జ‌గ‌న్‌కు కాల ప‌రీక్ష‌.. ఎంత వెయిట్ చేస్తే.. !!

Jagan Mohan Reddy

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌కు ఇప్పుడు టైం ఒక ప‌రీక్ష‌గా మారింది. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఎలాంటి హామీలు ఇచ్చినా.. ప్ర‌జ‌ల‌ను ఎలా మ‌చ్చిక చేసుకున్నా.. వారికి ఎలాంటి ప‌థ‌కాల‌పై హామీ ఇచ్చినా.. కూట‌మి అధికారంలోకి వ‌చ్చింది. దీనిని ఎవ‌రూ త‌ప్పుప‌ట్ట‌లేరు. 2ల‌క్ష‌ల 70 వేల కోట్ల రూపాయ‌లు పంచిన ముఖ్య‌మంత్రిగా.. ప్ర‌జ‌ల క్షేమం కోసం.. క‌ష్ట‌ప‌డిన నాయ‌కుడిగా.. వ్య‌క్తిగ‌తంగా జ‌గ‌న్‌కు అధికారం కోల్పోయామ‌న్న బాధ ఉంటే ఉండొచ్చు.

కానీ, ప్ర‌జా తీర్పును మాత్రం ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాలి. ప్ర‌జా తీర్పును శిర‌సావహించాలి. అంతేకాదు.. వెయిటింగ్ కూడా చేయాలి. ఇప్పుడే ఏర్ప‌డిన కొత్త ప్ర‌భుత్వం ఎలాంటి వ్యూహాత్మ‌క అడుగులు వేస్తోందో .. ప‌రిశీలించుకోవాలి. ఆ త‌ర్వాతే.. మాట్లాడాలి. అయితే.. దీనికి కూడా కొంత స‌మ‌యం ఉంది. ప‌ట్టుమ‌ని నెల రోజులు కూడా కాకుండానే.. చంద్ర‌బాబు స‌ర్కారుపై విమ‌ర్శ‌లు చేయ‌డం ద్వారా.. జ‌గ‌న్ మ‌రింత డ్యామేజీ అవుతార‌న‌డంలో సందేహం లేదు.

తాజాగా ఆయ‌న నెల్లూరు జైల్లో ఉన్న పినెల్లి రామ‌కృష్ణారెడ్డిని ప‌రామ‌ర్శించిన అనంత‌రం.. చేసిన వ్యాఖ్య లు స‌బ‌బుగాలేవు. చంద్ర‌బాబు స‌ర్కారును ప‌థ‌కాల విష‌యంలో నిల‌దీయ‌డంవ‌ర‌కు బాగానే ఉంది. కానీ, అంత‌కు మించి చేసిన వ్యాఖ్య‌లు జ‌గ‌న్ స్థాయికి స‌రిపోయేలా క‌నిపించ‌డం లేదు. ఏ ప్ర‌భుత్వానికైనా కొంత స‌మ‌యం ఇవ్వాలి. పుంజుకునేలా చేయాలి. ఆ త‌ర్వాత‌.. విమ‌ర్శ‌లు చేసినా.. అవి ప్ర‌జ‌ల్లోకి వెళ్తాయి. అలా కాకుండా.. ఇప్పుడు విమ‌ర్శ‌లు చేయ‌డం స‌రికాదు.

మ‌రీ ముఖ్యంగా ప్ర‌జ‌లు ఇప్పుడు చంద్ర‌బాబు స‌ర్కారుపై జోష్‌లో ఉన్నారు. పింఛ‌న్ల పంపిణీతో ఆయ‌న క్రెడిట్ సంపాయించుకున్నారు. దీంతో ఇప్పుడు చంద్ర‌బాబును విమ‌ర్శించినా.. జ‌గ‌న్‌కు రివ‌ర్స్ అవుతుంది. అలా కాకుండా.. కొంత స‌మ‌యం వేచి ఉండి.. మూడు నాలుగు మాసాల త‌ర్వాత‌.. ఆయ‌న‌ను ప్ర‌భుత్వాన్ని విప‌క్షంగా టార్గెట్ చేస్తే.. మంచిద‌ని.. అప్పుడు జ‌గ‌న్‌కు సానుభూతి వచ్చే అవకాశాలు ఉంటాయని అంటున్నారు ప‌రిశీల‌కులు.