వైసీపీ వెర్సస్ కూటమి.. అసెంబ్లీలో తేడా క్లియర్

అసెంబ్లీలో అధికార ప్రతిపక్షాలు రాజకీయ విమర్శలు, ఆరోపణలు చేసుకోవడం కొత్తేమీ కాదు. ఈ క్రమంలో గొడవలు జరిగి అసెంబ్లీ రణరంగంగా మారిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. ఐతే దశాబ్దాలుగా చూస్తున్న అసెంబ్లీ సెషన్లకు భిన్నమైన దృశ్యాలు గత ఐదేళ్లలో చూశాం.

ప్రతిపక్ష నేతల మీద దారుణాతి దారుణంగా వ్యక్తిగత వ్యాఖ్యలు, ఆరోపణలు చేసి రాజకీయాల మీద జనాలకు అసహ్యం పుట్టేలా చేశారనే విమర్శలను వైసీపీ నేతలు ఎదుర్కొన్నారు. “లోకేష్ ఎలా పుట్టాడు” అని ఒక మంత్రి చేసిన వ్యాఖ్యతో చంద్రబాబు తీవ్ర మనస్తాపానికి గురై అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు.

మరోవైపు ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడుతూ.. పవన్ నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడని వ్యాఖ్యానించడం జగన్‌కే చెల్లింది. తమ పార్టీకి 151 స్థానాలున్నాయని.. వాళ్లందరూ పైకి లేస్తే టీడీపీ సభ్యులు ఏమైపోతారంటూ ఎద్దేవా చేసిన ఘనత కూడా జగన్‌దే.

కట్ చేస్తే ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చింది. నిన్ననే అసెంబ్లీలో సభ్యుల ప్రమాణ స్వీకారం జరిగింది. ప్రమాణ స్వీకారం రోజు తప్పదు కాబట్టి వచ్చి జగన్ అండ్ కో ఆ తంతు పూర్తి చేశారు. రెండో రోజు సభలో జగన్ సహా వైసీపీ సభ్యులెవరూ లేరు.

సంప్రదాయంగా స్పీకర్ ఎన్నిక రోజు సభలో ఉండి ప్రతిపక్షాలు చేయాల్సిన కొన్ని పనులను జగన్ అండ్ కో చేయకపోవడం విమర్శలకు దారి తీసింది. ఐతే 2019లో ఎంత ఘోర పరాభవం ఎదురైనప్పటికీ.. చంద్రబాబు సహా తెలుగుదేశం సభ్యులంతా సభకు హాజరయ్యారు.

అవమానాలను ఎదుర్కొంటూ సభలో కొనసాగారు. తనను మానసిక వైద్యుడికి చూపించాలంటూ సీదిరి అప్పలరాజు లాంటి వాళ్లు దారుణమైన వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా చంద్రబాబు తట్టుకుని నిలబడ్డారు. మూడేళ్ల తర్వాత మాటలు మరీ శ్రుతి మించిన సందర్భంలో మాత్రమే ఆయన సభ నుంచి వెళ్లిపోయారు. కానీ ఇప్పుడేమో జగన్ అండ్ కో కేవలం ప్రమాణ స్వీకారం చేసి సభకు గుడ్ బై చెప్పి వెళ్లిపోయారు.

జగన్ అసలు మళ్లీ అసెంబ్లీకి వస్తాడా అన్నది సందేహంగా మారింది. ఐతే వైసీపీ సభలో లేకపోయినా.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ తదితరులు రాజకీయంగా విమర్శలు చేశారు, సభలో లేకుండా వెళ్లిపోవడాన్ని తప్పుబట్టారు తప్ప ఎగతాళి చేయలేదు.

వ్యక్తిగత విమర్శలు చేయలేదు. అంతే కాక నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చి జగన్ వాహనం అసెంబ్లీ లోపలకి రావడానికి అవకాశమిచ్చారు. అంతే కాక ప్రతిపక్ష నేత హోదా లేకపోయినా.. మంత్రుల తర్వాత మిగతా సభ్యుల కంటే ముందు జగన్‌కు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కల్పించారు. కూటమి ఇదే శైలిని అనుసరిస్తూ అసెంబ్లీ గౌరవాన్ని నిలబెట్టాలని సామాన్య జనం కోరుకుంటున్నారు.