జగన్ మళ్లీ రాడనే ధీమా వచ్చేసిందా?

తన హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధిని తిరోగమనం పట్టించి.. కొత్త పరిశ్రమలు రానివ్వకుండా, ఉన్నవి పారిపోయేల చేశారనే అపప్రదను మూటగట్టుకున్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.

ఇది కేవలం మీడియా సృష్టి మాత్రమే అనుకుంటే పొరపాటే. గత ఐదేళ్లలో జరిగిన అనేక పరిణామాలు ఇందుకు నిదర్శనంగా నిలిచాయి. తాను పూర్తి మద్దతు పలికిన రాజధాని అమరావతి విషయంలో జగన్ ఎంత దుర్మార్గంగా వ్యవహరించారో.. అక్కడ మధ్యలో ఆగిన వేల కోట్ల నిర్మాణాలను చూస్తే అర్థమవుతుంది.

ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెట్టుబడులు పెట్టాలంటే పారిశ్రామిక వేత్తలు భయపడే పరిస్థితి కల్పించారాయన. ఐతే ఈ ఎన్నికల్లో వైసీపీ ఓడి కూటమి అధికారంలోకి వచ్చినా.. పారిశ్రామికవేత్తల్లో భరోసా వస్తుందా.. ఇంకో ఐదేళ్లకు మళ్లీ జగన్ వస్తే పరిస్థితి ఏంటనే భయంతో వెనుకంజ వేస్తారనే అభిప్రాయాలు రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమయ్యాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం గతంలో ఇదే రకమైన ఆందోళన వ్యక్తం చేశారు.

ఐతే ఎన్నికల్లో వైసీపీ ఎవ్వరూ ఊహించనంత చిత్తుగా ఓడిపోయిన తీరు చూస్తే జగన్ అండ్ కో తీరు పట్ల జనం ఎంతగా బెంబేలెత్తిపోయారో చెప్పడానికి నిదర్శనంగా నిలిచింది. ఈ ఫలితాలు చూశాక ఇన్నాళ్లూ జగన్‌కు వ్యతిరేకంగా మాట్లాడడానికి భయపడ్డ వాళ్లంతా స్వేచ్ఛగా అభిప్రాయం వెల్లడిస్తున్నారు.

అంతే కాక ఏపీ వైపు పరిశ్రమలు, వివిధ సంస్థలు చూస్తున్న సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా అమరావతి ఓఆర్ఆర్ నిర్మాణానికి రూ.20వేల కోట్ల నిధులు కేటాయించడానికి అంగీకరించడం.. ఎక్స్‌ఎల్ఆర్ఐ-జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ సహా పదుల సంఖ్యలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు అమరావతిలో కార్యకలాపాలు మొదలుపెట్టడానికి సిద్ధమవుతుండడం.. ఏపీలో ఇంకా పలు చోట్ల పెట్టుబడులు పెట్టడానికి కంపెనీలు ఆసక్తి చూపిస్తుండడం.. ఇదంతా చూస్తుంటే జగన్ పార్టీ ఇప్పట్లో కోలుకోదని.. 2029లో ఆ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఎంతమాత్రం లేదని అందరిలోనూ ఒక కాన్ఫిడెన్స్ వచ్చినట్లే కనిపిస్తోంది.