చంద్ర‌బాబుకు సాయిరెడ్డి సూక్తులు!

టీడీపీ అధినేత‌, ప్ర‌స్తుత సీఎం చంద్ర‌బాబుకు వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి సూక్తులు బోధించారు. చంద్ర‌బాబు త‌లుచుకుంటే.. ఇప్పుడు ఏపీకి ప్ర‌త్యేక హోదా తీసుకురావ‌చ్చ‌ని.. ఆ దిశ‌గా కృషి చేయాల‌ని సూచించారు. ఇప్పుడు కేంద్రంలో ఉన్న ప్ర‌భుత్వానికి రాష్ట్ర ఎంపీల మద్ద‌తు చాలా అవ‌స‌రం ఉంద‌ని.. కాబ‌ట్టి చంద్ర‌బాబు ఒత్తిడి చేయాల‌ని పేర్కొన్నారు. ఇప్పుడు కాక‌పోతే..మ‌రెప్ప‌టికీ.. రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా వ‌చ్చే ప‌రిస్థితి ఉండ‌బోద‌ని అన్నారు.

చంద్ర‌బాబు చిత్తశుద్ధి, ఈ రాష్ట్రానికి మంచి చేయాల‌ని ఏమైనా ఉంటే.. ఇప్పుడే ఆయ‌న స్పందించాల‌ని విజ‌య‌సాయిరెడ్డి అన్నారు. ప్ర‌త్యేక హోదా వ‌స్తే రాష్ట్రం అభివృద్దిలో ముందుకు సాగుతుంద‌న్నారు. కేంద్రంలో మోడీ స‌ర్కారు బ‌లం లేద‌ని.. ఇప్పుడు చంద్ర‌బాబు ఎంపీల‌తోనే ప్ర‌భుత్వం కొన‌సాగుతోంద‌ని .. కాబ‌ట్టి రాష్ట్ర ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌ను చంద్ర‌బాబు అర్ధం చేసుకుని ముందుకు సాగాల‌ని ఉచిత స‌ల‌హాలు ఇచ్చారు. ఎన్డీయే కూటమి మొత్తం టీడీపీ మద్దతుపై ఆధారపడడం కలిసి వచ్చే అంశమని చెప్పారు.

సీఎంగా ఉన్న చంద్ర‌బాబు కేంద్రాన్ని డిమాండ్ చేసే ప‌రిస్థితిలో ఉన్నార‌ని తెలిపారు. చంద్ర‌బాబు అనుకుంటే.. హోదా చిటెక‌లో ప‌ని అని.. దీనిని ఒప్పించ‌డం కూడా సుల‌భ‌మేన‌ని పేర్కొన్నారు. దీనికి కావాల్సిందల్లా చంద్ర‌బాబుకు ఈ రాష్ట్రానికి మంచి చేయాల‌న్న నిజమైన సంకల్పం మాత్రమేనని సాయిరెడ్డి హిత‌బోధ చేశారు. కేంద్రాన్ని నిల‌దీసైనా స‌రే.. హోదా సాధించాల‌ని తాము కోరుతున్న‌ట్టు సాయిరెడ్డి చెప్పారు.

కొస‌మెరుపు: త‌మ‌కు లోక్‌స‌భ‌లో బ‌లం లేక‌పోయినా.. రాజ్య‌స‌భ‌లో మోడీ స‌ర్కారు త‌మ‌పైనే ఆధార‌ప‌డి ఉంటుంద‌ని.. కాబ‌ట్టి.. తాము కూడా కేంద్రంలో చ‌క్రం తిప్పుతామ‌ని.. ఇటీవ‌ల ఇదే సాయిరెడ్డి వ్యాఖ్యానించారు. చంద్ర‌బాబుకు ఉన్న‌ది 16 మంది ఎంపీలైతే.. త‌మ‌కు 15(లోక్‌స‌భ 4+ రాజ్య‌స‌భ 11) మంది ఉన్నార‌ని.. కాబ‌ట్టి త‌మ ప్రాధాన్యంత‌మ‌కు ఉంటుంద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. మ‌రి.. సంఖ్యాబ‌లం.. రాజ్య‌స‌భ‌లో వైసీపీ మ‌ద్ద‌తు బాగానే ఉన్నప్పుడు .. చంద్ర‌బాబు కు చెబుతున్న నీతులు.. సాయిరెడ్డి స‌హా వైసీపీ నే పాటించొచ్చుక‌దా!? అనేది ప్ర‌శ్న‌. దీనికి మాత్రం సాయిరెడ్డి స‌మాధానం చెప్పడం లేదు.