ఏపీలో క్రిష్టియానిటీ 1.8 శాతం కాదు…25 శాతం: రఘురామ

తిరుమల డిక్లరేషన్ పై మంత్రి కొడాలి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కోటి రూపాయల విలువైన రథం దగ్దం కావడంతో గుడికి నష్టమేమీ లేదని ప్రభుత్వం కొత్త రథం చేయిస్తుందని, పది కేజీల వెండితో వచ్చే ఆరేడు లక్షల రూపాయలతో ప్రభుత్వం మిద్దలేమీ కట్టదని….ఇటువంటి ఘటనలకు పాల్పడేది విపక్షాలేనని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో కొడాలి నాని వ్యాఖ్యలకు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కౌంటర్ ఇచ్చారు.

ఒక హిందువై ఉండి ఒక క్రిష్టియన్ ముఖ్యమంత్రి చేతిలో పడి యావత్ హిందూ జాతిని దారుణంగా అవమానిస్తున్నారని నానిపై రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. అది కేవలం వెండి కాదని, కనకదుర్గమ్మవారి వెండి అని భావోద్వేగంతో చెప్పారు. ఇటువంటి వ్యాఖ్యలతో హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని, హిందుమతంపై ఈ తరహా వ్యాఖ్యలు చేయవద్దని అన్నారు.

ఏపీలో క్రిష్టియానిటీ పెరుగుతోందని, రికార్డుల ప్రకారం ఏపీలో 1.8 శాతం క్రిష్టియానిటీ ఉందని, కానీ, వాస్తవానికి అది 25 శాతం ఉందని రఘురామ అన్నారు. ఎంతోమంది ప్రజాప్రతినిధులు క్రిష్టియన్లయినప్పటికీ కూడా ఎన్నికలలో నెగ్గాలంటే హిందుమతం కావాలని, హిందు మతం తమదని చెప్పుకుంటూ నిరంతరం చర్చిల్లో తిరుగుతున్నారని షాకింగ్ కామెంట్లు చేశారు.

ఎలక్షన్ల కోసం ఇంట్లో హిందూ దేవతలు బొమ్మలు కూడా కొందరు ప్రజా ప్రతినిధులు తీసేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ మంత్రి, ఎమ్మెల్యే, ఎంపీ వారంలో ఎన్నిసార్లు చర్చికి వెళుతున్నారు..వారి కుటుంబ వివరాల మొత్తం వివరాలను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు లీగల్ ప్రొటెక్షన్ ఫోరం వారు సమర్పించారని, త్వరలో ఆ వివరాలనల్నీ బయటకు వస్తాయని రఘురామ అన్నారు.

ఏ అదశ్య శక్తి వెంకటేశ్వరరావు (కొడాలి నాని) అనే కభక్తుడితో ఇలా మాట్లాడిస్తుందో ఆ శక్తికి..చేతులెత్తి దండం పెడుతున్నానని, కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టవద్దని రఘురామ ఆవేదన వ్యక్తం చేశారు. హిందులు శాంతస్వభావులని, రెచ్చగొట్టినా తిరగబడరని, కానీ, తప్పదనుకుంటే తిరగబడతామని వార్నింగ్ ఇచ్చారు. హిందూ మతం జోలికి రావద్దని, తమను పరిరక్షించడానికి నాయకులున్నారని అన్నారు. సంతకం పెట్టి తిరుపతికి వెళ్లాలని జగన్ ను ఉద్దేశించి అన్నారు. తాను కూడా మిషనరీ స్కూల్లో చదివానని, క్రిష్టియానిటీని, వారి దైవాన్ని గౌరవిస్తానని, కానీ, హిందు మతాన్ని అవమానిస్తే సహించనని అన్నారు. వేరే మతాన్ని వెనకేసుకురావడానికి హిందువుల మనోభావాలు దారుణంగా దెబ్బతీయాల్సిన అవసరం లేదని రఘురామ అన్నారు.