సుప్రీం గడపతొక్కిన కేసీఆర్

“విద్యుత్ కొనుగోళ్లలో ఎలాంటి అక్రమాలు జరగలేదు. ఈఆర్ సీ నిర్ణయం మేరకే విద్యుత్ కొనుగోళ్లు జరిగాయి. విద్యుత్ నియంత్రణ కమిషన్ న్యాయబద్ధ సంస్థ. దీని మీద విచారణ కమీషన్ వేయకూడదు. కమిషన్‌ ఆఫ్‌ ఎంక్వయిరీ యాక్ట్‌ 1952, విద్యుత్తు చట్టం-2003కి ఇది విరుద్దం” అంటూ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.

బీఆర్ఎస్ పాలనలో విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నరసింహారెడ్డి కమిషన్ ను ఏర్పాటు చేసింది. దీనిని తప్పుపడుతూ కమీషన్ ను రద్దు చేయాలని కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే కమీషన్ నిబంధనల మేరకే వ్యవహరిస్తుందని హైకోర్టు కేసీఆర్ పిటీషన్ ను కొట్టి వేసింది.

ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విద్యుత్ కమిషన్ ను రద్దు చేయాలంటూ పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిపై సోమవారం సీజేఐ బెంచ్ విచారణ చేపట్టనుంది. ఛత్తీస్‌గఢ్‌ నుంచి తెలంగాణ విద్యుత్తు సంస్థలు చేసిన విద్యుత్తు కొనుగోళ్లు, భద్రాద్రి, యాదాద్రి థర్మల్‌ విద్యుత్తు కేంద్రాల నిర్మాణంపై విచారణ జరపడంతో పాటు..ఆ నిర్ణయాల్లోని నిబద్ధతను తేల్చడానికి రాష్ట్రప్రభుత్వం మార్చి 14న జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కమిషన్‌ ఏర్పాటు చేసింది.