జ‌నంలోకి రండి సారు.. లేదంటే కారు ప‌రారు

ఎన్నిక‌ల్లో గెలుపోట‌ములు స‌హ‌జం. మ‌హామ‌హుల‌కే ప‌రాజ‌యాలు త‌ప్ప‌లేదు. ఓట‌మి కార‌ణాల‌ను విశ్లేషిస్తూ, ప్ర‌జ‌ల్లో ఉంటూ తిరిగి పార్టీని ఎలా గెలిపించాల‌న్న దానిపై దృష్టి పెట్టాలి. కానీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం ఫాంహౌజ్ దాటి రానంటున్నారు. దీంతో రాష్ట్రంలో బీఆర్ఎస్ ప‌రిస్థితి రోజురోజుకూ క్షీణిస్తోంది.

పార్టీ ఖాళీ అయ్యే ప‌రిస్థితులు నెల‌కొంటున్నాయ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అయినా అధినేత ఫాం హౌజ్‌లోనే ఉంటానంటే ఎలా అని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులే ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నాయి.

గ‌తేడాది అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్‌కు 39 సీట్లే ద‌క్కాయి. కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చింది. ఓ వైపు ఓట‌మి బాధ ఉంటే మ‌రోవైపు పార్టీ ఫిరాయింపులు కేసీఆర్‌కు త‌ల‌నొప్పిగా మారాయి. అసెంబ్లీ ఎన్నిక‌ల త‌ర్వాత తుంటి శ‌స్త్రచికిత్స కార‌ణంగా కేసీఆర్ విశ్రాంతి తీసుకున్నారు.

తిరిగి లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు ముందు జ‌నాల్లోకి వెళ్లారు. కానీ ఈ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్‌కు ఒక్క సీటు కూడా రాలేదు. దీంతో కేసీఆర్ మ‌ళ్లీ ఫాం హౌజ్‌కే ప‌రిమిత‌మ‌య్యారు. కానీ రాష్ట్రంలో చూస్తే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వెళ్లిపోతున్నారు.

అటు కూతురు క‌విత‌కు బెయిల్ ద‌క్క‌క‌పోవ‌డంతో ఇంకా జైల్లోనే ఉన్నారు. ఇప్ప‌టికే మూడు నెల‌లు గ‌డిచిపోయాయి. మ‌రోవైపు విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం, కాళేశ్వ‌రం ప్రాజెక్టులో అవినీతి, ఫోన్ ట్యాపింగ్ కేసు త‌దిత‌ర అంశాలు కేసీఆర్ మెడ‌కు చుట్టుకుంటున్నాయి.

ఈ ప‌రిస్థితుల్లో కేసీఆర్ ప్ర‌జ‌ల్లోకి వ‌చ్చి అస‌లు విష‌యాలు చెప్పాల‌ని, పార్టీ క్యాడ‌ర్‌లో ఉత్సాహం నింపాల‌ని బీఆర్ఎస్ వ‌ర్గాలు బ‌లంగా కోరుకుంటున్నాయి. పార్టీ క‌ష్ట‌కాలంలో అధినేత అండ‌గా నిల‌వ‌క‌పోతే ఎలా అని ప్ర‌శ్నిస్తున్నాయి. త్వ‌ర‌లో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి.

వాటిపై ఇప్ప‌టి నుంచే ఫోక‌స్ పెట్టి క‌ష్ట‌ప‌డితే మెరుగైన ఫ‌లితాలు సాధించేందుకు అవ‌కాశం క‌లుగుతుంది. అలా జ‌రిగితే పార్టీ కోలుకునే ఛాన్స్ దొరుకుతుంది. ఇక పార్టీ ఎమ్మెల్యేలు జంప్ కాకుండా భ‌రోసా క‌ల్పించాల్సిన అవ‌స‌రం ఉంది. కానీ ఇవేమీ ప‌ట్ట‌న‌ట్లు ఫాం హౌజ్‌లోనే ఉంటే మాత్రం కారు ప‌రారు కావాల్సిందేన‌న్న టాక్ వినిపిస్తోంది.