డీఎస్సీలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే శాసన మండలి సమావేశాల సందర్భంగా మండలిలో ఈ వ్యవహారంపై వైసీపీ సభ్యులు, మంత్రుల మధ్య వాడీవేడీ చర్చ జరిగింది. ఈ క్రమంలోనే నిన్న మండలిని వాయిదా వేశారు. అయితే, జగన్, వైసీపీ సభ్యులు అసెంబ్లీకి రావాలని, అక్కడ ఏ విషయంపై అయినా చర్చకు సిద్ధమని విద్యాశాఖా మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. అయినా సరే, వైసీపీ సభ్యుల తీరు మారలేదు.
ఈ రోజు మండలికి ర్యాలీగా వెళ్లిన వైసీపీ ఎమ్మెల్సీలు ఆందోళన చేపట్టారు. డీఎస్సీపై సీబీఐ విచారణకు, మంత్రి నారా లోకేశ్ రాజీనామా కోసం నినాదాలు చేస్తూ వైసీపీ ఎమ్మెల్సీలు మండలి వైపు ర్యాలీగా వెళ్లారు. ఈ క్రమంలోనే వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో, మండలి గేటు ముందు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఆ తర్వాత సభ మొదలైంది.
ఇక, మండలి మొదలైన తర్వాత కూడా సభలో డీఎస్సీ వ్యవహారంపై వాడీవేడి చర్చ జరిగింది. సభలో డీఎస్సీ అంశంపై చర్చించేందుకు సిద్ధమని శాసన సభ వ్యవహారాల, ఆర్థిక శాఖా మంత్రి పయ్యావుల కేశవ్ చెబుతున్నప్పటికీ వైసీపీ సభ్యులు వినలేదు. దీంతో, వారిపై పయ్యావుల ఫైర్ అయ్యారు. రా..నువ్వు వచ్చి కూర్చొని చెప్పు…అంటూ వైసీపీ ఎమ్మెల్సీలనుద్దేశించి పయ్యావుల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చకు రెడీ అని చెబుతున్నా వినడం లేదని, వైసీపీ సభ్యులు చెప్పినట్లు సభ నడవదని అన్నారు.
ప్రభుత్వాన్ని ఎవరు నడపాలన్నది ప్రజలు నిర్ణయించారని అన్నారు. ఏ సబ్జెక్ట్ పై చర్చించాలన్నది ప్రభుత్వం ఇష్టమని చెప్పారు. ఎల్ నినో వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారని, వ్యవసాయం గురించి సభలో చర్చ జరగాల్సి ఉందని అన్నారు. కానీ, వైసీపీ సభ్యులు ప్రజల పట్ల ఏ మాత్రం బాధ్యత లేకుండా కేవలం రాజకీయాలు చేయడానికే సభకు వచ్చారని మండిపడ్డారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates