జ‌గ‌న్ నిర్ణ‌యాలు.. రైతులను దూరం చేస్తాయా? ఓ చ‌ర్చ‌!

రాష్ట్రంలోనే కాదు.. దేశంలో కూడా ఎవ‌రు అధికారంలోకి రావాల‌న్నా.. అన్న‌దాతల ఓటు బ్యాంకు కీల‌కం. స‌మాజంలో ఎన్ని వృత్తులు ఉన్న‌ప్ప‌టికీ.. ఎన్ని ఉద్యోగాలు ఉన్న‌ప్ప‌టికీ.. వ్య‌వ‌సాయం.. వ్య‌వ‌సాయ అనుబంధ రంగాల‌పై ఆధార‌ప‌డిన వారి సంఖ్య ఎక్కువ‌గా ఉంది. దీంతో ఎన్నిక‌ల్లో వ్య‌వ‌సాయ రంగం చూపించే ప్ర‌భావం ఎక్కువ‌. 2014లో రైతుల‌కు రుణ‌మాఫీ చేసేది లేద‌న్నందుకే.. తాము అధికారంలోకి రాలేక‌పోయామ‌ని.. స్వ‌యంగా వైసీపీ అధినేత, ప్ర‌స్తుత సీఎం జ‌గ‌న్ అనేక సంద‌ర్భాల్లో చెప్పుకొచ్చారంటే.. రైతుల ఓటు బ్యాంకు, రాజ‌కీయంగా వారి సంతృప్తి ఏ రేంజ్‌లో అధికారాన్ని శాసిస్తాయో.. అర్ధ‌మ‌వుతుంది.

ఇంత‌కీ ఇవ‌న్నీ ఎందుకు ప్ర‌స్తావించాల్సి వ‌స్తోందంటే.. అధికారంలోకి వ‌చ్చిన ఏడాదిన్న‌ర‌లోనే.. సీఎం జ‌గ‌న్ తీసుకుంటున్న నిర్ణ‌యాలు.. రైతుల‌కు, వ్య‌వ‌సాయ రంగానికి వ్య‌తిరేకంగా ఉంటున్నాయ‌నే భావ‌న వ్య‌క్త‌మ‌వుతున్నందునే! నిజానికి రైతు భ‌రోసా.. వంటి సంచ‌ల‌నాత్మ‌క‌మైన కేంద్రాల‌ను ప్ర‌తి మండ‌లంలోనూ ఏర్పాటు చేసి.. ఇటు రైతులు, అటు దేశంలో కూడా మంచి గుర్తింపు పొందిన జ‌గ‌న్‌.. అనూహ్యంగా తీసుకున్న ఒక నిర్ణ‌యం.. రైతుల‌కు శాపంగా మారింద‌నే విమ‌ర్శ‌‌లు వినిపిస్తున్నాయి. మ‌రి దీనికి కార‌ణం.. ఏంటంటే.. రైతులు వినియోగించే వ్య‌వ‌సాయ విద్యుత్‌కు మీట‌ర్లు ఏర్పాటు చేయ‌డ‌మే!

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 7 ల‌క్ష‌ల మంది రైతులు.. ఎంత విద్యుత్ వినియోగిస్తున్నార‌నే విష‌యాన్ని లెక్క‌గ‌ట్టి నేరుగా బిల్లులు చెల్లించేలా వారికి విద్య‌త్ మీట‌ర్లు పెట్టాల‌ని జ‌గ‌న్ స‌ర్కారు నిర్ణ‌యించింది. దీనికి గాను శ్రీకాకుళం జిల్లాను ప్ర‌యోగాత్మ‌కంగా ఎంచుకుంది. అయితే, ప్ర‌త్య‌క్షంగా క‌రెంటు బిల్లులు రైతుల‌కు వ‌చ్చినా.. ప‌రోక్షంగా రైతులు ఆ బిల్లులు చెల్లించాల్సిన అవ‌స‌రం లేద‌ని.. రైతుల ఖాతాల్లోకి నిధుల‌ను ప్ర‌భుత్వమే ఠంచ‌నుగా వేసేస్తుంద‌ని మంత్రి బాలినేని శ్రీనివాస‌రెడ్డి దీనిపై వివ‌రణ ఇచ్చారు. వాస్త‌వానికి ఇప్ప‌టి వ‌ర‌కు వ్య‌వ‌సాయం విద్యుత్‌ను ఉచితంగానే అందిస్తున్నారు.

రైతులు వాడుకున్న విద్యుత్‌కు సంబంధించి ప్ర‌భుత్వ‌మే డబ్బులున్నపుడు డిస్కంలకు చెల్లిస్తోంది. అదే స్మార్ట్ మీటర్లు పెడితే… నెలనెలా ఠంచనుగా బకాయిలు కట్టేయాలి. అంటే ఉద్యోగుల జీతాల్లాగా బిల్లలు కట్టాలి… అది ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి పెంచుతుంది. పైగా .. ముందు మీరు క‌ట్టండి.. త‌ర్వాత మేం మీ ఖాతాల్లోకి వేస్తాం.. అనే ప‌రిస్థితి వ‌చ్చినా ఆశ్చ‌ర్య పోవాల్సిన అవ‌స‌రం లేదు.ఇది ప్ర‌త్య‌క్షంగా రైతుల‌కు భారంగా మార‌నుంద‌ని అంటున్నారు అన్న‌దాత‌లు. దీనిపై ఇప్ప‌టికే ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ప్ర‌తిప‌క్షాలు ఆరోప‌ణ‌లు చేయ‌డం, నిర‌స‌న‌ల‌కు పిలుపుఇవ్వ‌డం తెలిసిందే.. అయినా కూడా జ‌గ‌న్ ముందుకు వెళ్లాల‌నే నిర్ణ‌యించుకున్నారు.

ఇక‌, రైతు వ్య‌తిరేక నిర్ణ‌యంగా భావిస్తున్న మ‌రోదానికి కూడా జ‌గ‌న్ సై! అన్నారు. అదే.. కేంద్రం తీసుకువ‌చ్చిన తాజా వ్య‌వ‌సాయ బిల్లు. దీనికి రాష్ట్రంలోని టీడీపీ కూడా వ్య‌తిరేకంగా వ్యాఖ్య‌లు చేయ‌గా.. జ‌గ‌న్ మాత్రం.. కేంద్రంలోని బీజేపీకిమ‌ద్ద‌తిచ్చి.. బిల్లుకు స‌హ‌క‌రించారు. వాస్త‌వానికి ఈ బిల్లు దేశ‌వ్యాప్తంగా మంట‌లు రేపుతోంది. రైతు స్వేచ్ఛ‌కు ఇది మ‌రింత ప్ర‌తిబంధ‌కం కానుంద‌ని, వారి క‌ష్టాన్ని కార్పొరేట్లు శాసిస్తాయ‌ని, క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర నిర్ణ‌యించి.. రైతుల‌కు ఆద‌ర‌వుగా నిల‌వాల్సిన ప్ర‌భుత్వం ఈ బిల్లు ద్వారా త‌న బాధ్య‌త నుంచి త‌ప్పుకొంటుంద‌ని.. ప్ర‌తిప‌క్షాలు, పంజాబ్‌, హ‌రియాణా, తెలంగాణ ప్ర‌భుత్వాలు కూడా నెత్తీనోరూ బాదుకుంటున్నాయి.

ఈ క్ర‌మంలోనే తెలంగాణ సీఎం కేసీఆర్‌.. ఈ బిల్లును తేనెపూసిన క‌త్తితో పోల్చారు. రైతుల పాలిట మ‌ర‌ణ శాస‌నంగా పేర్కొన్నారు. దీనికి మ‌ద్ద‌తిచ్చేది లేద‌న్నారు. మ‌రి ఇంత వ్య‌తిరేక‌త ఉన్న బిల్లుకు జ‌గ‌న్ జై కొట్ట‌డం అంటే.. రైతుల్లో వ్య‌తిరేక‌త రాదా?! ఇలాంటి వాటికి ద‌గ్గ‌రై.. రైతుల‌కు మ‌నం దూర‌మ‌వుతామా? ఏంటీ నిర్ణ‌యాలు.. అని వైసీపీలోనే సీనియ‌ర్ల మ‌ధ్య‌ త‌ర్జ‌న భ‌ర్జ‌న మొద‌లైంది. చివ‌రాఖ‌రుకు ఏం జ‌రుగుతుందో చూడాలి. ఏదేమైనా.. తాజా నిర్ణ‌యాలు భ‌విష్య‌త్తును నిర్దేశిస్తాయ‌న‌డంలో సందేహం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.