జ‌గ‌న్ చుట్టూ భారీ వివాదం.. క్యాంపు ఆఫీసుపై విచార‌ణ‌?

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ చుట్టూ భారీ వివాదం ముసురుకుంది. ముఖ్యంగా గుంటూరు జిల్లా శివారులోని తాడేప‌ల్లిలో ఏర్పాటు చేసుకున్న క్యాంపు కార్యాల‌యం నుంచే ఆయ‌న ఐదేళ్లు పాల‌న సాగించారు. ఈ స‌మ‌యంలో ఆయ‌న క్యాంపు కార్యాల‌యాన్ని ఇంద్ర భ‌వ‌నంగా తీర్చిదిద్దుకున్నారు. క‌ళ్లు మిరిమిట్లు గొలిపే లైటింగులు, శుభ్రంగా క‌డిగిన చేతుల‌తో ముట్టుకున్న మ‌ర‌క‌లు ప‌డ‌తాయా? అని అనిపించేంత రాయితో త‌న క్యాంపు కార్యాల‌యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇక‌, దీనిలో ఏర్పాటు చేసుకున్న ఫ‌ర్నిచ‌ర్‌.. అమెరికా అధ్య‌క్షుడి కార్యాల‌యంలో కూడా ఉండ‌ద‌ని అంటారు.

అంత ఖ‌రీదైన బ్రిట‌న్ రాజ‌వంశీకులు వినియోగించే ఫ‌ర్నిచ‌ర్‌ను జ‌గ‌న్ త‌న క్యాంపు కార్యాల‌యంలో వినియోగిస్తున్నార‌ని టీడీపీ నేత‌లు ఆరోపించారు. అదేస‌మ‌యంలో కిలోమీట‌రున్న‌ర దూరం మేర‌కు .. క్యాంపు కార్యాల‌యం ఉన్న మార్గంలో ఇత‌ర ప్ర‌జలను ఎవ‌రినీ అడుగు కూడా పెట్ట‌కుండా ఏర్పాటు చేసుకున్న ర‌హ‌దారి కూడా.. ఇప్పుడు వివాదంగా మారింది. వీటిపై టీడీపీ సీనియ‌ర్ నేత‌, దివంగ‌త కోడెల శివ‌ప్ర‌సాద్ త‌న‌యుడు.. శివ‌రామ‌కృష్ణ ప్ర‌భుత్వానికి ఫిర్యాదు చేశారు. జ‌గ‌న్ నివాసంలో రూ.18 కోట్ల రూపాయ‌ల విలువైన ఫ‌ర్నిచ‌ర్ ఏర్పాటు చేసుకున్న‌ట్టు చెప్పారు.

ఇదేస‌మ‌యంలో రేవేంద్ర‌పాటు వ‌ర‌కు వేయాల‌ని భావించిన రోడ్డును ఆపేసి ఆ నిధుల‌తో త‌ళ‌త‌ళ‌లాడేలా.. తాడేప‌ల్లికి ర‌హ‌దారి నిర్మించుకున్నార‌ని.. ఇది ప‌బ్లిక్ రోడ్డు అయినా.. దీనిని ప్రైవేటుగా వాడుకున్నార‌ని.. అదేవిధంగాప్ర‌తి ఆరు మాసాల‌కు కూడా.. తాడేప‌ల్లి క్యాంపు కార్యాల‌యం హంగుల‌కు రూ.కోట్లు ఖ‌ర్చు చేశార‌ని పేర్కొన్నారు. వీటికి ప్ర‌జాధ‌నం ఖ‌ర్చుచేశార‌ని తెలిపారు. ఇప్పుడు ఆయ‌న మాజీ సీఎం అయిన నేప‌థ్యంలో క‌నీసం ఫ‌ర్నిచ‌ర్‌ను అయినా.. ప్ర‌భుత్వానికి అప్ప‌గించాల‌ని కానీ, అలా చేయ‌లేద‌ని వ్యాఖ్యానించారు.

గ‌తంలో త‌న తండ్రి ఫ‌ర్నిచ‌ర్‌ను దొంగిలించార‌ని కేసు పెట్టార‌ని.. కానీ, తాను అలా చేయ‌లేద‌ని.. త‌న తండ్రి శివ‌ప్ర‌సాద్ వివ‌ర‌ణ ఇచ్చినా.. వేధించి ఆత్మ‌హ‌త్య చేసుకునే వ‌ర‌కు తీసుకువ‌చ్చార‌ని వాపోయారు. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ నిర్మించుకున్న తాడేప‌ల్లి ప్యాలెస్ ఖ‌ర్చుల‌ను, ఫ‌ర్నిచ‌ర్ ఖ‌ర్చును రాబ‌ట్టేలా.. ప్ర‌బుత్వం చ‌ర్య‌లు తీసుకోవ‌డంతోపాటు.. జ‌గ‌న్‌పై కేసులు పెట్టాల‌ని కోడెల శివ‌రామ‌కృష్ణ ప్ర‌బుత్వానికి విన్న‌వించారు. దీనిపై టీడీపీ నాయ‌కులు కూడా స్పందించారు. జ‌గ‌న్ ఇప్ప‌టికైనా ఫ‌ర్నిచ‌ర్ సొమ్మును ప్ర‌భుత్వానికి వెన‌క్కి ఇవ్వాల‌ని.. లేదా ఫ‌ర్నిచ‌ర్‌ను వెన‌క్కి ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై చంద్ర‌బాబు స‌ర్కారు ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.