అమ‌రావ‌తి రైతులు మొక్కులు చెల్లించారు.. షాక్ ఏంటంటే!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి రైతులు.. ఆదివారం విజయవాడ కనకదుర్గ అమ్మవారి దర్శనానికి కాలినడకన బయలుదేరి మొక్కులు చెల్లించుకున్నారు. తుళ్లూరు నుండి పొంగళ్ళు నెత్తిన పెట్టుకొని విజయవాడ అమ్మవారి గుడికి బ‌య‌లు దేరిన అమరావతి మహిళా రైతులు, రైతులు, రైతు కూలీలు పెద్ద ఎత్తున ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మ‌హిళా రైతులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రావడంతో అమరావతి నిర్మాణం సాకారం అవుతుండడంతో తమ మొక్కులను చెల్లించుకుంటున్నామ‌ని తెలిపారు.

పొంగళ్ళు నెత్తిన, అమ్మవారు ఫోటో చేత్తో పట్టుకొని కాలినడకన విజయవాడ అమ్మవారి దేవస్థానానికి రాజధాని రైతులు బ‌య‌లు దేరిన రైతుల‌కు పోలీసులు గ‌ట్టి భ‌ద్ర‌త క‌ల్పించారు. ఇక్క‌డే చిత్ర‌మైన ఘ‌ట‌న ఉంది. ఇదే రైతులు గ‌త ప్ర‌బుత్వంలో పొంగ‌ళ్లు పెడితే.. ఇదే రోడ్డుపై వారిని అడుగు పెట్ట‌కుండా ఇదే పోలీసులు లాఠీ చార్జీలు చేసి..ర‌క్త‌పాతం సృష్టించారు. కానీ, ఇప్పుడు వారే రైతుల‌కు భ‌ద్ర‌త‌గా నిలిచారు. వైసీపీ నేత‌ల నుంచి నిర‌స‌న‌లు ఎదురు కాకుండా చూశారు.

ఈ కార్యక్రమానికి రాజధాని 29 గ్రామాల నుంచి పాల్గొన రైతులు, మహిళా రైతులు, రైతు కూలీలు పాల్గొన్నారు. 2020 జనవరి 10న గత ప్రభుత్వ హయాంలో అమరావతి ఏకైక రాజధానిగా నిలవాలని మొక్కుకునేందుకు ఇదేవిధంగా వెళ్లిన రైతులపై అప్పటి జగన్ సర్కార్ లాఠీ చార్జ్ చేయించింది. అప్పట్లో వారిని అడ్డుకునేందుకు దారి పొడవునా రోడ్డు కడ్డంగా ఇనుప కంచెలు ఏర్పాటు చేయించింది.

రాయపూడి పెట్రోల్ బంక్ వద్ద అప్పటి జిల్లా ఎస్పీ విజయ్ రావు, భారీగా పోలీస్ ల తో మోహరించారు. అంతేకాదు.. ఆయనే స్వయంగా లాఠీలతో రైతులు పై విరుచుకుపడ్డ వైనం అంద‌రికీ ఇప్ప‌టికీ గుర్తుంది. లాఠీ చార్జీలో రైతుల‌కు, కూలీలకు గాయాలు అయి రక్తం కారుతున్నా నాడు వెనక్కి తగ్గని రైతులు ముందుకు సాగారు. కాగా, నేడు మ‌రోసారి మొక్కులు చెల్లించేందుకు కాలినడకన బయలుదేరారు.

నాటి సంగతులు గుర్తు చేసుకుంటూనే నేడు పాదయాత్రగా అమ్మవారి దేవస్థానానికి బయలుదేరిన అమరావతి మహిళా రైతులు, రైతులు, రైతు కూలీలు త‌మ అనుభ‌వాల‌ను పంచుకున్నారు. రాష్ట్రంలో దూర దృష్టిగ‌ల నాయ‌కుడు సింహాసనం అధిష్టించాడంటూ.. చంద్ర‌బాబుపై ప్ర‌శంస‌లు కురిపించారు. త‌మ మొర విన్న అమ్మ(దుర్గ‌మ్మ‌) త‌మ‌కు న్యాయం చేసింద‌ని ఆనందం వ్య‌క్తం చేశారు.