ఏపీ టీడీపీ ప‌గ్గాలు మారాయి.. మ‌రోసారి బీసీకే జై కొట్టిన బాబు!

ఏపీ రాష్ట్ర టీడీపీ అధ్య‌క్షుడిగా ఉన్న ఉత్త‌రాంద్ర‌కు చెందిన కింజ‌రాపు అచ్చెన్నాయుడు.. ఆ ప‌ద‌విని వ‌దులుకున్నారు. ప్ర‌స్తుతం మంత్రిగా ఆయ‌న బాధ్య‌త‌లు చేప‌ట్టారు. వ్య‌వ‌సాయ శాఖ మంత్రిగా అచ్చెన్న‌కు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అవ‌కాశం కల్పించా రు. దీంతో అటు ప్ర‌భుత్వం, ఇటు పార్టీ బాధ్య‌త‌ల‌ను రెండింటినీ స‌మ‌న్వ‌యం చేయ‌డం ఇబ్బంది అవుతుంద‌ని భావించిన చంద్ర బాబు.. అచ్చెన్నాయుడిని పార్టీ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించారు. 2020లో పార్టీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన అచ్చెన్నాయుడు స‌మ‌ర్థ‌వంతంగా పార్టీని ముందుకు న‌డిపించారు.

పార్టీ క‌ష్ట‌కాలంలో ఉన్న‌ప్పుడు .. స్వ‌యంగా రాష్ట్ర‌వ్యాప్త ప‌ర్య‌ట‌న‌లు చేసిన అచ్చెన్నాయుడు పార్టీని గాడిలో పెట్టారు. వివాదాలకు దూరంగా చంద్ర‌బాబు ఆదేశాల మేర‌కు ఆయ‌న పార్టీని న‌డిపించ‌డంలో స‌క్సెస అయ్యారు. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత‌.. టీడీపీని జాతీయ పార్టీగా ప్ర‌క‌టించిన చంద్ర‌బాబు తెలంగాణ‌, ఏపీల‌కు ప్ర‌త్యేక అధ్య‌క్షుల‌ను ఎంపిక చేశారు. తొలినాళ్ల‌లో ఉత్త‌రాంధ్ర‌లోని విజ‌య‌నగ‌రం జిల్లాకు చెందిన క‌ళా వెంక‌ట్రావుకు ఈ ప‌ద‌విని అప్ప‌గించారు. అయితే.. 2019లో పార్టీ ఓడిపోయిన త‌ర్వాత‌.. ఆయ‌న పార్టీ ప‌గ్గాలు వ‌దులుకున్నారు. దీంతో శ్రీకాకుళం జిల్లాకు చెందిన అచ్చెన్నాయుడును ఎంపిక చేశారు.

ఇక‌, ఇప్పుడు అచ్చెన్న‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డంతో ఏపీ టీడీపీ రాష్ట్ర ప‌గ్గాల‌ను సీనియ‌ర్ నాయ‌కుడు, బీసీ సామాజిక వ‌ర్గానికి చెందిన‌ పల్లా శ్రీనివాస రావుకు చంద్ర‌బాబు అప్ప‌గించారు. తాజా ఎన్నిక్ల‌లో ప‌ల్లా విశాఖ‌లోని గాజువాక నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం ద‌క్కించుకున్నారు. పార్టీలో సుదీర్ఘ కాలంగా ఆయ‌న ఉన్నారు. వివాద ర‌హితుడిగాను పేరు తెచ్చుకున్నారు. యాద‌వ సామాజిక వ‌ర్గంలోనూ మంచి పేరు ఉంది. ఈ నేప‌థ్యంలో మ‌రోసారి బీసీల‌కే చంద్ర‌బాబు ప్రాధాన్యం ఇస్తూ.. పార్టీ అధ్య‌క్ష ప‌ద‌విని ప‌ల్లా శ్రీనివాస‌రావుకు అప్ప‌గించ‌డం గ‌మ‌నార్హం. గాజువాక నియోజకవర్గం నుండి రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో 91 వేల ఓట్ల మెజారిటీతో ప‌ల్లా విజయం సాధించారు.