అంబటికి ఇంటిపోరు మొదలైందా ? అసలేం జరుగుతోంది ?

అంబటి రాంబాబు..పరిచయం అవసరం లేని పేరిది. కొద్ది సంవత్సరాలుగా వైసిపిలో చాలా కీలకమైన నేతగా వ్యవహరిస్తున్నాడు. తమ పార్టీ తరపున ప్రత్యర్ధిపార్టీలపై మాటలతో దాడులు చేస్తు ప్రత్యర్ధులను ఉక్కిరిబిక్కిరి చేయగల నేర్పరిగా పాపులరయ్యాడు. అలాంటి గుంటూరు జిల్లాలోని ప్రముఖుల్లో ఒకడైన నరసరావుపేట ఎంఎల్ఏ అబంటి రాంబాబుకు ఇంటిపోరు మొదలైందా? పార్టీ వర్గాలిచ్చిన సమాచారం ప్రకారం అవుననే అనిపిస్తోంది.

అంబటి అక్రమంగా సున్నపురాయి మైనింగ్ చేస్తున్నాడనే ఆరోపణలు రావటం, ఫిర్యాదులు వెళ్ళటమే ఇందుకు తాజా నిదర్శనమని చెప్పాలి. అంబటికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయటంతో సరిపెట్టుకోకుండా పార్టీ కార్యకర్త ఒకళ్ళు ఏకంగా హైకోర్టులో ప్రజాహితం వ్యాజ్యం వేయటమే పార్టీలో సంచలనంగా మారింది.

అయితే ఇదే విషయమై అంబటి కూడా వివరణ ఇచ్చుకుంటూ అక్రమ మైనింగ్ చేద్దామని ప్రయత్నించి ఫెయిలైన వారే తనపై ఆరోపణలు చేస్తున్నట్లు కొట్టిపారేశాడు. నిజానికి ఎవరైనా తన పై వచ్చిన ఆరోపణలన్నీ నిజాలే అని ఒప్పుకుంటారా ? కాబట్టి అంబటి కూడా ఆరోపణలను తోసిపుచ్చాడు. అంబటి ఆరోపణలను ఖండించాడు సరే, మరి వాస్తవం ఏమిటి ? రాజుపాలెం మండలం కోట నెమలిపురి గ్రామంలో అంబటి అక్రమ మైనింగ్ చేస్తున్నాడనేది ఆరోపణలు. అక్రమ మైనింగ్ పై జిల్లా కలెక్టర్, గనుల శాఖమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదంటూ సదరు కార్యకర్త మండిపోయాడు.

అందుకనే ఏకంగా హై కోర్టులో కేసు వేశాడు. కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ అంబటి మీద కోపంతో పార్టీ కార్యకర్త కోర్టులో వేసిన పిటీషన్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఎలాగవుతుందంటూ వేసిన ప్రశ్నకు సమాధానం లేదు. కేసంటూ పడింది కాబట్టి క్షేత్రస్ధాయిలో వాస్తవాలను రికార్డు రూపంలో కోర్టుకు సమర్పించాలంటూ కోర్టు అడ్వకేట్ జనరల్ ను ఆదేశించింది. మరపుడన్నా వాస్తవాలు బయటపడతాయా ? అన్నదే సస్పెన్సుగా మారింది.

టిడిపి అధికారంలో ఉన్నపుడు వైసిపి నేతలు గురజాల ఎంఎల్ఏ యరపతినేని శ్రీనివాస్ పైన అక్రమ మైనింగ్ ఆరోపణలు చేయటం అందరికీ తెలిసిందే. వైసిపి ఆరోపణలను అప్పటి ప్రభుత్వం పట్టించుకోకపోవటంతో వైసిపి కోర్టులో కేసు వేసింది. తర్వాత విచారణలో యరపతి అక్రమ మైనింగ్ చేసినట్లు ఆధారాలతో సహా రుజువైంది. దీనిపై హైకోర్టు సిబిఐ విచారణకు కూడా ఆదేశించింది. ఇంతలో ఎన్నికలు రావటం టిడిపి ఘోరంగా ఓడిపోవటం అంతా చరిత్రయిపోయింది. యరపతి అక్రమ మైనింగ్ ను కోర్టు నిర్ధారించినా మాజీ ఎంఎల్ఏ మాత్రం తాను అక్రమ మైనింగ్ చేయలేదని బుకాయిస్తున్నాడు.

సరే తాజాగా అంబటిపై ఆరోపణలు, వాదనలు, వివాదాలు ఎలాగున్నా ఎంఎల్ఏకి ఇంటిపోరు మొదలైందన్నది వాస్తవం. పార్టీలో జెట్ స్పీడుతో దూసుకుపోతున్న అంబటి అంటే అంతే స్పీడులో వ్యతిరేకులు కూడా తయారయ్యే అవకాశాలను కొట్టిపారేయలేం. కాబట్టి తనకు తెలిసో లేకపోతే తెలీకుండానే పార్టీలోనే ప్రత్యర్ధులు తయారయ్యారనే అనిపిస్తోంది. మరి వీళ్ళని అంబటి ఎలా ఎదుర్కొంటాడో చూడాల్సిందే.