బాప‌ట్ల‌లో ఫ‌లించిన బాబు వ్యూహం.. వైసీపీకి దీటుగా అడుగులు

ఏమాటకామాటే చెప్పుకోవాలి. టీడీపీ అధినేత‌, మాజీ సీఎం చంద్ర‌బాబు వ్యూహాలు వేస్తే.. వాటికో ప్ర‌త్యేకత ఉంటుంది. వ్య‌తిరేక‌త‌ను కూడా అనుకూలంగా మార్చుకోగ‌ల నైపుణ్యం ఉన్న నాయ‌కుడిగా ఆయ‌న పేరు తెచ్చుకున్నారు. అయితే, ఇటీవ‌ల కాలంలో మ‌రీ ముఖ్యంగా గ‌త ఏడాది ఎన్నిక‌ల‌కు ముందు ఆయ‌న వేసిన కొన్ని వ్యూహాలు విఫ‌ల‌మ‌య్యాయి. అలాగ‌ని.. బాబుకు అస‌లు వ్యూహాలే ప‌న్న‌డం రాద‌ని అనుకోలేం. దీనికి ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణే.. గుంటూరు జిల్లా బాప‌ట్ల అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం. ఈ నియోజ‌క‌వ‌ర్గం రాజ‌ధాని అమ‌రావ‌తికి కూత‌వేటు దూరంలో ఉంది. దీంతో ఇక్క‌డ పాగావేయాల‌నేది బాబు వ్యూహం.

1985, 1994, 1999 ఎన్నిక‌ల్లో మాత్ర‌మే ఇక్క‌డ టీడీపీ గెలుపు గుర్రం ఎక్కింది. ఆ త‌ర్వాత వ‌రుస‌గా ప‌రాజ‌యాలే. మ‌రీ ముఖ్యంగా 2014,2019లో ఇక్క‌డ టీడీపీ చిత్తుగా ఓడిపోయింది. ఆ రెండు ఎన్నిక‌ల్లోనూ చంద్ర‌బాబు ఇక్క‌డ తీవ్ర మొహ‌మాటానికి పోయారు. పార్టీలో అప్ప‌టి కీల‌క నేత‌, ప్ర‌స్తుతం బీజేపీలో ఉన్న సుజ‌నాచౌద‌రి శిష్యుడిగా పేరున్న అన్నం స‌తీష్ ప్ర‌భాక‌ర్‌కు టికెట్ ఇచ్చారు చంద్ర‌బాబు. వాస్త‌వానికి అన్నం ప్ర‌భాక‌ర్‌కు ఇక్క‌డ పెద్ద‌గా ఫాలోయింగ్ లేదు. కానీ,సుజ‌నా అండ ఉండ‌డంతో బాబు కాద‌న‌లేక పోయారు. ఫ‌లితంగా రెండు సార్లు ఓడిపోవాల్సి వ‌చ్చింది.

పోనీ.. ఎన్నిక‌ల్లో గెలుపు ఓటములు స‌హ‌జ‌మే అనుకుని.. తిరిగి పార్టీని నిల‌బెట్టుకునేందుకు అన్నం ఇక్క‌డ ప్ర‌య‌త్నించింది కూడా ఏమీలేదు. ఈ విష‌యం బాబుకు తెలిసి కూడా గ‌త ఏడాది ఎన్నిక‌ల్లోనూ ఏమీ చేయ‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఇక‌, సుజ‌నా చౌద‌రి.. బీజేపీ బాట ప‌ట్ట‌డంతో అప్ప‌టికే చంద్ర‌బాబు ఎమ్మెల్సీ ఇచ్చినా.. కాదు పొమ్మంటూ.. అన్నం కూడా క‌మలం గూటికి చేరిపోయారు. దీంతో ఖాళీ అయిన‌.. బాప‌ట్ల ఇంచార్జ్ స్థానాన్ని క్ష‌త్రియ వ‌ర్గానికి చెందిన వేగేశ్న న‌రేంద్ర వ‌ర‌కు ఇచ్చారు చంద్ర‌బాబు. వాస్త‌వానికి వేగేశ్న‌.. 2014కు ముందు నుంచి కూడా ఇక్క‌డ పార్టీ త‌ర‌ఫున ప‌నిచేస్తున్నారు.

స్వ‌త‌హాగా.. స్వ‌చ్ఛంద సేవ‌లు చేసే వ్య‌క్తిగా స్థానికంగా పేరున్న న‌రేంద్ర వ‌ర్మ‌.. 2019 ఎన్నిక‌ల్లో ఎట్టి ప‌రిస్థితిలోనూ టికెట్ సంపాయించుకునే లక్ష్యంతో నియోజ‌క‌వ‌ర్గంలో దూకుడుగా ముందుకు సాగారు. ఇంటింటికీ.. తిరిగి అప్ప‌టి చంద్ర‌బాబు పాల‌న‌ను వివ‌రించారు. పాద‌యాత్ర కూడా చేశారు. ఈ విష‌యాలు చంద్ర‌బాబుకు తెలిసి కూడా ఆయ‌న‌ను ప‌క్క‌న పెట్టినా.. ఇప్పుడు వ్యూహాత్మ‌కంగా ఆయ‌న‌కే ప‌గ్గాలు ఇచ్చారు. వాస్త‌వానికి ఇక్క‌డ టీడీపీలో మ‌రో నేత కూడా పోటీకి వ‌చ్చారు. ఆయ‌నే గాదె వెంక‌ట‌రెడ్డి.. త‌న కుమారుడు మ‌ధుసూద‌న‌రెడ్డికి ఇంచార్జ్ పీఠాన్ని ఆశించినా.. బాబు వ్యూహాత్మ‌కంగా ప‌నిచేసే నేత‌కు ప‌గ్గాలు ఇవ్వ‌డంతో గాదె ఫ్యామిలీ వైసీపీ తీర్థం పుచ్చుకుంది.

ఇక‌, ఇప్పుడు ఈ నియోజ‌క‌వ‌ర్గంలో వేగేశ్న న‌రేంద్ర వ‌ర్మ దూకుడుగా ముందుకు సాగుతున్నారు. క‌రోనా స‌మ‌యంలో పేద‌ల‌కు నిత్యావ‌స‌రాల‌ను పంచారు. ప్ర‌త్యేకంగా ఓ వాహ‌నాన్ని ఏర్పాటు చేసుకుని ప్ర‌జ‌ల్లో తిరుగుతూ.. రాజ‌ధాని ఆవ‌శ్య‌కత‌ను వివ‌రిస్తున్నారు. అదేస‌మ‌యంలో పార్టీలో క‌కావిక‌ల‌మైన పాత నేత‌ల‌ను క‌లుపుకొని పోతున్నారు. ఆది నుంచి ఈయ‌న పార్టీకి సానుభూతిప‌రుడు కావ‌డం.. ఆర్థికంగా నియోజ‌క‌వ‌ర్గంలో కార్య‌క్ర‌మాలు చేస్తుండ‌డంతో బాప‌ట్ల‌లో ఇప్పుడు పార్టీ పుంజుకుంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. అది కూడా వైసీపీకి దీటుగా అడుగులు వేస్తోంద‌ని అంటున్నారు. మరి ఈ ప్ర‌భావం వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఉంటుందా? లేదా? అనేది చూడాలి.