కలిశెట్టి .. తొలి జీతం అమరావతికే !

2019లో ఏపీలో జగన్ అధికారంలోకి రావడంతో రాజధాని అమరావతి అభివృద్ది పనులు ఆగిపోయాయి.
చంద్రబాబు నాయుడు మళ్లీ అధికారంలోకి కావడంతో రాజధాని అమరావతికి మంచిరోజులు వచ్చాయి. ఆగిపోయిన నిర్మాణ పనులు మళ్లీ మొదలయ్యాయి. అమరావతి నిర్మాణం కోసం పలువురు స్వచ్చంధంగా సొంత నిధులు ఇస్తున్నారు. తాజాగా విజయనగరం టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అమరావతి అభివృద్ది కోసం తనవంతు చేయూతనిచ్చారు.

లోక్ సభ సభ్యుడుగా అందుకున్న తొలి నెల వేతనం రూ. 1.57 లక్షల చెక్కును అమరావతి నిర్మాణం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి అందించారు. అమరావతి నిర్మాణానికి చేయూతనిచ్చిన ఎంపీని చంద్రబాబు అభినందించారు.

ఇటీవల రామోజీరావు సంస్మరణ సభ సందర్భంగా ఈనాడు సంస్థల తరపున అమరావతి కోసం రూ.10 కోట్లు విరాళం అందించిన విషయం తెలిసిందే. ఇక ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన దివ్యాంగుడు మాల్యాద్రి నాలుగు రోజుల క్రితం దాతృత్వం చాటుకున్నాడు. రాజధాని అమరావతి నిర్మాణానికి 10 వేల రూపాయల విరాళమిచ్చాడు. పింఛన్ సొమ్ము 6 వేల రూపాయలకు సొంత డబ్బు మరో 4 వేలను జతచేసి మొత్తం 10 వేల రూపాయలను అమరావతి నిర్మాణం కోసం అందజేశారు. ఆ డబ్బును చెక్కు రూపంలో తెలుగుదేశం ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డికి అందజేయడం విశేషం.