‘బీజేపీ’కి కొత్త అర్థం చెప్పిన రేవంత్‌.. జ‌గ‌న్‌పై ఫైర్‌!

ఏపీలో బీజేపీకి తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కొత్త అర్థం చెప్పారు. బీ-అంటే బాబు(సీఎం చంద్ర‌బాబు), జే-అంటే జ‌గ‌న్ (మాజీ సీఎం), పీ-అంటే ప‌వ‌న్ (డిప్యూటీ సీఎం) అని రేవంత్ వ్యాఖ్యానించారు. వీరి వ‌ల్ల రాష్ట్రానికి ఒరిగేది ఏమీ లేదన్నారు. ఇప్ప‌టికే టీడీపీ అధినేత చంద్ర‌బాబు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌లు బీజేపీతో పొత్తులో ఉన్నార‌ని చెప్పారు. ఇక‌, ఎలాంటి పొత్తులు లేక‌పోయినా.. మోడీ ముందు ‘జీ హుజూర్‌’ అంటూ.. చేతులు క‌ట్టుకున్నార‌ని ఎద్దేవా చేశారు. వీరంతో మోడీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీ పాల‌నే కొన‌సాగుతోంద‌న్నారు.

దీంతో ప్ర‌శ్నించేవారు.. ప్ర‌జా స‌మ‌స్య‌లు ప‌ట్టించుకునేవారు కూడా క‌నిపించ‌డం లేద‌ని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. వ‌చ్చే ఐదేళ్లు ప్ర‌జ‌ల‌కు అండ‌గా కాంగ్రెస్ పార్టీ ఉంటుంద‌న్నారు. ప్ర‌జ‌ల‌కు ఏ క‌ష్ట‌మోచ్చినా.. ఈ ‘బీజేపీ’ నేత‌లు ఒక్క‌రూ స్పందించ‌ర‌ని.. కానీ, ష‌ర్మిల మాత్రం స్పందిస్తార‌ని రేవంత్ వ్యాఖ్యానించారు. ఆమె వెనుక సైన్యంగా.. అండ‌గా తామంతా ఉన్నామ‌న్నారు. ష‌ర్మిల ఒంటరి నాయ‌కురాలు కాద‌న్నారు. ఆమె వెనుక భారీ కాంగ్రెస్ ప‌రివారం ఉంద‌న్నారు. ప్ర‌జ‌ల కోసం నిల‌బ‌డిన ష‌ర్మిల‌కు ప్ర‌జ‌లు కూడా మ‌ద్ద‌తు తెల‌పాల‌ని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

క్లిష్ట ప‌రిస్థితిలో ఉన్న ఏపీ కాంగ్రెస్‌ను గాడిలో పెట్టేందుకు ష‌ర్మిల ప్ర‌య‌త్నిస్తున్నార‌ని రేవంత్ కొనియాడారు. కాంగ్రెస్ నుంచి క‌నీసం స‌ర్పంచ్‌ను గెలిపించుకునే స‌త్తా కూడా లేద‌ని కొంద‌రు ఎద్దేవా చేశార‌ని.. అయిన‌ప్ప‌టికీ.. ష‌ర్మిల ప‌ట్టుద‌ల‌తో పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టార‌ని రేవంత్ తెలిపారు. త‌న తండ్రి దివంగ‌త రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఆశ‌యం సాధించేందుకు ఆమె తీసుకున్న బాధ్య‌త‌ల‌ను ప్ర‌తి కార్య‌క‌ర్త కూడా.. త‌మ‌విగా భావించాల‌ని రేవంత్ సూచించారు. అలాంటి షర్మిలకు తాము నూటికి నూరు శాతం అండ‌గా ఉంటామని, ఏ అవ‌స‌రం వ‌చ్చినా.. రెక్క‌లు క‌ట్టుకుని వాలిపోతామ‌ని చెప్పారు. ఇక్కడకు తనతో పాటు తన మంత్రివర్గం అంతా వచ్చిందని… మీకు అండగా ఉంటామని చెప్పడానికే వచ్చామని రేవంత్ ష‌ర్మిల‌వైపు చూస్తూ వ్యాఖ్యానించారు.