అదృష్టం అంటే ఆ నలుగురిదే !

రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ప్రజలు ఎప్పుడు ఎలా ఆదరిస్తారో కూడా చెప్పలేం. ఏపీ ఎన్నికల్లో ఈ విషయం మరోసారి రుజువు అయింది. గత ఎన్నికల్లో 23 శాసనసభ స్థానాలకు పరిమితం అయిన టీడీపీ ఈ ఎన్నికల్లో ఏకంగా కూటమితో కలిసి 164 శాసనసభ, 21 లోక్ సభ స్థానాలలో గెలిచి అఖండ విజయం సాధించింది. అయితే ఈ ఎన్నికల్లో కనీసం టికెట్ దక్కడమే కష్టం అనుకున్న నలుగురు ఏకంగా శాసనసభ్యులుగా గెలిచి చంద్రబాబు మంత్రి వర్గంలో స్థానం సంపాదించడం విశేషం. అదృష్టవంతులు అంటే ఆ నలుగురే అన్న టాక్ ఇప్పుడు రాజకీయ వర్గాలలో జోరుగా నడుస్తుంది.

ఆ నలుగురే కొండపల్లి శ్రీనివాసరావు, సవిత, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, బీజేపీ నేత సత్యకుమార్ యాదవ్. వీరు నలుగురు ఎమ్మెల్యే టికెట్ల కోసం తీవ్ర పోటీ ఎదుర్కొని గెలిచి ఏకంగా అమాత్య పదవులను అందుకున్నారు. విజయనగరం జిల్లా గజపతి నగరం నుండి గెలిచి మంత్రి అయిన కొండపల్లి శ్రీనివాసరావు ఎన్నికల ముందు వరకు రాజకీయాలకు దూరంగానే ఉన్నాడు. ఆయన చిన్నాన్న కెఎ నాయుడు అక్కడ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయనకు ఈ సారి సర్వేలు అనుకూలంగా లేవని శ్రీనివాసరావుకు టికెట్ ఇచ్చారు. అయినా సొంత కుటుంబం నుండి సహకారం లేకపోయినా బొత్స అప్పలనరసయ్యపై 25 వేల ఓట్లతో గెలిచి ఎంఎస్ఎంఈ, సెర్ఫ్, ఎన్ఆర్ఐ ఎంపవర్ మెంట్ శాఖకు మంత్రి అయ్యాడు.

అనంతపురం జిల్లా పెనుగొండ నుండి గెలిచిన సవితకు టికెట్ విషయంలో టీడీపీ సీనియర్ నేత పార్ధసారధి నుండి తీవ్ర పోటీ ఎదురయింది. మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ పోటీలో ఉండడం కూడా దానికి కారణమయింది. ఎట్టకేలకు టికెట్ దక్కించుకుని ఏకంగా 33388 ఓట్లతో తొలిసారి గెలిచి బీసీ సంక్షేమం, హ్యాండ్లూమ్‌ అండ్‌ టెక్స్‌టైల్స్‌ శాఖా మంత్రి అయింది.

ధర్మవరం టికెట్ కోసం బీజేపీ నుండి మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ అలియాస్ వరదాపురం సూరి నుండి తీవ్ర పోటీ ఎదుర్కొన్నా బీజేపీలో సీనియర్ అయిన సత్యకుమార్ యాదవ్ కు బీజేపీ అధిష్టానం అవకాశం ఇచ్చింది. ఇక్కడ అనూహ్యంగా కేతిరెడ్డి వెంకట్ రామిరెడ్డి మీద 3734 ఓట్లతో విజయం సాదించాడు. బీజేపీ నుండి గెలిచిన 8 మందిలో సత్యకుమార్ యాదవ్ ఏకంగా ఆరోగ్యశాఖ మంత్రి అయ్యాడు.

ఉమ్మడి కడప జిల్లా నుండి రాయచోటిలో ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నాలుగుసార్లు అక్కడ వరసగా గెలిచిన గడికోట శ్రీకాంత్ రెడ్డిని 2495 ఓట్లతో ఓడించి తొలిసారి ఎమ్మెల్యే అయ్యాడు. చంద్రబాబు మంత్రివర్గంలో రవాణా, క్రీడలు, యువజన శాఖ అయ్యాడు. ఈ నలుగురు మంత్రులు తొలిసారి ఎమ్మెల్యేలు కావడం ఇక్కడ మరో విశేషం.