వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్టు

వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. గ‌త నెల 13న జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆయ‌న గుంటూరు జిల్లా మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గంలోని పాల‌వాయి గేటు పోలింగ్ బూత్‌లో ఈవీఎం, వీవీప్యాట్‌ను ధ్వంసం చేశార‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. ఈ ఘ‌ట‌న‌పై ఎన్నిక‌ల సంఘం ప‌లు ప‌లు పార్టీల నాయ‌కులు ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు పోలీసు లు కేసులు న‌మోదు చేశారు. అదేస‌మ‌యంలో పోలింగ్ త‌ర్వాత రోజు చోటు చేసుకున్న హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు.. సీఐ నారాయ‌ణ స్వామి దాడి, హ‌త్యాయ‌త్నం జ‌రిగిన‌ట్టు వ‌చ్చిన ఫిర్యాదుల‌తో కూడా.. పోలీసులు కేసు పెట్టారు.

ఇక‌, టీడీపీ పోలింగ్ బూత్ ఏజెంట్ శేష‌గిరిపైనా దాడి చేసి హ‌త్యాయ‌త్నం చేశారంటూ.. పిన్నెల్లి రామ‌కృష్నారెడ్డి, ఆయ‌న సోద‌రుడు వెంక‌ట్రామిరెడ్డిపై కేసులు న‌మోద‌య్యాయి. ఆయా కేసుల్లో ముంద‌స్తు బెయిలు తెచ్చుకున్న పిన్నెల్లి ఇప్ప‌టి వ‌ర‌కు అరెస్టు నుంచి ర‌క్ష‌ణ పొందారు. అయితే.. ఈ ముంద‌స్తు బెయిలు గ‌డువు ముగిసిపోయింది. దీనిని పొడిగించేందుకు హైకోర్టు నిరాకరిం చింది. దీంతో పిన్నెల్లి సోద‌రుల‌ను అరెస్టు చేయాల‌ని ఎస్పీ ఆదేశించారు. దీంతో గుంటూరు పోలీసులు రంగంలోకి దిగి పిన్నెల్లి సోద‌రుల‌ను అరెస్టు చేసే ప్ర‌య‌త్నం చేశారు.

అయితే.. పోలీసుల రాక‌ను గ‌మ‌నించిన వెంక‌ట్రామి రెడ్డి త‌ప్పించుకుని పారిపోగా.. రామ‌కృష్ణారెడ్డి మాత్రం పోలీసుల‌కు చిక్కారు. దీంతో ఆయ‌న‌ను అరెస్టు చేశారు. తొలుత గుంటూరు ఎస్పీ కార్యాల‌యానికి త‌ర‌లించిన అనంత‌రం.. ఆసుప‌త్రికి తీసుకువెళ్లారు. అక్క‌డ వైద్య ప‌రీక్ష‌ల త‌ర్వాత‌.. స్థానిక కోర్టులో ప్ర‌వేశ పెట్టి.. అనంత‌ర చ‌ర్య‌లు తీసుకోనున్నారు. ఇదిలావుంటే.. పిన్నెల్లి అరెస్టు సంద‌ర్భంగా పోలీసులు గుంటూరులోని వైసీపీ కార్యాల‌యం స‌హా.. కీల‌క నేత‌ల ఇళ్ల వ‌ద్ద నిఘా పెట్టారు. ఎలాంటి అల‌జ‌డులు రేగకుండా జాగ్ర‌త్త‌లు చేప‌ట్టారు. గ‌తంలో ముంద‌స్తు బెయిల్ ఇచ్చిన కోర్టు పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డిని సొంత నియోజ‌క‌వ‌ర్గం మాచ‌ర్ల‌లో అడుగు పెట్ట‌కుండా ఆదేశించిన విష‌యం తెలిసిందే. దీంతో ఆయ‌న గుంటూరులోనే ఉంటున్నారు.