బిజెపి వైపు వంగవీటి చూపు.. ఎన్ని పార్టీలు మారుతాడో !

కృష్ణాజిల్లాలో నిలకడలేని నేతల పేర్లు చెప్పమంటే ఎవరికైనా ముందుగా గుర్తుకొచ్చేది వంగవీటి రాధాకృష్ణ పేరునే చెప్పుకోవాలి. వంగవీటి పేరే ఎందుకింతగా జనాలకు గుర్తుంటుందంటే ఆయన అన్ని పార్టీలు మారారు కాబట్టి. కాంగ్రెస్ పార్టీతో రాజకీయ ప్రస్ధానం మొదలుపెట్టిన రాధా తర్వాత అంటే 2009లో ప్రజారాజ్యంలో చేరారు. తర్వాత ప్రజారాజ్యం కాంగ్రెస్ లో కలిసిపోయింది. అదే సమయంలో కాంగ్రెస్ నుండి బయటకు వచ్చేసిన జగన్మోహన్ రెడ్డి వైసిపిని ఏర్పాటు చేశారు. పిఆర్పీతో పాటు మళ్ళీ కాంగ్రెస్ లోకి వెళ్ళటం ఇష్టంలేని రాధా వైసిపిలో చేరిపోయారు.

వైసిపిలో చేరిన రాధాకు జగన్ మంచి ప్రాధాన్యతే ఇచ్చారని పార్టీ నేతలు ఇప్పటికి చెప్పుకుంటారు. విజయవాడ పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. జగన్ ఎంతగా ప్రోత్సహించాలని అనుకున్నా రాధా మాత్రం దాన్ని ఉపయోగించుకోలేకపోయారు. నిజానికి చాలామంది నేతలకు లేని బ్రహ్మాండమైన లాంచింగ్ ప్యాడ్ రాధాకుంది. వంగవీటి అనగానే ఇప్పటికీ చాలామందికి వంగవీటి రంగానే గుర్తుకొస్తుంది. కృష్ణజిల్లాలో ప్రత్యేకించి విజయవాడ రాజకీయాల్లో వంగవీటి రంగా ముద్ర చాలా బలంగా ఉందనే చెప్పాలి. రంగా కొడుకు రాధా బరిలోకి దిగుతున్నాడంటే ప్రత్యర్ధిపార్టీలు షేకైపోవాలి.

అలాంటి బలమైన నేపధ్యం నుండి వచ్చిన రాధా ఇపుడు తరచూ పార్టీలు మారుతున్నాడంటే ఏమిటర్ధం ? ఏ పార్టీలోను నిలకడగా ఉండటం లేదు. అంటే పార్టీల అధినేతలతో రాధాకు పొసగటం లేదని తెలిసిపోతోంది. వైసిపి నుండి మొన్నటి ఎన్నికల ముందు టిడిపిలో చేరారు. ఎన్నికల్లో వైసిపి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దాంతో వైసిపిలో చేరలేక ఘోరంగా ఓడిపోయిన టిడిపిలో కంటిన్యు అవ్వలేక అందులో నుండి కూడా బయటకు వచ్చేశారు. టిడిపి నుండి బయటకు వచ్చేయగానే జనసేన వైపు చూశారు. పోనీ జనసేనలో అన్నా చేరారా అంటే అదీలేదు.

జనసేనలో కీలక నేతగా ఉన్న నాదెండ్ల మనోహర్ తో ఒకసారి అధినేత పవన్ తో మరోసారి భేటి అయ్యారే కానీ పార్టీలో చేరలేదు. కొంతకాలం అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన రాధా పేరు మళ్ళీ ఇఫుడు వినబడుతోంది. తొందరలో బిజెపిలో చేరుతారనే ప్రచారం ఊపందుకుంది. ఎందుకంటే రాధాకు పార్టీ అవసరం బిజెపికి నేతలవసరం. కాబట్టి పరస్పర అవసరాలను దృష్టిలో పెట్టుకునే పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజుతో టచ్ లోకి వెళ్ళారనేది సమాచారం. మరి బిజెపిలో చేరుతారో లేదో చెప్పలేకున్నారు. ఈ మొత్తం రాజకీయ ప్రస్ధానాన్ని చూస్తే రాధాలోనే లోపముందన్న విషయం తెలిసిపోతోంది. కీలక నేతలతో సయోధ్య లేకపోవటం, అధినేతలతో పడకపోవటమే రాధాకున్న అసలైన సమస్య. మరి బిజెపిలో చేరితే అన్నా రాధా స్ధిరమైన రాజకీయాలు చేస్తారా ? చూడాల్సిందే.