రూ.4వేలకే స్మార్ట్ ఫోన్…రిలయన్స్ మరో సంచలనం?

కర్లో దునియా ముఠ్ఠీమే అంటూ….చాలామంది ప్రజల అరచేతిలోకి ప్రపంచాన్ని తెచ్చిపెట్టిన ఘనత రిలయన్స్ ధీరూభాయ్ అంబానీదే. తన తండ్రి అడుగుజాడల్లో నడిచిన ముకేశ్ అంబానీ….జియో జీ భర్ కే అంటూ కారుచౌకగా మొబైల్ డేటాతో పాటు ఫీచర్ ఫోన్ ను సామాన్యులకు అందించారు. టెలికాం రంగంలో జియో దెబ్బకు తట్టుకోలేక చాలా టెలికాం కంపెనీలు నష్టాలను చవిచూశాయి. జియో 4జీ సేవల ధాటికి మిగతా కంపెనీలు కుదేలయ్యాయి. వచ్చే ఏడాది నాటికి భారత్ లో 5జీ సేవలను ప్రారంభించేందుకూ జియో పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో సంచలనానికి జియో తెరతీయున్నట్లు తెలుస్తోంది. భారత్ మార్కెట్ ను దృష్టిలో ఉంచుకొని అతి చౌకగా రూ.4 వేలకే ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ అందించాలని అంబానీ సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

130 కోట్ల మంది ఉన్న మన దేశంలో స్మార్ట్ ఫోన్ వాడకం నానాటికీ పెరిగిపోతోంది. అందుకే, షామీ, రియల్ మీ వంటి కంపెనీలు మన మార్కెట్లో చౌక ధరలకే ఫోన్లను అందిస్తూ సొమ్ము చేసుకుంటున్నాయి. తాజాగా చైనాతో వివాదం నేపథ్యంలో చైనా కంపెనీల ఉత్పత్తులకు మార్కెట్లో ఆదరణ ఉండడం లేదు. భవిష్యత్తులో చైనా మొబైల్స్ మార్కెట్ మరింత పడిపోయే అవకాశముంది. దీనికితోడు స్వదేశీ వస్తువుల వాడకం కోసం స్వదేశీ కంపెనీలకు ప్రధాని మోడీ ఊతమిస్తున్నారు. ఈ క్రమంలోనే భారత్ లోని స్మార్ట్ ఫోన్ మార్కెట్ పై రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ కన్నుపడిందని తెలుస్తోంది. షామీ వంటి మొబైల్ తయారీదారులకు గట్టి పోటీ ఇవ్వాలని అంబానీ ప్లాన్ చేస్తున్నారట.

అందుకే, కారు చౌకగా రూ.4 వేలకే స్మార్ట్ ఫోన్లను భారతీయ మార్కెట్ కు అనుగుణంగా విడుదల చేయాలని అంబానీ ప్రణాళికలు రచిస్తున్నారని తెలుస్తోంది. గూగుల్ ఆండ్రాయిడ్ ఓఎస్ తో నడిచే ఈ స్మార్ట్ ఫోన్ తో షామీ వంటి సంస్థలకు సవాల్ విసరాలని అంబానీ భావిస్తున్నారట. రాబోయే రెండేళ్లలో 200 మిలియన్ల స్మార్ట్ ఫోన్లు విక్రయించాలన్న లక్ష్యంతో అంబానీ ముందుకు వెళుతున్నారట. ఇందుకోసం, భారత్ లోని మొబైల్ ఫోన్ తయారీదారులతో అంబానీ ఇప్పటికే చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రచారం నిజమై రూ.4వేలకే రిలయన్స్ స్మార్ట్ ఫోన్ అందించగలిగితే…భారత్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ ను రిలయన్స్ శాసిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.