నాన్న‌గారి జ‌యంతి.. స‌మాధికే ప‌రిమితం!

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌.. త‌న తండ్రి వైఎస్సార్ జ‌యంతిని స‌మాధాకే ప‌రిమితం చేస్తున్నారు. తాజాగా ఆయ‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం పులివెందుల‌కు వెళ్లిపోయారు. ఇక్క‌డ వ‌చ్చే మూడు రోజుల పాటు మ‌కాం వేయ‌నున్నారు. వాస్త‌వానికి 8వ తేదీన వైఎస్ జ‌యంతి ఉంది. 75వ జ‌యంతిని పుర‌స్కరించుకుని.. జ‌గ‌న్ రాష్ట్ర వ్యాప్తంగా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తార‌ని పార్టీ వ‌ర్గాలు భావించాయి. అయితే.. పార్టీ ఘోర ఓట‌మి.. మ‌రోవైపు.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం హోదా ద‌క్క‌క‌పోవ‌డం వంటి కార‌ణాల‌తో మాన‌సికంగా జ‌గ‌న్ ఇంకా కోలుకోలేదు.

దీనికి తోడు.. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయ‌కులు కూడా.. అంత ఉత్సాహంగా క‌నిపించ‌డం లేదు. ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చి ప‌ట్టుమ‌ని నెల రోజులు మాత్ర‌మే అయిన నేప‌థ్యంలో ఇప్ప‌టికిప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌మ‌ని పిలుపునిస్తే.. ఎంత మంది స్పందిస్తారో..? అనే బెంగ కూడా.. పార్టీ అధినే తను వెంటాడుతున్న‌ట్టుగా ఉంది. ఈ నేప‌ధ్యం చ‌డీ చ‌ప్పుడు కాకుండా.. వైఎస్ జ‌యంతిని ఇడుపుల పాయ‌లోని వైఎస్ ఎస్టేట్‌లో ఉన్న రాజ‌న్న స‌మాధికే జ‌గ‌న్ ప‌రిచేయ‌నున్నారు.

అయితే.. హైద‌రాబాద్‌, తాడేప‌ల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యాల్లో మాత్రం వైఎస్ చిత్ర‌ప‌టాల‌కు పూల మాలలు వేసి.. నివాళుల‌ర్పించాల‌ని పార్టీ ఆదేశించింది. ఇవి మిన‌హా.. పెద్ద‌గా ఈ ఏడాది వైఎస్ జ‌యింతి ని నిర్వ‌హించ‌డం లేదు. అయితే.. గ‌తంలో మాత్రం ఇలాంటి ప‌రిస్థితి లేదు. పార్టీ ఓడిపోయిన 2014లోనూ వైఎస్ జ‌యంతిని రాష్ట్ర వ్యాప్తంగా ఘ‌నంగానే నిర్వ‌హించారు. త‌ర్వాత‌.. 2019 నుంచి మ‌రింత వ‌న్నె తెచ్చారు. వైఎస్సార్ ఎచీవ్‌మెంట్ అవార్డు ఫంక్ష‌న్‌ను కూడా చేశారు.

జూలై 8న రాష్ట్ర వ్యాప్తంగా కార్య‌క్ర‌మం నిర్వ‌హించేలా వైసీపీ ప్ర‌భుత్వం గ‌తంలో ఉత్త‌ర్వులు ఇచ్చింది. వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారికి బ‌హుమానాలు, కానుక‌లు, అవార్డులు ఇచ్చి స‌త్క‌రించింది. ఈ కార్య‌క్ర మానికి మాతృమూర్తి విజ‌య‌మ్మ ను కూడా.. జ‌గ‌న్ ఆహ్వానించిన విష‌యం తెలిసిందే. కానీ, ప్ర‌స్తుతం అధికారం కోల్పోవ‌డంతోపాటు.. పార్టీ ప‌రిస్థితి కూడా ఇబ్బందుల్లో ఉన్న నేప‌థ్యంలో జ‌గ‌న్‌.. తాజా జ‌యంతిని తూతూ మంత్రంగానే స‌రిపుచ్చ‌నున్నారు.