మీడియా మిత్రుల‌కు చంద్ర‌బాబు సాఫ్ట్ కౌంట‌ర్‌!

ఏపీ సీఎం చంద్ర‌బాబు మీడియా మిత్రుల‌కు షాక్ ఇచ్చారు. వారిని ఉద్దేశించి.. నవ్వుతూనే చుర‌క‌లు అంటించారు. తాజాగా చంద్రబాబు విద్యుత్ రంగంపై శ్వేత ప‌త్రం విడుద‌ల చేశారు. అదేవిధంగా ఉచిత ఇసుక విధానాన్ని కూడా స‌మీక్షించారు. ఈ రెండు అంశాల‌పైనా ఆయ‌న మీడియా మీటింగ్ పెట్టి.. వాటిని వివ‌రించారు. రాష్ట్రంలో ఇసుక విధానంలో స‌మ‌గ్ర‌మైన మార్పును తీసుకు వ‌చ్చామ‌న్నారు. పేద‌ల‌కే కాకుండా.. మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గాల‌కు కూడా ఇసుక‌ను ఉచితంగా అందించాల‌న్న ల‌క్ష్యంతో ఉచిత ఇసుక ప‌థ‌కాన్ని తిరిగి తీసుకువ‌చ్చిన‌ట్టు చంద్ర‌బాబు చెప్పారు.

అదేవిధంగా రాష్ట్రంలో గ‌త ఐదేళ్ల కాలంలో అప్ప‌టి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ విద్యుత్ చార్జీల‌ను ఎలా పెంచార‌న్న విష‌యంపైనా ఆయన సోదాహ‌ర‌ణంగా ఉదాహ‌ర‌ణ‌లు.. లెక్క‌ల‌తో స‌హా వివ‌రించారు. ప్ర‌జ‌ల‌పై గ‌త ఐదేళ్ల కాలంలో రూ.32 వేల కో్ట్ల‌కు పైగా.. భారం మోపార‌ని చంద్ర‌బాబు వివ‌రించారు. ఇలా.. ఈ రెండు అంశాల‌ను కూడా.. చంద్ర‌బాబు స‌మ‌గ్రంగా మీడియాకు అర్థ‌మ‌య్యేలా ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్‌తో స‌హా వివ‌రించారు. అయితే.. ఈసంద‌ర్భంగా మీడియా మిత్రులు కొంద‌రు.. అనేక ప్ర‌శ్న‌ల‌తో ఉక్కిరి బిక్కిరి చేశారు. ముఖ్యంగా విద్యుత్ చార్జీల త‌గ్గింపు అంశాన్ని వారు ప్ర‌స్తావించారు.

దీనిపై కూడా చంద్ర‌బాబు ఓపిక‌గానే స‌మాధానం చెప్పారు. ప్ర‌స్తుతం ఉన్న వ్య‌వ‌స్థ‌ల‌ను స‌రిదిద్దేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నామ‌న్నారు. ముందు వ్య‌వ‌స్థ‌ను బాగు చేసే ప‌నిలో ఉన్నామ‌ని..త‌ర్వాత‌.. మార్పులు తీసుకువ‌స్తామ‌ని చెప్పారు. అయినా.. కొంద‌రు మిత్రులు మాత్రం ప‌దే ప‌దే ప్ర‌శ్న‌లు గుప్పించారు. దీంతో ఒకింత ఆగ్ర‌హం వ్య‌క్త‌మైనా.. చంద్ర‌బాబు చాలా సంయ‌మ‌నం తో వ్య‌వ‌హ‌రించారు. అలాగ‌ని ఊరుకోకుండా.. చాలా సౌమ్యంగా.. అంతే స్థాయిలో న‌వ్వుతూ.. ఆయ‌న మీడియా మిత్రుల‌కు చుర‌క‌లు అంటించారు.

“మీర‌డిగిన అన్ని ప్ర‌శ్న‌ల‌కు ప్ర‌జాస్వామ్య యుతంగా స‌మాధానాలు చెప్పా. గ‌డిచిన ఐదేళ్ల‌లో మిమ్మ‌ల్ని ఎవ‌రూ అడ్ర‌స్ చేయ‌లేదు(అంటే.. జ‌గ‌న్ అస‌లు మీడియా ముందుకు రాలేదని). కానీ, నేను మీకు అన్నీ పార‌ద‌ర్శకంగా చెబుతున్నా. అయినా.. న‌న్ను ఎమోష‌న‌ల్‌గా డిస్ట‌ర్బ్ చేయాల‌ని చూస్తున్నారు. గ‌త ఐదేళ్లు మీరు అస‌లు ప్రెస్ కాన్ఫ‌రెన్సే చూడ‌లా.(న‌వ్వుతూ..) కానీ, ఇప్పుడు వ‌చ్చి మాట్లాడుతున్నారు. నేను మీకు అన్నీ డెమొక్రాటిక‌ల్‌గా స‌మాధానం చెబుతున్నా. ఎందుకంటే.. నేను విశ్వాసంతో ఉన్నా.. న‌మ్మ‌కంతో ఉన్నా. ఎందుకంటే.. నేను చేసేది స‌రైందే. ఇదే మీరూ ఒప్పుకొంటారు. నేను కూడా ముందుకు వెళ్తాను” అని సుతిమెత్త‌గా చంద్ర‌బాబు కౌంట‌ర్ ఇచ్చారు. దీంతో మీడియా మిత్రులు మౌనంగా ఉండిపోయారు.