ఆ జాబితాలో చివరి స్థానంలో ఏపీ

ఒక వ్య‌క్తి ఆలోచ‌న అయినా.. ఒక నాయ‌కుడి ఆలోచ‌న అయినా.. పురోగ‌తి దిశ‌గా ఉండాలి. అది కుటుంబ మైనా.. రాష్ట్ర‌మైనా.. ఒకే సూత్రం. ఒక ఆలోచ‌న వ‌న‌రులు పండించాలి. అభివృద్ధి ప‌రుగులు పెట్టించాలి. కానీ.. ఏపీలో 2019-24 వ‌ర‌కు ఐదేళ్ల‌పాటు సీఎంగా ఉన్న జ‌గ‌న్‌.. త‌న ఆలోచ‌న‌ల‌ను తిరోగ‌మ‌నంలో తీసుకు వెళ్లారు. దీనివ‌ల్ల ఆయ‌న‌కు మానసిక ఆనందం ద‌క్కి ఉండొచ్చు. మ‌న‌శ్శాంతి పొంది ఉండొచ్చు. కానీ, రాష్ట్రం నీరుగారిపోయింది. తాజాగా కేంద్ర ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన పెట్టుబ‌డుల ఇండెక్స్‌లో రాష్ట్రం చిట్ట‌చివ‌రి స్తానానికి చేరిపోయింది.

సాధార‌ణంగా అభివృద్ది చెందుతున్న రాష్ట్రాల్లో పెట్టుబ‌డులు పెట్టేందుకు ఎక్కువ మంది ఆస‌క్తి చూపుతా రు. పైగా తీర ప్రాంతం ఎక్కువ‌గా ఉండ‌డం.. మానవ వ‌న‌రులు.. యువ‌త ఎక్కువ‌గా ల‌భించ‌డం.. వంటి కార‌ణాల‌తో ఏపీకి మ‌రిన్ని పెట్టుబ‌డులు వ‌చ్చే అవ‌కాశం ఉంది. కానీ. అలా జ‌ర‌గ‌లేదు. ఎక్క‌డో వెనుకబ‌డిన రాష్ట్రం బిహార్‌తో పోల్చుకున్నా.. ఏపీ వెనుక‌బాటుత‌నంలోనే ఉంది. గ‌త ఐదేళ్ల‌లో బిహార్‌కు 32 వేల కోట్ల రూపాయ‌ల పెట్టుబ‌డులు వ‌స్తే.. ఏపీకి వ‌చ్చింది.. 2 వేల కోట్ల రూపాయ‌లు మాత్ర‌మే.

అది కూడా.. కేవ‌లం కాయితాల‌కే ప‌రిమితం అయింది. ఇలా.. పెట్టుబ‌డుల విష‌యంలో రాష్ట్రం తిరోగ‌మనంలో ముందుకు సాగింది. మ‌రి ఇలా ఎందుకు జ‌రిగింది? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. దీనికి పెద్ద చించుకోవాల్సిన అవ‌స‌రం లేదు. రాష్ట్రం లోపించిన శాంతి భ‌ద్ర‌త‌లు.. మార‌ణ కాండ‌.. ప్ర‌తిప‌క్షాల‌పై కక్ష సాధింపుచ‌ర్య‌లు.. కార‌ణంగా.. ఎక్క‌డ ఎప్పుడు దాడులు జ‌రుగుతాయోన‌నే బెంగ స‌గం మంది పెట్టుబ‌డి దారుల‌ను ఆలోచించుకునేలా చేసింది.

ఇక‌, ప్ర‌భుత్వం వైపు నుంచి ప్రోత్సాహం క‌రువ‌వ‌డం.. అప్పుల పాలు కావ‌డం.. మితిమీరిన అప్పులు తెచ్చేందుకు ప్ర‌భుత్వ సంస్థ‌ల‌ను కూడా తాక‌ట్టు పెట్ట‌డం వంటివి కార్పొరేట్ దిగ్గ‌జాల‌కు న‌చ్చ‌లేదు. దీనికి తోడు.. ‘మాకేంటి’ అనే సంస్కృతి కూడా.. వారిని దూరం పెట్టింది. ఇవ‌న్నీ.. సీఎంగా జ‌గ‌న్‌కు మాన‌సిక ప్ర‌శాంత‌త‌ను.. ఆనందాన్ని ఇచ్చి ఉంటాయి. ప్ర‌తిప‌క్షాల‌పై దాడులు చేసినా.. ఆయ‌న హ్యాపీగా ఉండి ఉండొచ్చు. కానీ, రాష్ట్రం మాత్రం 20 ఏళ్ల వెన‌క్కి వెళ్లిపోయింద‌న‌డంలో సందేహం లేదు.