చంద్రబాబు శ్వేతాస్త్రం !

ఆంధ్రాలో టీడీపీ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు తొలి విడతలో ఐదు సంతకాలు చేశారు. ప్రధానంగా ఫించన్ల పెంపు, 16 వేల పోస్టులతో మెగా డీఎస్సీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వాస్తవ ఆర్థిక చిత్రాన్ని ప్రజలు ముందు ఉంచాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది.

గత ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పులు, చెల్లించాల్సిన బిల్లులపై నాలుగు శ్వేత పత్రాలను విడుదల చేయనున్నారు. గత ప్రభుత్వంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా దెబ్బతిన్నదని చెబుతున్నారు.  ఈ మేరకు ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్‌ పర్యవేక్షణలో శ్వేతపత్రాల రూపకల్పన జరుగుతున్నట్లు తెలుస్తుంది. 

రాష్ట్రం మొత్తం అప్పులు ఎన్ని? ఎక్కడి నుంచి ఎంత రుణం తెచ్చారు? దేని కోసం ఖర్చు చేశారు ? అన్న దానిపై ఆరాలు తీస్తున్నారు.  గత ఐదేళ్లలో ఆర్థికశాఖలో చోటుచేసుకున్న  అవకతవకల్ని వెలికితీయాలని ఆర్థిక శాఖ అధికారులకు ప్రభుత్వం సూచించింది.

గత ఐదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన మొత్తం అప్పు 11 లక్షల కోట్లకు చేరిందని అంటున్నారు. అయితే గత ప్రభుత్వం ఇందులో సగం మాత్రమే చేసినట్లు చెబుతుండగా,   కార్పొరేషన్ల పేరుతో,  ప్రభుత్వ ఆస్తుల తనఖా ద్వారా తెచ్చిన రుణాలను వేరుగా చూపుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

రాష్ట్రాన్ని నడిపించడానికి వీల్లేని పరిస్థితుల్లో జగన్ ప్రభుత్వం వేస్ అండ్ మీన్స్, ఓవర్ డ్రాఫ్ట్‌లను ఉపయోగించుకొని రుణాలు తీసుకుందని, ఈ అప్పులు ఇప్పుడు రాష్ట్రం మీద పెనుభారం మోపుతున్నాయని చెబుతున్నారని, ఈ పరిస్థితులను అధిగమించే ప్రయత్నం చేస్తూనే అసలు పరిస్థితిని శ్వేతపత్రాల ద్వారా ప్రజలకు వివరించాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తుంది.