ఏపీ విష‌యంలో హైకోర్టు తీవ్ర వ్యాఖ్య‌లు!

జ‌గ‌న్ వివాదాస్ప‌ద నిర్ణ‌యాల్లో త‌న‌కు న‌చ్చ‌ని మీడియాపై నిషేధం విధించ‌డ‌మే. అప్ప‌ట్లో 2019-24 మ‌ధ్య‌.. కొన్ని చానెళ్ల‌ను రాష్ట్రంలో ప్ర‌జ‌లుఎవ‌రూ వీక్షించేందుకు వీలు లేకుండా.. సిటీ కేబుల్ ఆప‌రేట‌ర్ల‌పై ఒత్తిడి తెచ్చి.. వాటి ప్ర‌సారాల‌ను నిలుపుద‌ల చేయించారు. దీంతో ఆయా చానెళ్ల యాజ‌మాన్యాలు కోర్టుకు వెళ్లి రిలీఫ్ పొందాయి.

క‌ట్ చేస్తే.. ఇప్పుడు కూట‌మి స‌ర్కారు కొలువుదీరిన త‌ర్వాత‌.. సీఎం చంద్ర‌బాబుకు తెలిసి జ‌రిగిందో.. తెలియ‌క జ‌రిగిందో తెలియదు కానీ.. రాష్ట్రంలో ఈ నెల 8వ తేదీ నుంచి గ్రామీణ‌, న‌గ‌ర ప్రాంతాల్లోని సిటీ కేబుల్ ఆప‌రేట‌ర్లు.. కొన్ని వైసీపీ అనుకూల మీడియాలంటూ.. ముద్ర‌వేసి వాటిని ప్ర‌సారం చేయ‌డం మానేశారు. వీటిలో మాజీ సీఎం జ‌గ‌న్ సొంత చానెల్ సాక్షి స‌హా.. ఆయ‌న హ‌యాంలో స‌ర్కారుకు అనుకూలంగా ప్ర‌సారాలు చేశారని ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్న ఎన్టీవీ, టీవీ-9 స‌హా మ‌రికొన్ని చానెళ్లు ఉన్నాయి. దీంతో ఆయా ప్ర‌సారాలు నిలిచిపోయాయి. స‌ర్కారు ఉత్త‌ర్వులు ఇచ్చిన‌ట్టు ఎక్క‌డా లేదు. కానీ, కేబుల్ టీవీ ఆప‌రేట‌ర్లు మాత్రం వాటిని నిలుపుద‌ల చేశారు.

ఈ నేప‌థ్యంలో ఆయా చానెళ్ల యాజ‌మాన్యాలు ఢిల్లీ హైకోర్టును ఆశ్ర‌యించాయి. వీటిని విచారించిన కోర్టు తీవ్ర వ్యాఖ్య‌లే చేసింది. భావ‌ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ‌కు భంగం క‌లుగుతుంటే ప్ర‌భుత్వం ఏంచేస్తోంద‌ని ప్ర‌శ్నించింది. త‌క్ష‌ణ‌మే ఇలా చేసిన వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించింది. ఆయా చానెళ్ల ప్ర‌సారాల‌ను కొన‌సాగించాల‌ని.. ప్ర‌జ‌ల‌కు అనేక మాధ్య‌మాల్లో వార్త‌లు.. వినోదం అందుకునే హ‌క్కు ఉంద‌ని తెలిపింది. భావవ్యక్తీకరణ స్వేచ్ఛను ఎవరూ అడ్డుకోలేర‌ని పేర్కొంది. బ్లాక్ చేసిన చానళ్లను వెంటనే పునరుద్ధరించి, ప్రసారం చేయాలని ఆదేశించింది. ఈ మేరకు 15 మంది ఎంఎస్ఓలకు ఆదేశాలు జారీ చేసింది.