త‌ప్ప‌దు.. మోడీ స‌ర్‌.. బాబు చేతులు క‌ట్టేశారు!

ఏపీకి నిధులు ఇవ్వ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి మోడీకి ఏర్ప‌డిందా? అమ‌రావ‌తి రాజ‌ధానికి మోడీ ఇప్పుడు క‌నీసం 100 కోట్లయినా.. కేటాయించ‌క త‌ప్ప‌దా? అంటే.. త‌ప్ప‌ద‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందుకంటే.. ఇప్పుడు ఎన్డీయే కూట‌మిలో మోడీకి అత్యంత విశ్వ‌స‌నీయ భాగ‌స్వామ్య పార్టీ కేవ‌లం టీడీపీనే. ఇత‌ర పార్టీల‌ను తీసుకుంటే.. వారి గొంతెమ్మ కోరిక‌లను తీర్చ‌క‌పోతే.. ఏ క్ష‌ణ‌మైనా త‌ప్పుకొనే అవ‌కాశం ఉంది. కానీ, బాబు అలా చేయరు.

గ‌తంలో ఇలా చేసే.. చేతులు కాల్చుకున్నారు. సో.. చంద్ర‌బాబు చాలా వ్యూహాత్మ‌కంగా ఇప్పుడు అడుగులు వేస్తున్నారు. అలాగ‌ని రాష్ట్ర ప్ర‌యోజ‌నాల విష‌యంలో ఆయ‌న రాజీ ప‌డే అవ‌కాశం లేదు. బిహార్ విష‌యాన్ని తీసుకుంటే.. అక్క‌డి సీఎం నితీష్ కుమార్‌.. ఇప్ప‌టికే మోడీకి సెగ పెడుతున్నారు. ప్ర‌త్యేక హోదా తుట్టె క‌దిపేశారు. దీనిపై వ‌చ్చే బ‌డ్జెట్ స‌మావేశాల్లో కేంద్రాన్ని ప్ర‌శ్నించాల‌ని కూడా నితీష్ నిర్ణ‌యానికి వ‌చ్చారు. అంటే.. భాగ‌స్వామ్య పార్టీ మోడీకి సెగ పెంచుతోంది.

ఇలా చూసుకుంటే.. చంద్ర‌బాబు నుంచి ఈ త‌ర‌హా డిమాండ్ లేదు. కేవ‌లం రాష్ట్రానికి ప‌రిమిత‌మైన అమ‌రావ‌తి రాజ‌ధాని, పోల‌వ‌రం ప్రాజెక్టుల‌కు సంబంధించిన నిధుల‌ను మాత్ర‌మే ఆయ‌న కోరే అవ‌కాశం ఉంది. వీటికి న్యాయం చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఆయ‌న గ‌ట్టిగా కోర‌నున్నారు. ఇది పొత్తు ధ‌ర్మం కూడా. ఎందుకంటే.. విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం చూసుకున్నా.. ఈ రెండు ప్రాజెక్టుల‌ను కూడా.. కేంద్ర‌మే చేయాల్సి ఉంది. సో.. మోడీకి ఏపీకి నిధుల‌ను కేటాయించ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది.

చంద్ర‌బాబు కోస‌మే అయినా.. ఎన్డీయే కూట‌మి స‌ర్కారు కోస‌మే అయినా.. మోడీ ఈ విష‌యంలో ముందు చూపు ప్ర‌ద‌ర్శించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎన్నిక‌ల హామీల్లో లేక పోయినా.. కీల‌క‌మైన ప్రాజెక్టుల విష‌యంలో మోడీ ముందుకు సాగే విధానాన్ని ఏపీ ప్ర‌జ‌లు కూడా గ‌మ‌నిస్తారు. ఈ నేప‌థ్య‌మే వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి బీజేపీకి ఏపీలో పునాదులు ప‌డేలా చేస్తుంది. సో.. ఎలా చూసుకున్నా.. మోడీకి ఇప్పుడు ఏపీని వ‌దులుకునే ప‌రిస్థితి లేదు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.