తిరుమల మారిపోతోందండోయ్.

ఐదేళ్ల వైఎస్సార్ కాంగ్రెస్ పాలనలో తిరుమలకు సంబంధించి ఎన్ని నెగెటివ్ న్యూస్‌లు మీడియాలో, సోషల్ మీడియాలో హల్‌‌చల్ చేశాయో గుర్తుండే ఉంటుంది. అనేకసార్లు అక్కడ అన్యమత ప్రచారం జరగడం.. భారీగా సేవల ధరలు పెంచడం.. భక్తులకు సౌకర్యాల కల్పనలో టీటీడీని ఎక్కడ లేని నిర్లక్ష్యం ప్రదర్శించడం.. దర్శనం-వసతికి సంబంధించి అనేక వివాదాలు నెలకొనడం.. ఇలా చాలానే జరిగాయి.

ఉద్దేశపూర్వకంగా తిరుమల పవిత్రతను దెబ్బ తీస్తున్నారని.. భక్తులను నిరుత్సాహ పరిచేలా కుట్రలు చేస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపించాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వతహాగా క్రైస్తవుడు కావడం.. ఏపీ అంతటా క్రైస్తవ మత ప్రచారం, మత మార్పిడి కార్యక్రమాలు జోరుగా జరగడంతో తిరుమల మీద ఆయన కక్ష కట్టారనే అభిప్రాయం జనాల్లోకి వెళ్లింది. అందుకు తగ్గట్లే అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి.

ఐతే ఇటీవలి ఎన్నికల్లో జగన్ పార్టీ ఓడిపోయి కూటమి అధికారంలోకి రాగానే.. తిరుమలలో పరిస్థితులు వేగంగా మారిపోతుండటం చర్చనీయాంశంగా మారింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాగానే అక్కడ కొన్ని మంచి మార్పులు జరిగాయి.

తిరుమల మాడ వీధుల్లో కూల్ పెయింట్ వేయడంతో ఎండలో చెప్పులు లేకుండా నడిచే భక్తులకు గొప్ప ఉపశమనం దక్కింది. ఇప్పుడు మధ్యాహ్న సమయంలో ఎవరి అరికాళ్లూ మండట్లేదు. ఇంత చిన్న విషయాన్ని కూడా గత ప్రభుత్వ హయాంలో ఎవ్వరూ పట్టించుకోలేదు.

అలాగే క్యూ కాంప్లెక్సుల్లో భక్తులకు దద్దోజనం, పులిహోర లాంటి ఇవ్వడం కొన్నేళ్ల నుంచి ఆపేశారు. కొత్త ప్రభుత్వం రాగానే ఇవి పున:ప్రారంభం అయ్యాయి. అంతే కాక క్యూ కాంప్లెక్సుల బయట ఎండలో వేచి ఉండే భక్తుల కోసం అత్యవసరంగా షెల్టర్లు నిర్మించారు.

అక్కడ నీళ్లు సహా కొన్ని సౌకర్యాలు కల్పించారు. దర్శనం, వసతి వంటి వాటి విషయంలోనూ త్వరలోనే మార్పులు చూస్తారని.. సేవల ధరలను కూడా తగ్గిస్తారని వార్తలు వస్తున్నాయి. అవన్నీ కూడా జరిగితే తిరుమలకు పునర్వైభవం రావడం, కొత్త ప్రభుత్వానికి వెంకన్న భక్తులు సెల్యూట్ చేయడం ఖాయం.