స‌మ‌స్య‌లు శాశ్వ‌తంకాదు.. రాష్ట్రాలే శాశ్వ‌తం.. : చంద్ర‌బాబు

సమస్యలు శాశ్వతం కాదని రాష్ట్రాలే శాశ్వతమ‌ని టిడిపి అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. తాజాగా ఆయన హైదరాబాదులోని ఎన్టీఆర్ భవన్లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన రెండు తెలుగు రాష్ట్రాల విభజన అంశాలకు సంబంధించిన కీల‌క విష‌యాల‌నుప్రస్తావించారు. శనివారం రాత్రి మంచి వాతావరణంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం జరిగిందని పేర్కొన్నారు. అయితే గ‌డిచిన 10 సంవత్సరాలలో అనేక సమస్యలు అప‌రిష్కృతంగా ఉన్నాయని వాటిని పరిష్కరించుకునేందుకు ఇప్పుడే తొలి అడుగు పడిందని పేర్కొన్నారు.

గతానికి ఇప్పటికీ అనేకమంది భావాలు అనేకమంది అభిప్రాయాలు మారుతూ ఉన్నాయని చంద్ర‌బాబు చెప్పారు. కానీ సమస్యల పరిష్కారం విషయంలో మాత్రం మార్పు కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు జాతి ప్రయోజనాలను కాపాడే విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలు కలిసికట్టుగా ఉన్నంతకాలం ఎవరూ ఏమీ చేయలేరని అన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి విభజన సమస్యల్లో కొన్ని సంక్లిష్టమైన ఉన్నాయని చెప్పారు. అదే సమయంలో మిగిలినవి చిన్న చిన్న సమస్యలేనని, కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని ఆదిశ‌గానే తమ ప్రయత్నాలు జ‌రిగాయ‌ని పేర్కొన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ఆ ఏపీలో కూటమి ప్రభుత్వం ఉందని చెప్పిన చంద్ర‌బాబు ఇరు పార్టీల సిద్ధాంతాలు వేరైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనా కూర్చుని చర్చించుకుంటే ఆయా సమస్యలు సానుకూలంగా పరిష్కారం అవుతాయని తాను నమ్ముతున్నట్టు తెలిపారు. అభివృద్ధి పథంలో తెలుగు రాష్ట్రాలు ముందుకు సాగాలని గట్టిగా విశ్వసిస్తున్నట్టు తెలిపారు. గతానికీ ఇప్పటికీ పాలనలో మార్పు వచ్చిందని పేర్కొన్నారు. సంక్లిష్టమైన సమస్యలను పరిష్కరించుకునే దిశగా ముందుకు సాగాలన్న అభిప్రాయం తెలంగాణ మంత్రులలో కనిపించిందన్నారు.

ఏపీ పరంగా తాము అన్ని విధాల సహకారం అందిస్తామని తెలంగాణ కూడా అదే విధంగా ముందుకు వచ్చేందుకు సమ్మతించిందని చంద్ర‌బాబు తెలిపారు. ఇరు రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలు పరిష్కారానికి తొలి అడుగు మాత్రమే పడిందని ముందు ముందు ఇది పుంజుకుంటుందని పేర్కొన్నారు. ఐక్యంగా ఉన్నంతవరకు సమస్యల పరిష్కారం సాధించుకోవడం పెద్ద కష్టమైన పనేమీ కాదని అభిప్రాయపడ్డారు. అన్నదమ్ములు విడిపోయినప్పుడే చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయని అట్లాంటిది రెండు తెలుగు రాష్ట్రాల రెండు రాష్ట్రాలుగా విడిపోయినప్పుడు చిన్నపాటి సమస్యలతో పాటు పెద్దవి కూడా ఉంటాయి అని తెలిపారు.

అయితే ఏ సమస్య అయినా శాశ్వతంగా ఉండదని రాష్ట్రాలు మాత్రమే శాశ్వతమ‌ని, ప్రజలు మాత్రమే శాశ్వతమని ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తున్నామని చంద్ర‌బాబు తెలిపారు. ఏదో ఒక రోజు రెండు తెలుగు రాష్ట్రాల సమస్యలు తప్పకుండా పరిష్కారం అవుతాయ‌న్న నమ్మకం తనకు బలపడిందన్నారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతాయని, కలిసికట్టుగా ఉంటాయని చంద్ర‌బాబు అభిప్రాయం వ్యక్తం చేశారు.