జ‌గ‌న్‌కు ఆర్‌ఆర్‌ఆర్‌ రిట‌ర్న్ గిఫ్ట్‌

ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు.. ఆ పార్టీ మాజీ నాయ‌కుడు, ప్ర‌స్తుత ఉండి నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే రఘురామ కృష్ణం రాజు.. ఉర‌ఫ్ ఆర్‌.ఆర్‌.ఆర్ రిట‌ర్న్ గిఫ్టు ఇచ్చారు. 2021-22 మ‌ధ్య ఎంపీగా ఉన్న త‌న‌ను అక్ర‌మంగా నిర్బంధించి క‌స్టోడియ‌ల్ టార్చ‌ర్ చేశార‌ని.. ఈ క్ర‌మంలో త‌నపై హ‌త్యాయ‌త్నం కూడా చేశార‌ని పేర్కొంటూ ర‌ఘురామ తాజాగా గుంటూరు జిల్లా న‌గ‌రం పాలెం పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. అప్పట్లో త‌న‌ను శారీర‌కంగా హింసించార‌ని.. రెబ్బ‌రు లాఠీల‌తో హింసించార‌ని తెలిపారు.

త‌న సెల్‌ఫోన్ ప‌ర్స‌నల్ లాక్ నెంబ‌రు చెప్పాలంటూ.. సీఐడీ అప్ప‌టి చీఫ్ సునీల్ కుమార్ త‌న‌ను కొట్టార‌ని ఫిర్యాదు చేశారు. ఈ స‌మ‌యంలో త‌న గుండెలపై కూర్చుని ఊపిరి ఆడ‌కుండా చేశార‌ని.. త‌న‌ను చంపే ప్ర‌య‌త్నం చేశార‌ని తెలిపారు. ఈ ఫిర్యాదు నేప‌థ్యంలో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఎవ‌రెవ‌రిపై ఫిర్యాదు..?

  • అప్ప‌టి సీఐడీ డీజీ సునీల్ త‌నను చావ‌బాదార‌ని.. త‌న గుండెల‌పై కూర్చుని.. హ‌త్య చేసేందుకు ప్ర‌య‌త్నించార‌ని ర‌ఘురామ ఫిర్యాదులో పేర్కొన్నారు.
  • రామాంజ‌నేయులు: అప్ప‌టి ఇంటెలిజెన్స్ చీఫ్‌గా వ్య‌వ‌హ‌రించిన ఆయ‌న త‌న‌ను వెంటాడార‌ని ర‌ఘురామ ఫిర్యాదులో పేర్కొన్నారు.
  • జ‌గ‌న్‌: అప్ప‌టి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ వీరిని ప్రోత్స‌హించి.. త‌న‌ను చంపించే ప్ర‌య‌త్నం చేశార‌ని ర‌ఘురామ తెలిపారు.
  • డాక్ట‌ర్ ప్ర‌భావ‌తి: గుంటూరు ప్ర‌భుత్వ ఆసుప‌త్రి సూప‌రింటెండెంట్‌గా ప‌నిచేసిన ప్ర‌భావ‌తి.. త‌న‌పై జ‌రిగిన దాడికి సంబంధించి త‌ప్పుడు రిపోర్టులు ఇచ్చార‌ని.. ఈమెపైనా కేసు న‌మోదు చేయాల‌ని ఫిర్యాదు చేశారు.
  • విజ‌య్‌పాల్‌: అప్ప‌టి గుంటూరు అద‌న‌పు ఎస్పీగా ఉన్న విజ‌య్‌పాల్ త‌న‌ను వేధించార‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు మేరకు మాజీ సీఎం జగన్, ఐపిఎస్‌లు సునీల్ కుమార్, సీతారామంజనేయులు, విజయ్ పాల్‌, డాక్ట‌ర్ ప్ర‌భావ‌తిల‌పై కేసు నమోదు చేశారు.

ఏయే సెక్ష‌న్లు..?

120b, 166, 167, 197, 307, 326, 465, 506 r/w 34 IPCల కింద కేసు న‌మోదు చేశారు. వీటిలో తీవ్రంగా కొట్ట‌డం, బెదిరించ‌డం, హ‌త్యాయ‌త్నం, నిర్బంధించ‌డం, ఎలాంటి అనుమ‌తి తీసుకోకుండా అదుపులోకి తీసుకోవ‌డం వంటివి ఉన్నాయి.

అప్ప‌ట్లో ఏం జరిగింది?

2021లో నరసాపురం వైసీపీ ఎంపీగా ఉన్న ర‌ఘురామ వివిధ కార‌ణాల‌తో వైసీపీతో విభేదించిన విష‌యం తెలిసిందే. ఈ సమయంలో ఆయ‌న‌పై విద్వేషపూరిత ప్రసంగాలు, సోష‌ల్ మీడియాలో పోస్టులు, కొన్ని వర్గాల్లో ఉద్రిక్తత సృష్టించడం, ప్రభుత్వ ప్రముఖులపై దాడి వంటి ఆరోపణలతో హైదరాబాద్‌లో సీఐడీ అదుపులోకి తీసుకుంది. అదే రోజు రాత్రి ఆయ‌న‌ను క‌స్ట‌డీలో హింసించార‌నే ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. దీనిపై సుప్రీంకోర్టు విచార‌ణ జ‌ర‌ప‌డం, హైద‌రాబాద్‌లోని మిలిట‌రీ ఆసుప‌త్రిలో ర‌ఘురామ‌కు ప‌రీక్ష‌లు చేయ‌డం తెలిసిందే.