మండ‌లిని ఏం చేద్దాం.. కూట‌మి స‌ర్కారు ఎత్తు ఏంటంటే!

ఏపీలో శాస‌న మండ‌లి ఇప్పుడు ప్ర‌ధాన చ‌ర్చ‌గా మారింది. వ‌చ్చ‌నెల 27 నుంచి అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం కానున్నాయి. దీంతో పాటే మండ‌లి స‌మావేశాలు కూడా.. మొద‌లు కావాలి. అయితే.. అసెంబ్లీలో భారీ మెజారిటీ ఉన్న కూట‌మికి.. మండ‌లిలో మాత్రం పేల‌వ‌మైన ప‌రిస్థితి క‌నిపిస్తోంది. అసెంబ్లీలో 164 స్థానాలు ద‌క్కించుకున్న కూట‌మి పార్టీల వ్య‌వ‌హారం బాగానే ఉంది. ఏ బిల్లు తీసుకువ‌చ్చినా.. క్ష‌ణాల్లోనే ఓకే అయిపోతుంది. కానీ, మండ‌లిలో మాత్రం ద‌బిడిదిబిడే! ఈ ప‌రిస్థితి కొన‌సాగితే.. దీనికి కార‌ణం.. మండ‌లి చైర్మ‌న్ నుంచి స‌భ్యుల వ‌ర‌కు వైసీపీదే పైచేయి.

అందుకే.. ముందుగానే జ‌గ‌న్ మండ‌లి స‌భ్యుల‌ను హెచ్చ‌రించారు. అసెంబ్లీలో మ‌నం లేకున్నా.. మండ‌లిలో మ‌నోళ్లే ఉంటార‌ని.. వారే చూసుకుంటార‌ని కూడా ఆయ‌న వ్యాఖ్యానించారు. అంటే.. అసెంబ్లీలో ద‌క్క‌ని అధికారాన్ని ప‌రోక్షంగా మండ‌లిలో వినియోగించుకునేందుకు వైసీపీప్ర‌య‌త్నించ‌నుంది. ఇది అధికార పార్టీకి కంట్లో న‌లుసుగా మారే అవ‌కాశం ఉంద‌ని సీనియ‌ర్లు అంచ‌నా వేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో శాస‌న మండ‌లిని కొన్నాళ్ల‌పాటు సుప్త చేత‌నావ‌స్థ‌లోకి తీసుకువెళ్లేలా ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. మండ‌లిని ర‌ద్దు చేయ‌కుండా.. దీనిని వ‌చ్చే మూడేళ్ల‌పాటు అచేత‌నంగా ఉంచేందుకు అవ‌కాశం ఉందా? అని స‌ర్కారు యోచిస్తున్న‌ట్టు స‌మాచారం.

ప్ర‌స్తుతం జోరుమీదున్న చంద్ర‌బాబు కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చే అసెంబ్లీ స‌మావేశాల్లోనే కీల‌క బిల్లుల‌ను తీసుకువ‌చ్చేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. ప్ర‌ధానంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ర‌ద్దు, అమ‌రావ‌తి నిర్మాణానికి సంబంధించిన మ‌రికొన్ని బిల్లుల‌తోపాటు.. ఆర్‌-5 జోన్ లో పేద‌లకు ఇచ్చిన‌ ఇళ్ల‌ను కూడా ర‌ద్దు చేయ‌నుంది. తద్వారా అమ‌రావ‌తిని ప‌టిష్టం చేసేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. అయితే.. అసెంబ్లీలో 164 స్థానాలు ఉన్నందున‌.. కూట‌మి స‌ర్కారుకు స‌భ‌లో ఏ బిల్లు తీసుకువ‌చ్చినా.. ఓకే అవుతుంది. కానీ, మండ‌లి విష‌యానికి వ‌స్తే బ్రేకులు ప‌డే అవ‌కాశం ఉంది. దీంతో కూట‌మి ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చే ప్ర‌తి బిల్లును ఇక్క‌డ అడ్డుకునేందుకు అవ‌కాశం మెండుగా ఉంది.

ఈ క్ర‌మంలో మండ‌లిని ర‌ద్దు చేస్తే.. బెట‌ర్ అని కూట‌మిలో చ‌ర్చ సాగుతోంది. కానీ, వ‌చ్చే మూడేళ్ల త‌ర్వాత‌.. మ‌ళ్లీ మండ‌లిలో టీడీపీ స‌హా జ‌న‌సేన‌, బీజేపీలు పుంజుకుంటాయి. వారి వారి బ‌లం కూడా పెరుగుతుంది. దీంతో మండ‌లిని ర‌ద్దు చేయ‌డం కాకుండా.. మండ‌లిని సుప్త చేత‌నావ‌స్థ‌లో ఉంచేందుకు చూడాల‌ని భావిస్తోంది. దీనిపై న్యాయ నిపుణుల స‌ల‌హాలు కోరుతున్నారు. త‌ద్వారా.. వ‌చ్చే మూడేళ్ల‌పాటు.. వైసీపీ ఎదురు దాడి నుంచి త‌ప్పించుకునే ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయ‌ని తెలుస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.