విభ‌జ‌న స‌మ‌స్య‌లు.. కొన్ని రాజ‌కీయాలు.. ఏం జ‌రుగుతోంది..?

ఏపీ తెలంగాణల మధ్య భజన అంశానికి సంబంధించి అనేక సమస్యలు పేరుకు పోయాయి. మరి ఈ సమస్యలను పరిష్కరించేందుకు చంద్రబాబు, రేవంత్ రెడ్డిలు ప్రయత్నాలు అయితే ప్రారంభించారు. ఇటీవ‌ల‌ జరిగిన సమావేశం సుహృద్భావ వాతావరణంలో జరిగిందని, సమస్యలు పరిష్కారానికి కమిటీలను వేస్తున్నామని ఇరు రాష్ట్రాల మంత్రులు.. భట్టి విక్రమార్క, అనగాని సత్యప్రసాద్ ప్రకటించారు. దీంతో ఎంతో కొంత పరిస్థితి బాగానే ఉంటుందని అందరూ అనుకున్నారు.

కానీ రోజులు గడిచే కొద్దీ ఈ తరహా పరిస్థితి మారుతోంది. ఎందుకంటే తెలంగాణలో ఉన్నటువంటి సామాజిక సమస్యలు, తెలంగాణ వాదం వంటివి అంత తేలిక‌గా మర్చి పోయే పరిస్థితి ఆ రాష్ట్రంలో లేదు. పైగా బలమైన ప్రతిపక్షం, తెలంగాణ వాదాన్ని వినిపించే నాయకులు వేలల్లో ఉండటంతో వారిని కాదని జలవివాదాలు నుంచి ఆస్తులు వివాదాల వరకు రేవంత్ రెడ్డి ఎట్లాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపించడం లేదు. ఇది ఒక భాగం. మ‌రోవైపు, రాజకీయంగా రేవంత్ రెడ్డికి చిక్కుముళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

పైగా త్వరలోనే స్థానిక సంస్థలు ఎన్నికలు కూడా తెలంగాణ రాష్ట్రంలో జరగనున్నాయి. వీటిలోనూ కాంగ్రెస్ పార్టీ పుంజుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పటికే అనేకమంది ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను పార్టీలో చేర్చుకున్నారు. ఇంతమంది చేర్చుకున్న తర్వాత కూడా స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకోకపోతే ఆ ప్రభావం రేవంత్ రెడ్డి నాయకత్వం మీద ఎక్కువగా ఉంటుంది. మరి స్థానిక సంస్థల్లో పుంజుకోవాలంటే విభజన చట్టం విషయంలో దూకుడు పెంచితే చాలా ప్రమాదకరమైన విషయం.

ఎందుకంటే కెసిఆర్ చాలా వ్యూహాత్మకంగా త్వరలోనే జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు. ఆ సమయంలో విభజన హక్కుల విషయంలో, విభజన చట్టానికి సంబంధించిన అంశాల విషయంలో ఏపీ వైపు మొగ్గు చూపుతున్నారని లేదా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు వంటి నాయకత్వానికి రేవంత్ లోబడుతున్నట్టుగా వ్యవహరిస్తున్నారని కనుక ఆయన ప్రచారం చేస్తే అది తెలంగాణ సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం కచ్చితంగా కనిపిస్తుంది. తెలంగాణను తెచ్చింది మేమే. కాపాడింది మేమే, తెలంగాణ అస్థిత్వాన్ని నిలబెట్టింది మేమే అని చెప్పుకునే బీఆర్ ఎస్‌కు ఇది బలమైన ఆయుధంగా మారుతుంది.

కాబట్టి రేవంత్ విషయంలో విభజన సమస్యలు చాలా ప్రశ్నార్ధకంగా మారుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జగ్గారెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు బిజెపి పంపించిన దూతగా వచ్చాడని, ఆయన వల్ల రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దెబ్బతింటుందని, కాంగ్రెస్ పార్టీని ఉద్దేశ పూర్వకంగా దెబ్బ కొట్టాలన్న ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీనే తన దూతగా చంద్రబాబును పంపించారని ఆయన వ్యాఖ్యానించారు. వాస్తవానికి విభజన సమస్యల పరిష్కారం కోసం చంద్రబాబు వెళ్లిన మాట వాస్తవం.

కానీ దీనిని చాలా వ్యూహాత్మకంగా జగ్గారెడ్డి రాజకీయ కోణంలో చూడడం అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని స్పష్టం చేస్తుంది. అంటే విభజన సమస్యలు ఎలా ఉన్నా చంద్రబాబు నాయుడు అడుగు పెట్టడంతో తెలంగాణలో ఒక విధమైన వ్యతిరేకత వచ్చే ప్రమాదాన్ని ఈయన ముందే పసిగట్టాడు. ఇది కాంగ్రెస్ పార్టీకి మేలు చేస్తుందా? చేయదా? అనేది పక్కన పెడితే మునుముందు జరగబోయే పరిణామాలలో కీల‌క‌ అంశాలను జగ్గారెడ్డి తన వ్యాఖ్యల ద్వారా స్పష్టం చేశారు.

అంటే ఎలా చూసుకున్నా విభజన సమస్యలు అంత తేలికగా అయితే పరిష్కారం అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా అంత ఈజీగా అయితే రేవంత్ రెడ్డి చంద్రబాబు ప్రభుత్వాల మధ్య వడంబడిక ద్వారా చర్చల ద్వారా సాగుతాయేమో తప్ప పరిష్కారం అయ్యేటటువంటి అవకాశం కనిపించడం లేదు. మ‌రి ఫ్యూచ‌ర్‌లో ఏం చేస్తారో చూడాలి.