి అదేవిధంగా మరికొందరు కూడా అభిప్రాయపడుతున్నారు. ఇది షర్మిలకు సెగ పెంచుతోంది. అధిష్టానం నుంచి ఎంత బలమైన మద్దతు ఆమెకు లభించినా క్షేత్రస్థాయిలో నాయకులు, కార్యకర్తలు కనుక
సహకరించకపోతే పార్టీని ముందుకు తీసుకువెళ్లడంలో ఆమె విఫలమవుతారు. ఇప్పటికే విజయవాడ, గుంటూరు, అనంతపురం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో పార్టీ నాయకులు ఎవరికి వారుగా ఉన్నారు.

వీరిలో కొందరు పార్టీ మారేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. తమకు అనుకూలంగా ఉన్న పార్టీల్లో చేరాలని మరికొంద‌రు నేతలు నిర్ణయానికి వచ్చినట్టు తాజా సమాచారం. ఇప్పుడు సొంత పార్టీలో సహకరించే పరిస్థితి లేద‌నేది స్పష్టంగా కనిపిస్తోంది. వచ్చే నాలుగు సంవత్సరాలలో పార్టీని పుంజుకునేలా చేయాలని ఆమె ప్రయత్నాలు చేస్తున్నా.. క్షేత్రస్థాయిలో నాయకుల సహకారం లేకపోతే మాత్రం ఇది ఆమెకు సాధ్యమయ్యే పరిస్థితి లేదు. కాబట్టి అధిష్టానం ఎప్పటికైనా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచనలు వినిపిస్తున్నాయి.