గచ్చిబౌలి సభపై బాబు ఉద్వేగం

ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉండగా.. ఏపీలో ఎన్నికలు జరగడానికి కొన్ని నెలల ముందు స్కిల్ డెవలప్మెంట్ కేసులో జగన్ సర్కారు అరెస్టు చేసిన సందర్భంలో హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఆయన కోసం వేలాది మంది మద్దతుదారులతో నిర్వహించిన సభ ఎంత ఉద్వేగంగా సాగిందో తెలిసిందే. బాబుకు జనాల్లో ఎంత మంచి పేరుందో ఆ సభతో రుజువైంది. బాబు అరెస్టును నిరసిస్తూ ఆ సభకు హాజరైన వాళ్లంతా గట్టిగా గళం వినిపించారు. టీడీపీ కార్యకర్తలు, మద్దతుదారుల్లో కసి పెరిగి ఎన్నికలకు మరింత ఉత్సాహంగా పని చేయడానికి ఆ సభ ఒక ఉత్ప్రేరకంలా పని చేసింది.

ఐతే అప్పటి ఆ స్పందన చూడ్డానికి బాబు బయట లేరు. జైల్లో ఒంటరిగా గడిపారు. కానీ బయటికి వచ్చాక ఆ సభ ఎంత గొప్పగా సాగిందో బాబు తెలుసుకున్నారు. కానీ దాని గురించి ఎన్నికల సమయంలో మాట్లాడలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టాక తొలిసారి అధికారికంగా హైదరాబాద్‌కు వచ్చిన చంద్రబాబు.. గచ్చిబౌలి సభ గురించి మాట్లాడుతూ ఉద్వేగానికి గురయ్యారు.

హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌లో టీటీడీపీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. తనను ఏ కారణం లేకుండా గత ప్రభుత్వం జైల్లో పెట్టిందని.. ఆ సమయంలో తన కోసం హైదరాబాద్ వాసులు చేసిన ఆందోళనను మరిచిపోలేనని చంద్రబాబు అన్నారు. తనకు మద్దతుగా గచ్చిబౌలిలో నిర్వహించిన సభ గురించి తర్వాత తెలుసుకుని ఉద్వేగానికి గురైనట్లు బాబు చెప్పారు. తన కోసం ఇంతమంది ఆందోళనలు నిర్వహించడం చూసి గర్వపడ్డానని.. తన జన్మ ధన్యమైందని బాబు వ్యాఖ్యానించారు.

తనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండూ రెండు కళ్ళని.. వాటిలో దేన్నీ వదులుకోనని బాబు చెప్పారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఐక్యత ఉండాల్సిన అవసరం ఉందని.. తెలుగు జాతి ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేస్తామని చంద్రబాబు అన్నారు. తెలంగాణలోనే తెలుగుదేశం పార్టీ పుట్టిందని.. కాబట్టి ఈ ప్రాంతంలో పార్టీ పునర్వైభవానికి కృషి చేస్తామని చంద్రబాబు చెప్పారు.