రేవంత్ ప్లాన్ పక్కాగా అమలు చేస్తున్నాడా ?!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది ? బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను చేర్చుకునే విషయంలో సీఎం రేవంత్ తో పాటు, మంత్రి పొంగులేటి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డిలే ప్రధానంగా కనిపిస్తున్నారు. ఎక్కడ కూడా సీనియర్ కాంగ్రెస్ నేతలు కానీ, మంత్రులు కానీ కనిపించడం లేదు. రేవంత్ మాత్రం బీఆర్ఎస్ నుండి 26 మందిని ఖచ్చితంగా చేర్చుకుంటాం అని కఠినంగా చెబుతున్నాడు. ఈ నేపథ్యంలో ఇంత ఖచ్చితంగా రేవంత్ ఎందుకు పట్టుబడుతున్నాడని కాంగ్రెస్ వర్గాలలో చర్చ నడుస్తున్నది.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు దాటిపోయింది. మధ్యలో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో పరిపాలనకు ఎన్నికల కోడ్ అడ్డుగా నిలిచింది. లోక్ సభ ఎన్నికలు ముగియగానే మంత్రి వర్గ విస్తరణ ఖాయం అని అంతా అనుకున్నారు. కానీ గత ఏడాది డిసెంబరులో ప్రమాణ స్వీకారం చేసిన 12 మంది మంత్రులే కొనసాగుతున్నారు. ఆరు మంత్రి పదవులు అలాగే ఖాళీగా ఉన్నాయి. ఇటీవల రేవంత్, పలువురు మంత్రులు ఢిల్లీ పర్యటనకు వెళ్లినా కొలిక్కి రాలేదు. దీనికి రేవంత్ ఇచ్చిన జాబితానే కారణం అని ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి.

కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచనలకు భిన్నంగా రేవంత్ వెళ్తున్నాడన్న అనుమానాలు ఏఐసీసీలో ఉన్నట్లు తెలుస్తుంది. ఏపీ సీఎం చంద్రబాబు ఆశీస్సులతో కాంగ్రెస్ అధిష్టానంతో ఎలాంటి సమస్యలు వచ్చినా సొంత కుంపటి పెట్టుకునేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నాడని అంటున్నారు. ఇటీవల లోక్ సభ ఫలితాలలో 17 స్థానాలకు గాను కేవలం 8 స్థానాలకే కాంగ్రెస్ పరిమితం అయింది. ఇక్కడ రేవంత్ వ్యూహాత్మకంగా కొందరికి లబ్ది చేకూర్చేలా వ్యవహరించాడన్న అనుమానాలు ఏఐసీసీలో మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే త్రీమెన్ కమిటీని విచారణకు నియమించింది.

కాంగ్రెస్ పార్టీకి ఉన్న 65 మంది ఎమ్మెల్యేలలో సీనియర్ కాంగ్రెస్ నేతలు, ప్రస్తుత మంత్రులు మినహా మెజారిటీ ఎమ్మెల్యేలు రేవంత్ కు మద్దతుగా నిలుస్తారు. అయితే తనకు సొంతంగా కలిపి 60 పైచిలుకు ఎమ్మెల్యేలను కూడగట్టుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ లోకి చేరికల వ్యవహారం నడుస్తుందని సమాచారం. అప్పుడే కాంగ్రెస్ అధిష్టానం తాను తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉంటుందని రేవంత్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. లేకపోతే ప్రతిసారి కాంగ్రెస్ అధిష్టానం తీసుకునే నిర్ణయాలను అమలు చేయడానికే తన పాత్ర పరిమితం అవుతుందని, దానికి చెక్ పెట్టడమే చేరికల లక్ష్యం అని చెబుతున్నారు.