జగన్ నోట ‘రెడ్ బుక్’ మాట

Jagan Mohan Reddy

ప్రతిపక్షంలో ఉండగా తెలుగుదేశం యువనేత నారా లోకేష్.. తన యువగళం సభల్లో పరిచయం చేసిన ‘రెడ్ బుక్’ ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. వైసీపీ హయాంలో అక్రమాలు చేస్తూ, హద్దుమీరి ప్రవర్తిస్తున్న నాయకులు, అధికారుల పేర్లన్నీ ఇందులో నోట్ చేశానని.. తాము అధికారంలోకి వచ్చాక వీళ్లందరి పనీ పడతామని లోకేష్ పదే పదే ప్రస్తావించేవాడు.

దాని మీద వైసీపీ వాళ్లు ఎన్నో కౌంటర్లు వేశారు. ఎప్పట్లాగే లోకేష్‌ను ఎగతాళి చేసేవాళ్లు. కానీ ఏపీ ఎన్నికల్లో వైసీపీ చిత్తుగా ఓడి కూటమి అధికారంలోకి రాగానే.. ‘రెడ్ బుక్’ విషయంలో వైసీపీ నేతలు, ఆ పార్టీకి కొమ్ముకాసిన అధికారులకు భయం పట్టుకుంది.

నిజంగానే లోకేష్ రెడ్ బుక్‌ చూసి తమను టార్గెట్ చేస్తే ఎంటి పరిస్థితి అని కంగారు పడ్డారు. ఒకప్పుడు ‘రెడ్ బుక్’ను ఎగతాళి చేసిన వాళ్లకే ఇప్పుడు దాని గురించి గుబులు పట్టుకోవడమే విచిత్రం.

చివరికి నారా లోకేష్‌ను ఎప్పడూ నాయకుడిగా గుర్తించని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం తాజాగా ‘రెడ్ బుక్’ ప్రస్తావన తేవడం చర్చనీయాంశం అయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ వాళ్లపై జరుగుతున్న దాడులను ప్రస్తావిస్తూ చంద్రబాబు చేతిలో రెడ్ బుక్ ఉందని.. అలాగే లోకేష్ చేతిలో, ప్రతి ఎమ్మెల్యే చేతిలో రెడ్ బుక్ ఉందని.. దాన్ని పెట్టుకుని తమ నాయకులు, కార్యకర్తలను టార్గెట్ చేస్తున్నారని.. ఇది అన్యాయమని జగన్ పేర్కొన్నాడు.

అంతే కాక ఇలాంటి సంస్కృతిని కొనసాగిస్తే ప్రమాదమని.. చంద్రబాబు నాటిని ఈ విత్తనం రేపు చెట్టవుతుందని.. రేప్పొద్దున టీడీపీ కార్యకర్తలకు కూడా ఇదే పరిస్థితి తలెత్తుతుందని జగన్ అన్నాడు. ఈ విషయంలో తాను చంద్రబాబుకు విన్నవించట్లేదని.. హెచ్చరిస్తున్నాను అని జగన్ వ్యాఖ్యానించడం విశేషం.

ఎన్నికల ఫలితాల ముందు వరకు పవన్‌ను ప్యాకేజీ స్టార్, దత్తపుత్రుడు అంటూ వచ్చిన జగన్.. ఫలితాల అనంతరం ‘పవన్ కళ్యాణ్’ అని పేరు పెట్టి సంబోధించాడు. ఇప్పుడేమో తాను ఎన్నడూ నాయకుడిగా పరిగణించని లోకేష్ విషయంలో ‘రెడ్ బుక్’ ప్రస్తావన చేశాడు. అధికారం పోతే అన్నీ మారిపోతాయనడానికి ఇది ఉదాహరణ.