ఏపీకి రాబోతున్న లడ్డా ఐపీఎస్?

మహేష్ చంద్ర లడ్డా ఐపీఎస్… ఈ పేరు ఇరు తెలుగు రాష్ట్రాలకు సుపరిచితమే. గతంలో ఆంధ్రప్రదేశ్ ఎస్పీగా పనిచేసిన లడ్డా తన మార్క్ పోలీసింగ్ తో రౌడీలు, ఫ్యాక్షనిస్టులు, మావోయిస్టులు, అసాంఘిక శక్తుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు.

లడ్డా పేరు వింటే క్రైమ్ చేయాలి అనే ఆలోచన కరుడుగట్టిన నేరస్థులకు సైతం రాలేదు అంటే అతిశయోక్తి కాదు. ముక్కుసూటితనం, నిజాయితీ, నిబద్ధత గల పోలీస్ అధికారిగా ఉన్నతాధికారులతో పాటు ప్రభుత్వం నుంచి కూడా లడ్డా మన్ననలు పొందారు. 2019 ఎన్నికల ముందు వరకు ఏపీలో పనిచేసిన ఈ డేరింగ్ అండ్ డ్యాషింగ్ ఐపీఎస అధికారి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర సర్వీసులకు వెళ్లారు.

అయితే, తాజాగా ఏపీలో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో లడ్డాను మళ్ళీ రాష్ట్ర సర్వీస్ కు పిలిపించాలని ఏపీ సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం సీఆర్పీఎఫ్ ఐజీగా పనిచేస్తున్న లడ్డాను రాష్ట్ర సర్వీస్ కి పంపుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఈ ప్రకారం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. లడ్డాను ఏపీ ఇంటిలిజెంట్ చీఫ్ గా నియమించబోతున్నారని తెలుస్తోంది. ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేసే సమర్థులైన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ఏరికోరి ఏపీకి తెచ్చుకుంటున్న క్రమంలో లడ్డా కూడా ఏపీకి రాబోతున్నారు.

ఏపీ క్యాడర్ కు చెందిన ఐపీఎస్ అధికారి లడ్డా1998 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారు. రాజస్థాన్ లడ్డా స్వస్థలం. విశాఖలో ఏఎస్పీగా కెరీర్ మొదలుబెట్టిన లడ్డా ప్రకాశం, గుంటూరు, నిజామాబాద్ జిల్లాలకు ఎస్పీగా పని చేశారు.

ప్రకాశం జిల్లాలో మావోయిస్టులను అణిచివేయడంలో, శాంతిభద్రతలను పరిరక్షించడంలో లడ్డా తీసుకున్న నిర్ణయాలు అప్పట్లో ప్రశంసలందుకున్నాయి. ఈ క్రమంలోనే 2005 ఏప్రిల్ 27న మహేష్ చంద్ర లడ్డాపై మావోయిస్టులు బాంబు దాడికి పాల్పడగా…ఆయన తృటిలో తప్పించుకొని ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.

ఆ తర్వాత గుంటూరు ఎస్పీగా కూడా లడ్డా పనిచేశారు. గుంటూరు జిల్లాలో మావోయిస్టుల ఏరివేతతో పాటు రౌడీయిజంపై, అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపారు. ఆ తర్వాత విజయవాడ డిప్యూటీ కమిషనర్ గా కూడా పనిచేసిన అనుభవం లడ్డాకు ఉంది.

2019లో నాటి ప్రతిపక్ష నేత జగన్ పై విశాఖ ఎయిర్పోర్టులో కోడి కత్తి దాడి ఘటన సమయంలో విశాఖ కమిషనర్ గా లడ్డా పనిచేస్తున్నారు. ఆ తర్వాత అక్కడ నుంచి నేరుగా లడ్డా సెంట్రల్ సర్వీసులకు బదిలీ అయ్యారు.