తెలంగాణ ఎన్నిక‌ల‌కు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌?

జ‌న‌సేన అధినేత‌, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఏపీలో ఎన్నిక‌ల‌కు ఐదారు మాసాల ముందు చేసిన గ్రౌండ్ వ‌ర్క్ ఫ‌లించిన విష‌యం తెలిసిందే. బీజేపీ-టీడీపీల‌ను ఏక‌తాటిపైకి తీసుకువ‌చ్చి.. కూట‌మి క‌ట్టేలా చేసిన ఆయ‌న ఎన్నిక‌ల్లో వైసీపీ ప‌త‌నాని కి నాంది పలికారు. త‌న పార్టీ 21 స్థానాలు తీసుకున్నా.. అన్నిచోట్లా గెలిపించుకున్నారు. అదేవిధంగా రెండు పార్ల‌మెంటు స్థానాలే ద‌క్కించుకున్నా.. వాటిని కూడా గెలిపించుకున్నారు. ఈ వ్యూహం ఏపీలో ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ వేయ‌క‌పోగా.. ఇలాంటి స్ట్రైక్ రేట్ విజ‌యం కూడా ఎవ‌రికీ సాధ్యం కాలేదు. దీంతో ప‌వ‌న్ ఇమేజ్ జాతీయ స్థాయిలో వినుతికెక్కింది.

అయితే.. ఇప్పుడు ఇదే వ్యూహాన్ని ఆయ‌న తెలంగాణ‌లోనూ ప్లే చేస్తారా? అనేది రాజ‌కీయంగా జ‌రుగుతున్న చ‌ర్చ‌. తాజాగా కొండ‌గ‌ట్టు ఆంజ‌నేయ‌స్వామి ఆల‌యాన్ని సంద‌ర్శించిన ఆయ‌న రాజ‌కీయంగా కొన్ని వ్యాఖ్య‌లు చేశారు. తాము తెలంగాణలో నూ విస్త‌రిస్తామ‌ని.. జ‌న‌సేనను బ‌లోపేతం చేస్తామ‌ని చెప్పారు. అంతేకాదు.. గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో జ‌న‌సేన ఓడిపోయిన విష‌యాన్ని కూడా ప్ర‌స్తావిస్తూ.. త‌ప్పులు జ‌రిగి ఉంటే వాటిని స‌రిచేసుకుంటామ‌ని చెప్పారు. ఇక‌, ఇదేస‌మ‌యంలో బీజేపీతో క‌లిసి ప‌నిచేయ‌నున్న‌ట్టు ప‌వ‌న్ వెల్ల‌డించారు. దీనిపై బీజేపీ నాయ‌కులు త‌ల‌కోర‌కంగా స్పందిస్తున్నారు.

కేంద్ర మంత్రి, క‌రీంన‌గ‌ర్ ఎంపీ బండి సంజ‌య్ ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌ను స్వాగ‌తిస్తూనే.. తామే ముందుగానే జ‌న‌సేన‌తో చేతులు క‌లిపామ‌ని.. అయితే..ఇప్పుడు జ‌న‌సేన‌తో క‌లిసి ముందుకు వెళ్లే విష‌యాన్ని పార్టీ అధిష్టానం చూసుకుంటుంద‌న్నారు. అయితే.. రాష్ట్రంలో అధికారంలోకి వ‌చ్చేందుకు ఎవ‌రితోనైనా చేతులు క‌లిపే అవ‌కాశం ఉంద‌ని చెప్పుకొచ్చారు. దీనిని బ‌ట్టి.. బీజేపీ కూడా జ‌న‌సేన‌వైపు మొగ్గు చూపుతుంద‌నేది తెలుస్తోంది. ఇక‌, ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ ఎలానూ .. బీజేపీ-జ‌న‌సేన కూట‌మితో క‌లిసే ఉంది. మ‌రోవైపు.. తెలంగాణ‌లోనూ విస్త‌రిస్తామ‌ని.. చంద్ర‌బాబు చెబుతున్నారు.

ఈ నేప‌థ్యంలో తెలంగాణ‌లోనూ.. ప‌వ‌న్ ఏపీ ఫార్ములాను.. అమ‌లు చేస్తే.. కాద‌నేవారు ఎవ‌రూ ఉండ‌రు. ఎవ‌రు మాత్రం అధికారంలోకి వ‌స్తామంటే అడ్డుకుంటారు. ఇప్పుడు ఆదిశ‌గా ఆలోచ‌న చేస్తే.. ఏపీలో క‌లిసి ఉన్న మూడు పార్టీలూ(బీజేపీ+ జ‌న‌సేన‌+టీడీపీ)లు ఉమ్మ‌డిగా తెలంగాణ‌లోనూ పోటీ చేసే అవ‌కాశం క‌నిపిస్తోంది. దీనిని బ‌ట్టి 2029లో వ‌చ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నాటికి ఇప్ప‌టి నుంచి ప‌వ‌న్ గ్రౌండ్ వ‌ర్క్ ప్రారంభిస్తున్నారా? అనే చ‌ర్చ రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌గా మారింది. ఇదే జ‌రిగితే.. ఇటు కాంగ్రెస్‌కు, అటు బీఆర్ ఎస్ కు కూడా.. ఇబ్బందులు త‌ప్ప‌వు.

పైగా.. మూడు పార్టీలూ క‌లిస్తే.. అధికారంలోకి వ‌చ్చినా ఆశ్చ‌ర్యం లేదు. ఇటీవ‌ల సీఎం రేవంత్ మాట్లాడుతూ.. టీడీపీ పోటీ చేయ‌నుందునే 10 శాతం ఓటు బ్యాంకు తాము ద‌క్కించుకున్నామ‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం. సో.. ఇప్పుడు టీడీపీ స‌హా బీజేపీ, జ‌న‌సేన‌లు క‌లిస్తే.. అధికారంలోకి వ‌చ్చేసినా ఆశ్చ‌ర్యం లేద‌ని అంటున్నారు. ఈ వ్యూహాన్ని దృష్టిలో పెట్టుకునే ప‌వ‌న్ క‌ల్యాణ్ ఈ వ్యాఖ్య‌లు చేసి ఉంటార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.