తిరుమలలో ఇష్టారాజ్యం నడిపించారు

తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నం అంటే.. ఉత్కృష్టం. ఈష‌ణ్మాత్ర‌(సెక‌నులో స‌గ‌భాగం) ద‌ర్శ‌నం ల‌భిస్తే.. చాల‌ని ప‌రిత‌పించే దేవ‌దేవుని భ‌క్తులు వ్య‌య ప్ర‌యాస‌ల‌కు ఓర్చుకుని మ‌రీ తిరుమ‌ల గిరుల‌కు క్యూ క‌డుతుంటారు. అంత డిమాండ్ ఉండే శ్రీవారి ద‌ర్శ‌నాన్ని వైసీపీ నాయ‌కులు రాజ‌కీయం చేసేశారు. త‌మ చేతికి ఎముక లేకుండా.. సిఫార‌సు లేఖ‌లు ఇచ్చేశారు. దీంతో వైసీపీ భ‌క్తులు.. లెక్క‌కు మిక్కిలి సంఖ్య‌లో శ్రీవారి ద‌ర్శ‌నాలు చేసుకున్నారు. అయితే ఏంటి నొప్పి అనుకుంటున్నారా? దీనివ‌ల్ల సాధార‌ణ భ‌క్తుల‌కు శ్రీవారు దూర‌మయ్యారు.

వైసీపీ హ‌యాంలో మంత్రులుగా ఉన్న చిత్తూరు జిల్లాకు చెందిన రోజా, పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, టీటీడీ బోర్డు స‌భ్యుడు, అప్ప‌టి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డిలు.. త‌మ వారికి లెక్కకు మించిన సిఫార‌సు లేఖలు ఇచ్చిన‌ట్టు తాజాగా విజిలెన్స్ విభాగం గుట్టును బ‌య‌ట పెట్టింది. రోజా అయితే.. స్వ‌యంగా త‌న‌తో మంద‌ల‌కొద్దీ భ‌క్తుల‌ను(అయిన వారిని) తీసుకువెళ్లి ఒకే టికెట్‌పై ప‌దుల సంఖ్య‌లో శ్రీవారిని ద‌ర్శించుకున్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. అయితే.. తాజా విచార‌ణ‌లో బ్రేక్ ద‌ర్శ‌నం పేరుతో ఆమె వంద‌ల కొద్దీ సిఫార‌సు లేఖ‌లు ఇచ్చార‌ని తెలిసింది.

ఇక‌, మ‌రో కీల‌క నేత‌, అప్ప‌టి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీఐపీ బ్రేక్ దర్శనంలో ఒకేసారి 54 మందిని శ్రీవారి దర్శనానికి పంపిన వ్య‌వ‌హారం తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. తాను పంపిన వారిని దర్శనానికి అనుమతించాలంటూ ఆయన రాసిన సిఫారుసు లేఖను టీడీపీ సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. మ‌రోవైపు ఈ బ్రేక్ దర్శనం స్కాంతోపాటు శ్రీవాణి ట్రస్ట్ టికెట్ కుంభకోణంపైనా టీటీడీ విజిలెన్స్ విచారణ ప్రారంభించింది. మొత్తంగా చూస్తే.. అఖిలాండ కోటి బ్ర‌హ్మాండ‌నాయ‌కుడిని వైసీపీ రాజ‌కీయ దేవ‌దేవుడిగా మార్చేసిన ఉందంతం చూసి.. కోనేటి రాయుడి భ‌క్తులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.