ఏపీలో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్: చంద్రబాబు

వైసీపీ పాలనలో ఖాళీగా ఉన్న భూములు మొదలు భూమి లోపల ఉన్న సహజ వనరుల వరకు వేటినీ వదలకుండా వైసీపీ నేతలు కబ్జా చేశారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అధికారాన్ని అడ్డుపెట్టుకొని అక్రమ మైనింగ్ చేస్తూ వేల కోట్ల రూపాయలను మాజీ మంత్రి పెద్దిరెడ్డి వంటి నేతలు అర్జించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఏపీలో వైసీపీ పాలలో జరిగిన సహజ వనరుల దోపిడీపై ఏపీ సీఎం చంద్రబాబు శ్వేత పత్రం విడుదల చేశారు. ఒక నమ్మకంతో ఐదేళ్లు పాలన చేయాలని ప్రజలు అధికారాన్ని ఇచ్చారని, కానీ ప్రజాధనానికి, ప్రజల ఆస్తులకు రక్షణగా ఉండకుండా పెత్తందారీతనంతో ఇష్టారాజ్యంగా ఉండమని ప్రజలు చెప్పలేదని జగన్ పాలనను ఉద్దేశించి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.

సహజ వనరుల దోపిడీలో పంచభూతాలను మింగేసి పరిస్థితికి వైసీపీ నేతలు వచ్చారని దుయ్యబట్టారు. అభివృద్ధి క్రమంలో ఏ ప్రాంతంలో అయినా భూములకు విలువ పెరుగుతుందని, అటువంటి భూములపై వివాదాలు సృష్టించి వాటిని కొట్టేయాలన్న పన్నాగాన్ని వైసీపీ నేతలు పన్నారని చంద్రబాబు ఆరోపించారు. అడవుల పరిరక్షణ కోసం ప్రత్యేకంగా ఒక శాఖను, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కూడా ఉందని గుర్తు చేశారు. అయితే పర్యావరణానికి మేలు చేసే అడవులను కూడా నిర్వీర్యం చేసిన పరిస్థితి వైసీపీ పాలనలో ఉందని విమర్శించారు.

రికార్డుల్లో అన్నీ ఉండవని, కొంతవరకే సమాచారం ఉందని చంద్రబాబు చెప్పారు. వాస్తవానికి వైసీపీ నేతలు దోచుకున్న శాతం కంటే తన దగ్గర తక్కువే సమాచారం ఉందని అన్నారు. విశాఖ, ఒంగోలు, తిరుపతి చిత్తూరులో భూకబ్జాలకు పాల్పడ్డారని, వైసీపీ కార్యాలయాల కోసం ఇళ్ల స్థలాలు, జగనన్న ఇళ్ల స్థలాల కోసం కబ్జాలకు పాల్పడ్డారని ఆరోపించారు. భూముల సరిహద్దులే మార్చేశారని, ఇక ఈ భూ అక్రమాలకు ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పరాకాష్ట అని చంద్రబాబు అన్నారు. వేరెవరికి భూములపై హక్కులు లేకుండా భూములు దోచుకోవడానికి ఈ యాక్ట్ తో రాచబాట వేసుకున్నారని చెప్పారు.

రామానాయుడు స్టూడియోకి ఇచ్చిన భూములను అక్రమంగా జగనన్న ఇళ్లకు ఇచ్చారని, అందులో వాటా కొట్టేశారని ఆరోపించారు. కోట్ల విలువ చేసే 15 ఎకరాల భూములను లక్ష రూపాయలు చొప్పున శారదా పీఠానికి కట్టబెట్టారని చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు. వీళ్ళ సొంత సొమ్ము అయినట్లు సాహి హియరింగ్ కేర్ సంస్థకు ఎకరా ఉచితంగా దానం చేశారని విమర్శించారు. ఇక ఒంగోలులో 100 కోట్ల విలువ చేసే భూ అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఇళ్ల పట్టాల విషయంలో మూడు వేల కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయని, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు చెందిన పది వేల ఎకరాల భూములను బలవంతంగా లాక్కున్నారని ఆరోపించారు.

ప్రజలంతా తమ భూములు సరిగా ఉన్నాయో లేదో ఒకసారి సరిచూసుకోవాలని గత ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, జగనన్న శాశ్వత భూ హక్కు పేరుతో ఏం చేసిందో తెలియదని చంద్రబాబు అన్నారు. ఒకవేళ తమ భూములు, ఆస్తులు కబ్జాలకు గురైనట్లు తెలిస్తే ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని చెప్పారు గుజరాత్ లో ఉన్న ల్యాండ్ గ్రాబింగ్ చట్టం ఏపీలో కూడా తెస్తామని, భవిష్యత్తులో కబ్జా చేయాలంటే భయపడే పరిస్థితిని తీసుకొస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.