సైకో పాల‌న‌కు నిద‌ర్శ‌నం.. వాటిని తొల‌గించం: చంద్ర‌బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. వైసీపీ ప్ర‌భుత్వం వ‌చ్చిన కొత్త‌లో అమ‌రావ‌తి ప్రాంతంలో అప్ప‌టి చంద్ర‌బాబు ప్ర‌భుత్వం బృహ‌త్త‌ర ల‌క్ష్యంతో ఏర్పాటు చేసిన ‘ప్ర‌జావేదిక‌’ను కేవ‌లం ఒక్క నిర్ణ‌యంతో కుప్ప కూల్చింది. క‌నీసం కోర్టుకు వెళ్లే స‌మ‌యం కూడా లేక‌పోయింది. అప్ప‌టి సీఎం జ‌గ‌న్ ప్ర‌జావేదిక‌లో ఐఏఎస్‌, ఐపీఎస్ అధికారుల‌తో తొలి భేటీ నిర్వ‌హించారు. ఈ స‌మావేశాన్ని అంద‌రూ సాధార‌ణ భేటీనే అనుకున్నారు. కానీ, అనూహ్యంగా జ‌గ‌న్‌.. అక్క‌డిక‌క్క‌డే.. ఈ భ‌వ‌నం.. అక్ర‌మంగా నిర్మించార‌ని.. న‌దీగ‌ర్భానికి దీనివ‌ల్ల‌ ప్ర‌మాద‌మ‌ని.. న‌దీ తీర ప్రాంతాల్లో నిర్మాణాలు చేయ‌రాద‌ని పేర్కొన్నారు.

అంతేకాదు..చంద్ర‌బాబు అక్ర‌మంగా నిర్మించిన ప్ర‌జావేదిక భ‌వ‌నాన్ని త‌క్ష‌ణం కూల్చేందుకు ఇక్క‌డ నుంచే ఆదేశాలు ఇస్తున్నానని జ‌గ‌న్‌ చెప్ప‌డం అప్ప‌ట్లో సంచ‌ల‌నంగా మారింది. స‌రిగ్గా మ‌ధ్యాహ్నం 1 గంట స‌మ‌యంలో ఆయ‌న అలా చెప్ప‌డం.. ఆ వెంట‌నే బుల్ డోజ‌ర్లు దూసుకురావ‌డం.. క్ష‌ణ‌కాలంలో జ‌రిగిపోయాయి. ఆ వెంట‌నే అధికారులు, సీఎం వెళ్లిపోగానే.. కూల్చి వేతల ప‌ర్వం జ‌రిగిపోయింది. దీనిని తెలుసుకున్న టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి దేవినేని ఉమా వంటివారు హైకోర్టుకు వెళ్లారు. అయితే.. దీనిని విచార‌ణ‌కు అప్ప‌టిక‌ప్పుడు చేప‌ట్టేందుకు కోర్టు నిరాక‌రించింది. ఈలోగా.. రాత్రికి రాత్రి నిర్మాణాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు.

తెల్ల‌వారి కోర్టులో ఈ కేసు విచార‌ణ‌కురాగా.. కోర్టు కూడా నిస్స‌హాయ‌త వ్య‌క్తం చేసింది. “కూలిపోయింది కదా.. ఇప్పుడు మేం మాత్రం ఏంచేయ‌గ‌లం” అని వ్యాఖ్యానిస్తూ.. పిటిష‌న్‌ను కొట్టేసింది. ఇక‌, అప్ప‌టి నుంచి ఆ శిథిలాలు అలానే ఉండిపోయాయి. ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. క‌నీసం ఆ ప్రాంతాన్ని కూడా వైసీపీ ప్ర‌భుత్వం గ‌త ఐదేళ్ల‌లో శుభ్రం చేసింది కూడాలేదు. తాజాగా ఇక్క‌డ ప‌ర్య‌టించిన చంద్ర‌బాబు.. ఈ శిధిలాల‌ను చూసి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. “వీటిని మేం కూడా తొల‌గించం. అక్క‌డే అలానే ఉండాలి. ఒక విధ్వంస పాల‌న‌కు.. ఒక సైకో ముఖ్య‌మంత్రి పాల‌న‌కు ఇవి నిద‌ర్శ‌నంగా అక్క‌డే ఉండాల‌ని మేం భావిస్తున్నాం. మేం వాటి జోలికి వెళ్లం” అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ఇక‌, త‌నను క‌లిసేందుకు భారీ ఎత్తున ప్ర‌జ‌లు గుమిగూడ‌డంతో చంద్ర‌బాబు సంతోషం వ్య‌క్తం చేశారు. అయితే.. పోలీసులు చంద్ర‌బాబును క‌ల‌వ‌కుండా మ‌ధ్య‌లో బారికేడ్లు పెట్టారు. వీటిని చూసిన చంద్రబాబు పోలీసుల‌పై సీరియ‌స్ అయ్యారు. “నేనేమీ ప‌ర‌దాల ముఖ్య‌మంత్రినికాదు. నాకేమీ ప్ర‌జ‌ల నుంచి బెదిరింపులు లేవు. ముందు ఆ బారికేడ్లు తీసేయండి. మీ మ‌న‌సుల్లోని బారికేడ్లు కూడా తొల‌గించుకోండి” అని వ్యాఖ్యానించారు. ప్ర‌జ‌లు త‌న‌ను క‌లిసేందుకు ఎక్క‌డ‌నుంచి ఎప్పుడైనా రావొచ్చ‌న్నారు. ప్ర‌త్యేకంగా స‌చివాల‌యంలో ఒక ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు తెలిపారు. వ‌చ్చి వెళ్లేందుకు ప్ర‌త్యేక ర‌వాణా స‌దుపాయాన్ని కూడా ఏర్పాటు చేస్తామ‌ని చెప్పారు.